Begin typing your search above and press return to search.

కపిల్ శర్మ కోర్టుకెక్కారు!

By:  Tupaki Desk   |   17 Oct 2016 11:03 AM GMT
కపిల్ శర్మ కోర్టుకెక్కారు!
X
స్టాండప్ కామెడీ షోలతో టీవీ ప్రేక్షకులకు బాగా చేరువై, దేశంలోనే అత్యధికంగా ఆదాయం ఆర్జించే టాప్ కమెడియన్ కపిల్ శర్మ - గత కొన్ని రోజులు క్రితం ముంబై మున్సిపాలిటీ కార్పొరేషన్ అధికారులు తనను రూ.5 లక్షలు లంచం అడిగారని సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ట్విట్టర్ లో ప్రధానమంత్రినే ట్యాగ్ చేశారు. ప్రధాని నరేంద్రమోడీ అధికారంలోకి వస్తే "మంచి రోజులు" వస్తాయన్నారు... అవి ఇవేనా అంటూ ఆగ్రహంగా ప్రశ్నించారు. అయితే ఈ విషయం సద్దుమణిగిపోయిందేమో అనుకుంటున్న దశలో తాజాగా కోర్టును ఆశ్రయించారు కపిల్ శర్మ.

కపిల్ శర్మ అక్రమ కట్టడం కట్టారని, అందువల్ల దాన్ని కూల్చేయాలని బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాంబే హైకోర్టును ఆశ్రయించాడు కపిల్ శర్మ. ముంబైలోని గోరెగావ్ ప్రాంతంలో తన అపార్టుమెంటు విషయంలో పార్కింగ్ కోసం కేటాయించాల్సిన స్థలంలో కట్టడాలు కట్టారని, అందువల్ల అది అక్రమ నిర్మాణమని కార్పొరేషన్ అధికారులు అన్నారు. ఈ నేపథ్యంలో కపిల్ శర్మతో పాటు బిల్డర్ మీద కూడా బీఎంసీ అధికారులు కేసు పెట్టారు. అయితే అపార్టుమెంటులో కొంత భాగాన్ని కూల్చేయాలన్న బీఎంసీ అధికారుల ఆదేశాలను సవాలుచేస్తూ కపిల్ శర్మ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

కాగా కపిల్ శర్మతో పాటు అదే అపార్ట్ మెంట్ లో ఉంటున్న ఇర్ఫాన్ ఖాన్ పై కూడా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పీ-సౌత్ వార్డ్ సబ్ ఇంజినీర్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఇదే సమయంలో అపార్ట్ మెంట్ యజమాని, ఫ్లాట్ ఓనర్లపై మహారాష్ట్ర రీజినల్ టౌన్ ప్లానింగ్ యాక్ట్ - 1996 కింద కేసులు పెట్టారు. ఈ వ్యవహారంలో దోషులుగా తేలిన వారికి నెల నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్ష తో పాటూ రూ.2 వేలు నుంచి రూ.5 వేలు జరిమానా విధిస్తారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/