Begin typing your search above and press return to search.

కుమారస్వామి రివర్స్ రాజకీయం చేయగలరా?

By:  Tupaki Desk   |   13 July 2019 6:01 AM GMT
కుమారస్వామి రివర్స్ రాజకీయం చేయగలరా?
X
పొరుగు రాష్ట్రం కర్ణాటకలో గత వారం రోజులుగా రాజకీయాల్లో సంక్షోభం కొనసాగుతోంది. రెబెల్‌ ఎమ్మెల్యేల రాజీనామాతో ప్రారంభమైన రాజకీయ అనిశ్చితి వారం దాటినా గాడిలో పడలేదు. ఈ నేపథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం నిలుస్తుందా? కూలుతుందా? అనే అంశంపై రాజకీయ విశ్లేషకులు తేల్చలేకున్నారు. ఇందులో భాగంగా కర్ణాటకలో యథావిధిగా సాగే క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీలు తమ ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలించాయి. అయితే రాజీనామాలను ఆమోదించాల్సిందిగా సుప్రీంకోర్టు తీర్పు ఇస్తుందని ఆశగా ఎదురు చూసిన బీజేపీ నేతలకు చేదు అనుభవమే ఎదురయింది. మరోవైపు ఇలాంటి సంకట సందర్భంలో కర్ణాటక శాసనసభ వర్షాకాల సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. అయితే రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు సమావేశాలకు హాజరు కావాలని విప్‌ జారీ చేసినా.. అసమ్మతి నేతలు లెక్క చేయలేదు.

విధానసభ కార్యాకలాపాలు ప్రారంభమయ్యే ముందు ముఖ్యమంత్రి కుమారస్వామి - స్పీకర్‌ రమేశ్‌ కమార్‌ తో సుమారు 15 నిమిషాల పాటు సమావేశమయ్యారు. వీరి చర్చ సర్వత్రా ఆసక్తి రేకెత్తించింది. సభ్యులు విధానసభలోకి రాగానే మధ్యాహ్నం 12.50 గంటలకు వందేమాతరం గీతం పాడిన అనంతరం యథావిధిగా కార్యాకలాపాలు సాగాయి. ఆ తర్వాత ఇటీవల మరణించిన పలువురు 13 మంది ప్రముఖుల సంతాప తీర్మానానికి స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ అనుమతించారు. ఈసందర్భంగా సీఎం కుమారస్వామి మాట్లాడుతూ తానే అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. ప్రముఖులు - మాజీ నాయకుల సంతాప తీర్మానం సందర్భంగా సీఎం కుమారస్వామి మాట్లాడుతూ ఇటీవల కొందరు ఎమ్మెల్యేల నిర్ణయాల వల్ల రాజకీయ అనిశ్చితి ఏర్పడిందన్నారు. వారం రోజులుగా జరిగిన వరుస రాజకీయ ఘటనల నేపథ్యంలో తాను సభ విశ్వాసానికి సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. సభ విశ్వాసం చూరగొనకుండా తాను ఏ నిర్ణయం తీసుకోలేనన్నారు. ఈమేరకు స్పీకర్‌ ను గడువు కోరారు.

శుక్రవారం అసెంబ్లీ సమావేశాలతో పాటు రెబెల్‌ ఎమ్మెల్యేల రాజీనామాలపై సుప్రీంకోర్టు ఏమీ చెబుతుందా అని రాష్ట్రం మొత్తం వేచి చూసింది. స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ ఉద్ధేశపూర్వకంగా తమ రాజీనామాలను ఆమోదించకుండా మీనమేశాలు లెక్కిస్తున్నారని ఆరోపిస్తూ రెబెల్‌ ఎమ్మెల్యేలు బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. ఆ పిటిషన్‌ పై శుక్రవారం విచారణ జరిగింది. ఈ విచారణలో భాగంగా ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించకుండా, అలా అని వారిపై అనర్హత వేటు వేయకుండా ఈ నెల 15 వరకు యథాతథా స్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు సూచించింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో సంకీర్ణ ప్రభుత్వానికి కొద్దిగా ఊరట కలిగించినట్లైంది. ఈ నాలుగు రోజుల్లో తమ రెబెల్‌ ఎమ్మెల్యేలను దారికి తెచ్చుకోవాలని అధికార పక్షం నేతలు ఆలోచన చేస్తున్నారు.

మంగళవారం వరకు రాజీనామాలు ఆమోదించడం - అనర్హత వేటు వేయడం చేయొద్దని సుప్రీంకోర్టు స్పష్టమైన హామీ ఇవ్వడంతో పాటు సీఎం కుమారస్వామి స్వయంగా ముందుకు వచ్చి అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధం కావడంతో బీజేపీలో కలకలం రేగింది. సీఎం కుమారస్వామి ఏ ధైర్యంతో బలపరీక్షకు సిద్ధమవుతున్నారా అనే అనుమానాలకు దారి తీసింది. ఈ క్రమంలో అధికారపక్షం రివర్స్‌ ఆపరేషన్‌ చేస్తుందనే ఆరోపణల నేపథ్యంలో తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు బీజేపీ 105 మందిని రిసార్ట్‌కు తరలించింది. మరోవైపు అధికారపక్షం కాంగ్రెస్ - జేడీఎస్‌ పార్టీలు కూడా తమ ఎమ్మెల్యేలను ఈ మూడు రోజులు కాపాడుకునేందుకు రిసార్టులకు తీసుకెళ్లాయి. సుప్రీంకోర్టు తీర్పు వెలువడే వరకు తమ పార్టీ ఎమ్మెల్యేలంతా ఒక్కచోటే ఉండాలని రిసార్టుకు తరలించినట్లు ప్రతిపక్ష నేత యడ్యురప్ప తెలిపారు. జేడీఎస్‌ ఎమ్మెల్యేలు గత నాలుగు రోజులుగా దేవనహళ్లి సమీపంలోని ఓ రిసార్టులో మకాం వేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలందరినీ రిసార్టు బదులు యశవంతపురలోని తాజ్‌వివాంటా హోటల్‌ కు తీసుకెళ్లారు. అయితే ముంబయిలో ఉన్న అసంతృప్త ఎమ్మెల్యేలు ఎవరూ అందుబాటులోకి రాలేదు. మరోవైపు రాజీనామా చేసిన ఎమ్మెల్యే ఆనందసింగ్‌ శుక్రవారం గోవా తరలివెళ్లారు.