Begin typing your search above and press return to search.

బీజేపీ డైరెక్ట్ ఎంట్రీ..బాబు టీం రౌండ‌ప్ ల‌క్ష్యం

By:  Tupaki Desk   |   7 Jun 2018 8:38 AM GMT
బీజేపీ డైరెక్ట్ ఎంట్రీ..బాబు టీం రౌండ‌ప్ ల‌క్ష్యం
X
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై బీజేపీ ఎదురుదాడి మొద‌లుపెట్టింది. ఇన్నాళ్లు రాజ‌కీయప‌ర‌మైన విమ‌ర్శ‌ల‌కే ప‌రిమితం అయిన బీజేపీ ఇక రాజ్యాంగ‌బ‌ద్ద‌మైన వేదిక‌ల ద్వారా బాబు టీంను ఇర‌కాటంలో పెట్టేందుకు సిద్ద‌మైంది. ఇందులో భాగంగా మొద‌టి ఆప‌రేస‌న్ మొద‌లుపెట్టింది. త‌న కొత్త స్కెచ్‌ లో భాగంగా మొద‌ట్లోనే బాబు స‌న్నిహితుల‌ను టార్గెట్ చేసింది. ఏకంగా గ‌వ‌ర్న‌ర్‌ కు ఫిర్యాదు చేసింది. ఏపీ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మ‌న్ కుటుంబ‌రావు బీజేపీపై - ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీపై తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లో తాము బ‌య‌ట‌పెట్ట‌బోయే అంశాల‌తో మోడీ టీంలో వ‌ణుకు ప‌డుతుంద‌ని వ్యాఖ్యానించారు. దీంతో పాటుగా ఏపీ మంత్రి అఖిల‌ప్రియ సైతం ప్ర‌ధానిపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. మోడీ అత్యాచారాల‌ను ప్రోత్స‌హిస్తున్నార‌ని క‌ల‌క‌లం రేకెత్తించే వ్యాఖ్య‌లు చేశారు.

కేబినెట్ హోదా గ‌ల ఇద్ద‌రు ప్ర‌భుత్వంలోని పెద్ద‌లు ప్ర‌ధానిపై తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన‌ప్ప‌టికీ... చంద్ర‌బాబు స్పందించ‌ని నేప‌థ్యం ప‌లు వ‌ర్గాల‌ను ఆశ్చ‌ర్యంలో ప‌డేసింది. ప్ర‌భుత్వంలోని ముఖ్యుల తీరుపై భ‌గ్గుమ‌న్న‌బీజేపీ దీనిపై రాజ్యాంగబ‌ద్ధ‌మైన పోరాటానికి శ్రీ‌కారం చుట్టింది. బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా ల‌క్ష్మీనారాయ‌ణ తాజాగా గ‌వ‌ర్న‌ర్‌ కు ఫిర్యాదు చేశారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ నేతలు - మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిప‌డ్డారు. 2019 ఎన్నికల్లో మళ్ళీ గెలిచే అవకాశం లేదని ప్రధానిని దూషిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి ముందే సంస్కార హీనులుగా మాట్లాడుతున్నారని విరుచుకుప‌డ్డారు. ఏపీ మంత్రి అఖిలప్రియ వాడిన భాష ప్రజాస్వామ్యబద్దంగా లేదని, ఆమెను వెంటనే బ‌ర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్లానింగ్ కమిషన్ వైస్‌ చైర్మన్ కుటుంబరావు మాట్లాడిన మాటలు కూడా అలాగే ఉన్నాయని క‌న్నా ఆక్షేపించారు. అందుకే వారిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ ని కలిశామ‌న్నారు.

ఏపీ బీజేపీ నేతలపైన కార్యకర్తలపైన ఇష్టానుసారంగా దాడులు చేస్తున్నారని క‌న్నా ఆరోపించారు. జాతీయ అధ్యక్షడు అమిత్ షా తిరుమల పర్యటనలో కూడా టీడీపీ నేతలు దాడులు చేశారని పేర్కొన్నారు. పోలీసులపై ప్రజాస్వామ్య పరిరక్షణ చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. అవినీతి ఎప్పుడు జరుగుతూనే ఉందన్నారు. ఇన్ని రోజులు టీడీపీతో మిత్ర బంధం పాటించామ‌ని అవినీతిని అసమర్ధ పాలన కప్పిపుచ్చుకునేందుకే బీజేపీ నుండి వైదొలిగామ‌న్నారు. అయితే దీనిపై సీఎం చంద్ర‌బాబు స్పందించ‌క‌పోగా ఎదురుదాడి చేయ‌డం చిత్రంగా ఉంద‌న్నారు.