Begin typing your search above and press return to search.

బాబుకు ‘ఆంధ్ర ఆపరిచితుడు’ బిరుదిచ్చిన కన్నా

By:  Tupaki Desk   |   3 Jun 2018 11:47 AM GMT
బాబుకు ‘ఆంధ్ర ఆపరిచితుడు’ బిరుదిచ్చిన కన్నా
X
‘ఆంధ్ర రాష్ట్ర అపరిచితుడు మాటలను నమ్మొద్దు. ఆయన చరిత్ర మొత్తం మోసపూరితం.. కుట్ర పూరితం.. వెన్నుపోట్లు.. దేశంలో ఏ రాష్ట్రం అయినా కేంద్రం మోసం చేసిందని చెప్పిందా.? ఎన్డీఏలో ఉంటూ కుట్రలు చేసి బీజేపీపై చంద్రబాబు బురద జల్లుతున్నారు..’ అని చంద్రబాబు వైఖరిపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా ఆదివారం ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబుది అన్నం పెట్టిన చేతిని నరికే సంస్కృతి అని’ విమర్శించారు. అనుభవం ఉన్నవ్యక్తి ప్రజలు ముఖ్యమంత్రిని చేస్తే గజదొంగను మించిపోయారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు అద్దె మైకు లాంటి వారని ఎద్దేవా చేశారు.

ఇక చంద్రబాబు నవనిర్మాణ దీక్షపై కూడా కన్నా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మూడు దీక్షల్లో కాంగ్రెస్ ను తిట్టిన బాబు.. ఈ దీక్షలో తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడని.. రాహుల్ గాంధీ మెప్పుకోసం మోడీ, అమిత్ షాలను విమర్శించాడన్నారు. 156 సంక్షేమ పథకాలను అమలు చేసి మోడీ అన్ని వర్గాలకు చేరువైతే.. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. ఏపీలో అసమర్ధ పాలన, పోలీస్ రాజ్యం నడుస్తుందని మండిపడ్డారు. న్యాయం చేయాలని బయటకు వస్తే వారిని బెదిరిస్తున్నారన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో ప్రజాధనాన్ని టీడీపీ కార్యకర్తలకు దోచిపెడుతున్నారని కన్నా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ నాయకులు మట్టి, ఇసుక, భూకబ్జా, మాఫియాలను పాల్పడుతున్నారని మండిపడ్డారు.

విభజన బిల్లులోని చాలా అంశాలను కేంద్ర అమలు చేసిందని.. సొమ్ము ఒకరిది.. సోకు ఒకరిదిలా చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నాడని కన్నా ధ్వజమెత్తారు. చంద్రన్న బీమా పథకానికి కేంద్రం ఇచ్చే నిధులు వాడుకుంటూ బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డాడు. చంద్రబాబుకు దమ్ముంటే ప్రజల్లోకి వచ్చి వాస్తవాలు చెప్పాలని కన్నా సవాల్ విసిరారు. చంద్రబాబు కుట్రలను ప్రజలకు వివరిస్తానని.. ఇంటింటికి బీజేపీ పేరుతో యాత్రలు చేపడుతామని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.