Begin typing your search above and press return to search.

బ‌ల‌రాం కామెంట్ః నెత్తికెక్కుతామంటే కుద‌ర‌దు

By:  Tupaki Desk   |   23 May 2016 9:19 AM GMT
బ‌ల‌రాం కామెంట్ః నెత్తికెక్కుతామంటే కుద‌ర‌దు
X
కేకలు - గొడవలు - గందరగోళం - సీనియర్‌ నాయకుల వాగ్బాణాలు.. ఎప్పుడేం జరుగుతుందో అన్న ఆందోళన మధ్య ఒంగోలులో తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు ఆద్యంతం ఉత్కంఠగా జరిగింది. అద్దంకి నియోజకవర్గం నుంచి హాజరైన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు క‌ర‌ణం బలరాం వర్గీయులు ఇటీవ‌లే పార్టీలో చేరిన ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వి వ‌ర్గంపై దాడికి దిగిన‌ట్లు ఈ గొడ‌వలో క‌నిపించింది. ఈ ఎపిసోడ్‌ పై పార్టీ అధినేత చంద్ర‌బాబు ఫైర‌య్యారు. అయితే మొత్తం ఎపిసోడ్‌ లో కీల‌కంగా మారిన క‌ర‌ణం బ‌లరాం త‌న‌ స్పంద‌న‌ను స్ప‌ష్టంగా వెల్ల‌డించారు.

కొత్తగా పార్టీలోకి వచ్చేవాళ్లు వస్తే ఇబ్బంది లేదని అయితే మొదటి నుంచీ పార్టీని నమ్ముకున్న వాళ్లకు ప్రాదాన్యం ఉండాల్సిందేన‌ని మీడియాతో మాట్లాడుతూ క‌ర‌ణం బ‌ల‌రాం స్ప‌ష్టం చేశారు. కొందరు పదేళ్లు అధికారం అనుభవించి...తెలుగుదేశం కార్యకర్తలను ఇబ్బందులు పెట్టి ఇప్పుడు చంద్రబాబు వ‌ల్ల‌ పార్టీలోకి వ‌చ్చార‌ని వ్యాఖ్యానించారు. వాళ్లు ఏ ప్యాకేజీల కోసం వచ్చారో తెలియదని ఇష్టమున్నా లేకున్నా కొన్ని ఆమోదించాల్సిందేన‌ని ప‌రోక్షంగా ఎమ్మెల్యే గొట్టిపాటి రవి చేరిక‌ను ఎద్దేవా చేశారు. పార్టీలో చేరిన వాళ్లు అధికారులను బెదిరిస్తున్నారని పోలీసు - రెవెన్యూ శాఖ‌ల‌తో పాటు ఇత‌ర‌ చిన్న ఉద్యోగులతో ఇలా వ్య‌వ‌హ‌రించ‌డాన్ని సహించమ‌ని బ‌ల‌రాం స్ప‌ష్టం చేశారు. అలాంటి వాళ్లు పోలీసులు లేకుండా బయట తిరగలేరని వ్యాఖ్యానించారు. ఇప్పుడు కరణం వర్గం, గొట్టిపాటి వర్గం అంటున్నారని అయితే అసలు వర్గాలు ఉండాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని ప్ర‌శ్నించారు. వారు ఫెయిర్‌ గా ఉంటేనే తాను ఫెయిర్‌ గా ఉంటాన‌ని ఆయ‌న తేల్చిచెప్పారు. ఇందిరా గాంధీ - ఎన్టీఆర్‌ లే ఓడిపోయారని త‌మ‌లాంటి వారి ఓట‌మి పెద్ద వింత ఏముంద‌ని ప్ర‌శ్నించారు.

జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ నూకసాని బాలాజీ మాట్లాడుతూ ఇతర పార్టీల్లో నుంచి తెదేపాలోకి వచ్చేవారు మొదటి నుంచీ పార్టీని అంటిపెట్టుకుని పనిచేస్తున్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలని స్ప‌ష్టం చేశారు. లేదంటే ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని వ్యాఖ్యానించారు. మమల్ని రెచ్చగొడితే ఫలితాలు వేరేగా ఉంటాయని ప‌రోక్ష హెచ్చ‌రిక‌లు జారీచేశారు. కందుకూరు నియోజకవర్గ ఇన్‌ ఛార్జి దివి శివరామ్ మాట్లాడుతూ చంద్రబాబు త‌మ‌ నాయకుడని పార్టీ కోసం ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తామ‌ని చెప్పారు. ఎవర్ని పార్టీలోకి తీసుకున్నా ఆహ్వానిస్తామ‌ని చివరకు త‌న‌ను పక్కనపెట్టినా పర్వాలేదని చెప్పారు. అయితే అదే సందర్భంలో పార్టీని తిట్టిన వాళ్లని ఒక కంట కనిపెట్టి ఉండాల్సిందేన‌ని తేల్చిచెప్పారు. ఆది నుంచీ పార్టీని నమ్ముకున్న వాళ్లకు మాత్రం అన్యాయం జరక్కూడదనేదే త‌మ ఆవేదన అని పున‌రుద్ఘాటించారు.