Begin typing your search above and press return to search.

బీజేపీపై కుమారస్వామి సంచలన ఆరోపణ

By:  Tupaki Desk   |   1 Nov 2018 4:42 PM GMT
బీజేపీపై కుమారస్వామి సంచలన ఆరోపణ
X
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి భారతీయ జనతాపార్టీపై సంచలన ఆరోపణ చేశారు. బీజేపీ తనను చంపించడానికి భారీ మొత్తం సుపారీగా ఇచ్చిందని ఆయన ఆరోపించారు. పదేళ్ల కిందట తాను బీజేపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం నడుపుతున్న సమయంలో ఇది జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు.

తనపై హత్యాయత్నం జరిగినప్పుడు బీజేపీ నేత యడ్యూరప్ప తనకు మద్దతుగా ఏమీ మాట్లాడలేదని ఆయన ఆరోపించారు. సుపారీ ఘటనపై నాడు బీజేపీ నేతలే ఫిర్యాదు చేశారని - బళ్లారిలో తనకు వ్యతిరేకంగా ఫిర్యాదు కూడా చేశారని అన్నారు. ఇప్పుడు తన ప్రభుత్వాన్ని కూల్చడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోందని - అందుకు దీపావళి టార్గెట్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారని ఆయన విమర్శించారు. తాను శివమొగ్గ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నానని, ఇటీవలి వాల్మీకి జయంతి వేడుకల్లో పాల్గొనకపోవడానికి అనారోగ్యం కారణమని అన్నారు.

కాగా, ఉప ఎన్నికల్లో భాగంగా కుమారస్వామి కోడ్ ను ఉల్లంఘిస్తున్నారని బీజేపీ నేతలు ఈసీకి పదేపదే ఫిర్యాదులు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ఆయన బడ్జెట్ లో తెలిపిన అంశాలపై ప్రసంగిస్తే, నిబంధనల ఉల్లంఘన ఎలా అవుతుందని ప్రశ్నించారు.

కుమారస్వామి ఆరోపణలు కర్ణాటకలో ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ అండతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ఆయన యడ్యూరప్పపై అనుమానాలు వ్యక్తంచేస్తూ హత్యాయత్నం ఆరోపణలు చేయడం కలకలం రేపింది.