Begin typing your search above and press return to search.

కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేలు మాజీ సీఎంను కలిశారా?

By:  Tupaki Desk   |   4 Jun 2020 4:45 AM GMT
కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేలు మాజీ సీఎంను కలిశారా?
X
కర్ణాటకలో కాషాయ జెండా ఎగరాలన్న పంతాన్ని కమలనాథులు ఎలా నెరవేర్చుకున్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సంకీర్ణ సర్కారుకు నూకలు చెల్లేలా చేసి.. తాము కోరుకున్నట్లు కర్ణాటక పాలనా పగ్గాల్ని చేపట్టిన వైనంపై విమర్శలు వెల్లువెత్తిన పెద్దగా పట్టించుకోలేదు. తాము అనుకున్న లక్ష్యాన్ని చేరామా? లేదా? అన్నదే ముఖ్యం తప్పించి.. మిగిలినవేమీ తమకు సంబంధం లేదన్నట్లుగా బీజేపీ అధినాయకత్వం వ్యవహరించిందన్న అపకీర్తిని మూటగట్టుకుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా మాజీ ముఖ్యమంత్రి.. కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బీజేపీ ప్రభుత్వంలో కుదుపు తేవటమే కాదు.. కొత్త అపనమ్మకం తెర మీదకు వచ్చింది. కర్ణాటకలోని 20 మంది బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. తిరుబాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అంతేకాదు.. వారిలో కొందరు తనను వచ్చి కలిసినట్లుగా పెద్ద బాంబేనే పేల్చారు. తనను కలిసిన వారంతా తనతో టచ్ లో ఉన్నట్లు చెప్పటంతో కమలనాథుల్లో కొత్త కంగారు షురూ అయ్యింది.

ఇంత చెప్పిన సిద్దూ.. తానేమీ చేయలేనని చెప్పటం ఆసక్తికరంగా మారింది. సీఎం యడ్డి పని తీరుపై వారు గుర్రుగా ఉన్నారన్న ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సైతం నిశితంగా పరిశీలిస్తుంది. బీజేపీ అంతర్గత వ్యవహారాన్ని సిద్దూ బయటపెట్టటం ద్వారా ఏం సాధించాలన్నది ఆయన ఉద్దేశం? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

ఇదిలా ఉంటే.. తాను యడ్డి సర్కారును అస్థిరపరిచే ప్రయత్నం చేయమని కాంగ్రెస్ చెబుతోంది. తాజా రాజకీయ కలకలానికి కారణమైన సిద్దరామయ్య వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. ఓటమి నుంచి సిద్దరామయ్య కోలుకోవటం లేదని.. ఆయన అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నట్లు చెప్పారు. పదే పదే ఈ తరహా వ్యాఖ్యలు చేయటం ఆయనకో అలవాటుగా మారినట్లుగా మండిపడుతున్నారు. ఏమైనా.. యడ్డి సర్కారులో లుకలుకలు మొదలయ్యాయన్న చర్చ జరిగేలా సిద్దూ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పక తప్పదు.