Begin typing your search above and press return to search.

రాయ‌ల సీమ సైంధ‌వుడు చంద్ర‌బాబు:క‌న్నా

By:  Tupaki Desk   |   7 July 2018 10:50 AM GMT
రాయ‌ల సీమ సైంధ‌వుడు చంద్ర‌బాబు:క‌న్నా
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన క‌న్నా రాష్ట్రవ్యాప్తంగా ప‌ర్య‌ట‌న చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే క‌న్నా ప‌ర్య‌టించిన ప్ర‌తి చోటా....ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడిపై మండిప‌డుతోన్న విష‌యం విదిత‌మే. తాజాగా, క‌డ‌ప జిల్లాలో ప‌ర్య‌టిస్తోన్న క‌న్నా....ఏపీ సీఎంపై మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాబోయే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ఓట‌మి త‌ప్ప‌ద‌ని - ఆ ఓట‌మి త‌ర్వాత ఆయ‌న చీక‌టి వ్యాపారం బ‌ట్ట‌బ‌య‌ల‌వుతుంద‌నే కార‌ణంతోనే బీజేపీపై నింద‌లు వేస్తున్నార‌ని మండిప‌డ్డారు. చంద్ర‌బాబుకు రాయలసీమ ప్రజలు ఓట్లు వేయలేదని....ఈ ప్రాంతానికి ఆయ‌న‌ సైంధవుడిలా మారి అభివృద్ధికి అడ్డుప‌డుతున్నార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. చంద్రబాబుకు ఎన్నిక‌ల‌ భయం పట్టుకుందని - ఎన్నిక‌ల్లో ఓడిపోతే ....అవినీతి సొమ్ముతో పెట్టిన పెట్టుబడులు బ‌య‌ట‌ప‌డ‌తాయ‌ని గుబులు చెందుతున్నార‌ని ఎద్దేవా చేశారు.

కొద్ద రోజుల క్రితం...క‌న్నాపై ఓ డ్రైవ‌ర్ చెప్పు విసిరిన ఘ‌ట‌న సంచ‌ల‌నం రేపిస సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే క‌డ‌ప‌లో క‌న్నా పర్యటనను సీపీఐ నేతలు అడ్డుకోబోతున్నార‌నే ముందుస్తు స‌మాచారంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క‌డ‌ప‌లో ప‌ర్య‌టించిన క‌న్నా...చంద్ర‌బాబు పై నిప్పులు చెరిగారు. రాబోయే ఎన్నికల్లో ఓడిపోతాన‌ని చంద్ర‌బాబుకు భ‌యం ప‌ట్టుకుందని అన్నారు. రాయ‌ల సీమ‌కు చంద్ర‌బాబు అన్యాయం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. 70 శాతం పూర్తయిన గాలేరు నగరి-హంద్రీనీవా ప్రాజెక్టులను పూర్తి చేయకుండా తాత్సారం చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. ప్ర‌తి ఏడాది...అంచ‌నా వ్యయాలను పెంచుకుంటూపోతూ కమీషన్లు దండుకుంటున్నారని నిప్పులు చెరిగారు. అంత‌కుముందు - రైతుల స‌మ‌స్య‌ల‌ను ప‌క్క‌న బెట్టి చంద్ర‌బాబు హ్యాపీ సండే కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌డంపై క‌న్నా మండిప‌డ్డ సంగ‌తి తెలిసిందే. నయవంచన దీక్షలను ఆపివేసి రైతుల‌ను ఆదుకోవాలని - చిత్తూరు విజ‌యా డైరీని గాలికొదిలేసిన చంద్ర‌బాబు..‘హెరిటేజ్’ ను అభివృద్ధి చేసుకుంటున్నార‌ని క‌న్నా మండిప‌డ్డారు. చిత్తూరులోని చక్కెర ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు.