Begin typing your search above and press return to search.

‘బాబు’ను బేస్ చేసి వెంకయ్యకు ‘కన్న’మేసాడు..

By:  Tupaki Desk   |   15 May 2018 6:41 AM GMT
‘బాబు’ను బేస్ చేసి వెంకయ్యకు ‘కన్న’మేసాడు..
X
చంద్రబాబునాయుడు-వెంకయ్యనాయుడు.. సామాజికంగా ఇద్దరూ ఒకటే సామాజికవర్గం.. అందుకే ఢిల్లీలో వెంకయ్య ఉన్నన్నాళ్లు చంద్రబాబుది ఆడింది ఆటగా మారింది. ఎన్నో పథకాల ద్వారా ఏపీకి నిధుల వరద పారించారు వెంకయ్య.. మోడీ కన్ను పడిందో లేక దురదృష్టమో కానీ ఎప్పుడైతే ఉపరాష్ట్రపతిగా వెంకయ్య వెళ్లిపోయారో.. అప్పుడే చంద్రబాబు కథ అడ్డం తిరిగింది. మోడీతో తెగతెంపులకు దారితీసింది.

హోదా వద్దూ ప్యాకేజీ ముద్దు అంటూ చంద్రబాబు - వెంకయ్యలు గతంలో ఏపీ ప్రజలను ఒప్పించారు. ఇప్పుడేమో చంద్రబాబు ప్లేట్ ఫిరాయించి హోదా ఇవ్వకుండా బీజేపీ మోసం చేసిందంటున్నారు. ఈ కీలక పరిణామాల నేపథ్యంలోనే తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన కన్నా లక్ష్మీనారాయణ.. ఇద్దరు నాయుడుల వైఖరిని ఢిల్లీ వేదికగా తూర్పర పట్టడం హాట్ టాపిక్ గా మారింది.

కన్నా లక్ష్మీ నారాయణ తనకు పదవి కట్టబెట్టినందుకు కృతజ్ఞతగా ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తొలి డైలాగ్ లోనే చంద్రబాబును ఏకిపారేశాడు. ‘చంద్రబాబు కేంద్రం తన మీద కేసులు పెడుతుందని పదేపదే అంటున్నారని.. ఆయన తప్పు చేశారు కనుకే అలాంటి మాటలు మాట్లాడుతున్నాడని ’ కన్నా విమర్శించారు. గద్దెనెక్కగానే చంద్రబాబును టార్గెట్ చేసి కన్నా ముందుకెళ్లడంతో బీజేపీ స్ట్రాటజీ అర్థమైపోయింది.

ఇక కన్నా ఉపరాష్ట్రపతి వెంకయ్యను వదలకుండా సెటైర్ వేశారు. ‘‘ప్యాకేజీయే ఏపీకి దివ్యౌషధం అంటూ గతంలో జిల్లాల్లో చెప్పి ఇదే నాయకులు సన్మానాలు పొందారని.. ఇప్పుడు చంద్రబాబు ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని గగ్గోలు పెట్టడం ఎంత వరకు కరెక్ట్ అని’’ మండిపడ్డారు.. ఇలా చంద్రబాబు వెనుకలా ఉండి నడిపించిన వెంకయ్యపై ఇన్ డైరెక్ట్ గా కన్నా టార్గెట్ చేసి విమర్శలు చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపాయి. కన్నా దూకుడుగా చంద్రబాబు- వెంకయ్యల బంధాన్ని బట్టబయలు చేసి చెడుగుడు ఆడుకోవడం హాట్ టాపిక్ గా మారింది.