Begin typing your search above and press return to search.

హమ్మయ్యా...కనికా కలవరం ఇక లేదబ్బా

By:  Tupaki Desk   |   23 March 2020 1:40 PM GMT
హమ్మయ్యా...కనికా కలవరం ఇక లేదబ్బా
X
బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కు సంబంధించిన కరోనా కలవరం ఎపిసోడ్ ముగిసిపోయింది. నిన్నటిదాకా కనికా కపూర్ ఎపిసోడ్ పై పెద్ద ఎత్తున కథనాలు వినిపించగా... కనికా కారణంగా ఏకంగా భారత ప్రథమ పౌరుడు - రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కనికాతో కలిసి పార్టీలో పాల్గొన్న వారు, ఆ పాల్గొన్న వారు కలిసిన మరింత మంది ప్రముఖులు... కనికాకు కరోనా పాజిటివ్ అని తేలగానే బెంబేలెత్తిపోయారు. కొందరు స్వీయ నిర్బంధంలోకి వెళితే.. మరికొందరు నిర్దారణ పరీక్షల కోసం పరుగులు పెట్టారు. మొత్తంగా సెలబ్రిటీ వర్గంలో ఓ రకమైన ప్యానిక్ వాతావరణం క్రియేట్ అయ్యింది.

అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం మేరకు కనికా కపూర్ కారణంగా నెలకొన్న కలవరానికి చెక్ పడినట్టేనని చెప్పక తప్పదు. ఎందుకంటే కనికాతో కలిసి పార్టీలో పాల్గొన్న వారితో పాటు సదరు ప్రముఖులు కలిసిన మిగిలిన వారికి కూడా కరోనా నెగెటివ్ అని తేలింది. మొత్తం 266 మందికి పరీక్షలు చేయగా... వారిలో ఏ ఒక్కరికి కూడా కరోనా పాజిటివ్ అని తేలలేదు. అంటే కనికాకు కరోనా పాజిటివ్ అని తేలినా... ఆమెతో కలిసి పార్టీలో ఎంజాయ్ చేసిన వారితో పాటు.. సదరు ఎంజాయ్ చేసిన వారు కలిసిన ప్రముఖులు.. మొత్తంగా 266 మంది కరోనా నెగెటివ్ అని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇటీవలే విదేశాలకు వెళ్లి వచ్చిన తర్వాత కనికా కపూర్ ఓ పెద్ద పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే - ఆమె కుమారుడు - ఎంపీ దుష్యంత్ - కేంద్ర మాజీ మంత్రి జతిన్ ప్రసాద్ దంపతులు సహా పెద్ద సంఖ్యలో ప్రముఖులు హాజరయ్యారు. ఆ తర్వాత దుష్యంత్... రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరు కావడంతో పాటుగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో అత్యంత సన్నిహితంగా మెలిగారు. ఈ క్రమంలో కనికాకు కరోనా పాజిటివ్ అని తేలగానే రాష్ట్రపతితో సహా కనికాతో పార్టీలో పాల్గొన్న వారంతా షాక్ కు గురయ్యారు. ఎందుకైనా మంచిదని అందరూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. అయితే పరీక్షల్లో ఏ ఒక్కరికి కూడా కరోనా పాజిటివ్ అని రాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.