Begin typing your search above and press return to search.

పెట్రోలును కంట్రోల్ చేసేది ఎన్నిక‌లా?

By:  Tupaki Desk   |   1 May 2018 5:43 AM GMT
పెట్రోలును కంట్రోల్ చేసేది ఎన్నిక‌లా?
X
క‌న్న‌డ రాష్ట్ర ఎన్నిక‌లు మ‌న జేబులు గుల్ల చేస్తున్నాయని ప్ర‌చారం చేస్తున్నాయి. సామాన్యుడిపై తీవ్ర ప్ర‌భావం చూపే పెట్రోలు - డీజీలు ధ‌ర‌లు త‌గ్గ‌క‌పోవ‌డం వెనుక ఇదే కార‌ణ‌మ‌ని స‌మాచారం. దేశంలోని అన్ని మహా నగరాల్లో ఈ నెల 24 నుంచి పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎటువంటి మార్పూ లేదు. ఇంధన ధరలను రోజువారీగా సవరించాలని ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) - భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) - హెచ్‌ పీసీఎల్ గత ఏడాది నిర్ణయించిన విషయం విదితమే. ఈ నిర్ణయం జరిగిన తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ 16 నుంచి 19వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు ఇంధన ధరలను సవరించని ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఇప్పుడు రెండోసారి దాదాపు వారం రోజుల పాటు ఈ ధరల జోలికి వెళ్లలేదు. మరికొద్ది రోజుల్లో కర్నాటక శాసనసభకు జరుగనున్న ఎన్నికలే ఇందుకు కారణమని, ఈ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం ధరలను పెంచవద్దని చమురు సంస్థలను ఆదేశించిందని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.

మీడియాలో వైర‌ల్ అవుతున్న ఈ వార్తలను చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తోసిపుచ్చుతూ.. అటువంటి ఆదేశాలేవీ ఇవ్వలేదని తెలిపారు. `ఇదంతా ప్రభుత్వం ఎంతో ఆలోచించి అమలు చేస్తున్న వ్యూహం. అంతర్జాతీయ మార్కెట్లలోని ముడి చమురు ధరలను ఆధారంగా చేసుకుని దేశీయ చమురు సంస్థలు ఇంధన ధరలను సవరిస్తున్నాయి. అంతర్జాతీయ ధరలతో మనం దీర్ఘకాలం పాటు పోటీపడకపోతే ఆ తర్వాత తలెత్తే సమస్యకు పరిష్కారం ఉండదు. అందుకే ఇంధన ధరల సవరణ విషయంలో చమురు సంస్థలకు ప్రభుత్వం స్వేచ్ఛనిచ్చింది` అని ఆయన చెప్పారు. మరోవైపు పెట్రోల్ - డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలించడం లేదని కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ స్పష్టం చేశారు.