Begin typing your search above and press return to search.

పార్టీ స‌మావేశంలో హాయిగా నిద్ర‌పోయిన సీఎం

By:  Tupaki Desk   |   10 Jan 2018 7:53 AM GMT
పార్టీ స‌మావేశంలో హాయిగా నిద్ర‌పోయిన సీఎం
X
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మ‌రోమారు అనూహ్య రీతిలో తెర‌మీద‌కు వ‌చ్చారు. గ‌తంలో చేతిలో నిమ్మ‌కాయతో కనిపించినా..రాష్ర్టానికి సొంత జెండా ఏర్పాటుచేసేందుకు క‌మిటీ వేసినా...ఆయ‌న స్టైలే డిఫ‌రెంట్‌. అలాంటి సిద్ధ‌రామ‌య్య తాజాగా ఆసక్తిక‌ర‌మైన ప‌రిణామంతో తెర‌మీద‌కు వ‌చ్చారు. ఓ వైపు పార్టీ స‌మావేశం జ‌రుగుతుండ‌గానే...నిద్ర‌పోయారు.

మడికెరిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశానికి ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య‌ హాజరయ్యారు. అయితే...ఒకవైపు పార్టీ సమావేశం జరుగుతుండగానే సిద్ధరామయ్య తన కుర్చీలో కూర్చుని హాయిగా నిద్రపోయారు. అటూ ఇటూ ఊగుతూ - ముక్కున వేలేసుకుని ఆపసోపాలు పడుతూ నిద్రపోతున్నారు. పార్టీ సమావేశంలో సిద్ధరామయ్య నిద్రపోతున్న ఈ దృశ్యాన్ని కొంద‌రు మీడియా ప్ర‌తినిధులు త‌మ కెమెరాల్లో బంధించారు. వీడియోలు తీశారు. అయితే ప‌క్క‌న ఉన్న నాయ‌కులెవ‌రూ ఆయ‌న‌కు స‌ర్దిచెప్ప‌క‌పోవ‌డం కూడా విశేషం. దీంతో సిద్ధరామ‌య్య‌ ఫొటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

ఇదిలాఉండ‌గా...సిద్ధ‌రామ‌య్య ఇలా బ‌హిరంగ స‌భలు - స‌మావేశాల్లో నిద్ర కార‌ణంగా ఇబ్బంది ప‌డ‌టం - మీడియాకు చిక్క‌డం మొద‌టిసారి ఏం కాద‌ని అంటున్నారు. 2014లో అయితే ఏకంగా మూడు పబ్లిక్ మీటింగుల్లో సీఎం సిద్దరామయ్య ఇలా నిద్ర‌పోతూ కెమెరాకు చిక్కారు. 2016లో ప్రతిష్టాత్మ‌క‌మైన ఇండియ‌న్ సైన్స్ కాంగ్రెస్‌ లో సాక్షాత్తు ప్ర‌ధాని మోడీ హాజ‌రైన స‌మావేశంలోనే ఆయ‌న నిద్ర‌పోయారు. కాగా, సిద్ధ‌రామ‌య్య‌కు ఆరోగ్య‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని ఆ రాష్ట్ర మీడియా ప‌లు క‌థ‌నాలు రాసింది. యోగా ద్వారా ఈ స‌మ‌స్య‌ను న‌యం చేసుకునేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నిస్తున్నార‌ని వెల్ల‌డించింది.