Begin typing your search above and press return to search.

బీసీసీఐకి షాకిచ్చిన కపిల్ దేవ్

By:  Tupaki Desk   |   2 Oct 2019 8:34 AM GMT
బీసీసీఐకి షాకిచ్చిన కపిల్ దేవ్
X
భారత క్రికెట్ నియంత్రణ మండలి చర్యకు ప్రతీ చర్యగా రాజీనామా చేసి భారత దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ షాకిచ్చారు. బీసీసీఐ నోటీసులు పంపడంపై రగిలిపోయిన కపిల్ దేవ్ తాజాగా ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీనిపై దేశవ్యాప్తంగా మాజీ క్రికెటర్లు బీసీసీఐ తీరుపై భగ్గుమంటున్నారు.

పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశం ఇప్పుడు భారత్ క్రికెట్ లో దుమారం రేపుతోంది. దీని ప్రకారం.. ఏ భారత క్రికెటర్, మాజీ క్రికెటర్ అయినా ఇతర పదవులు, పనులు చేయకుండా కేవలం బీసీసీఐ క్రికెట్ పాలనకు అంకితమవ్వాలి. అంటే వారి వ్యాపారాలు, అభిరుచులు, ఉద్యోగాలు అన్నీ వదిలిపెట్టి బీసీసీఐ కోసం పనిచేయాలన్న మాట..

ఈ పరస్పర విరుద్ధ ప్రయోజనాల ఇష్యూలో ఇప్పటికే సచిన్, సౌరభ్, రాహుల్ ద్రావిడ్ వంటి దిగ్గజాలకు కూడా బీసీసీఐ నోటీసులు పంపి విమర్శల పాలైంది. వారంతా బీసీసీఐ పదవులను వదులుకున్నారు. ఇప్పుడు బీసీసీఐ క్రికెట్ సలహా మండలి (సీఏసీ) సభ్యులకు బీసీసీఐ షాక్ ఇచ్చింది. ఈ సలహా మండలికి కపిల్ దేవ్ అధ్యక్షుడు. ఈయన బీసీసీఐ సలహా కమిటీ సభ్యుడిగానే కాకుండా వ్యాఖ్యాతగా.. ఫ్లడ్ లైట్ల సంస్థ అధిపతిగా.. భారత క్రికెటర్ల సంఘం సభ్యుడిగా ఉన్నాడు. దీంతో పరస్పర విరుద్ధ ప్రయోజనాల ఇష్యూలో ఈయనకు తాజాగా బీసీసీఐ నోటీసులు పంపింది.

తనకు నోటీసులు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కపిల్ దేవ్.. తాజాగా బీసీసీఐ కట్టబెట్టిన సీఏసీ పదవి నుంచే వైదొలిగి బీసీసీఐకి షాక్ ఇవ్వడం సంచలనంగా మారింది. నోటీసులకు సమాధానం చెప్పే ఖర్మ తనకు పట్టలేదనే కపిల్ దేవ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

గత జూలైలోనే కపిల్ దేవ్ తోపాటు ముగ్గురు సభ్యులతో బీసీసీఐ ఈ క్రికెట్ సలహా మండలిని ఏర్పాటు చేసింది. కపిల్ సారథ్యంలోనే భారత క్రికెట్ కోచ్, సహాయ సిబ్బందిని ఎంపిక చేశారు. ఇప్పుడు మూడు నెలలు కాకముందే ఇదే కపిల్ దేవ్ కు ఎక్కువ పదవుల్లో ఉన్నారని బీసీసీఐ నోటీసులు పంపడం దుమారం రేపింది. దీనిపై ఆయన భగ్గుమన్నారు.

ఇక ఈ వివాదంపై మాజీ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ సౌరభ్ గంగూలీ కూడా స్పందించారు. ‘ విరుద్ధ ప్రయోజనాలతో నోటీసులు పంపిన బీసీసీఐ తీరును ఎండగట్టాడు. దేశంలో భారత్ క్రికెట్ ను భగవంతుడు కూడా కాపాడలేడంటూ’ విమర్శించాడు.