Begin typing your search above and press return to search.

వైసీపీలోకి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ​

By:  Tupaki Desk   |   12 Dec 2016 9:41 AM GMT
వైసీపీలోకి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ​
X
ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వ‌ల‌స‌ల జోరు కొన‌సాగుతోంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ కు వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ కండువా క‌ప్పారు. లోట‌స్ పాండ్ లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో తూర్పుగోదావరి పార్టీ నేత‌లు కూడా పాల్గొన్నారు.

కాపు సామాజికవర్గానికి చెందిన కందుల దుర్గేష్‌కు రాజమండ్రి రూర‌ల్లో మంచి పట్టు ఉంది. అయితే ఇటు రాష్ట్రంలో, అటు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎదుగుద‌ల‌కు ఏ మాత్రం అవ‌కాశం కనిపించ‌క‌పోవ‌డంతో ఇటీవ‌ల రాజమండ్రి రూరల్‌ కార్యకర్తలతో సమావేశమైన కందుల వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. కార్యకర్తలంతా కాంగ్రెస్‌ను వీడి వైసీపీలో చేరాలని సూచించారు. దీంతో కందుల వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కందుల గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్నారు.

ఇదిలాఉండ‌గా కందుల దుర్గేష్ కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తుండడంతో ఇక తూర్పుగోదావరి జిల్లాలో కాంగ్రెస్‌ ఉనికి కోల్పోయినట్టేనని భావిస్తున్నారు. రాష్ట్ర విభజన త‌ర్వాత స‌మ‌ర్థుడైన నాయ‌కుడికి ప‌గ్గాలు అప్ప‌గించేందుకు వెతుకుతున్న క్ర‌మంలో కందుల దుర్గేష్‌కు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలను పార్టీ అధిష్టానం అప్ప‌గించింది. ఇటీవ‌ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డం ద్వారా పార్టీ ఉనికిని చాటడంలో కొద్దిమేర సఫలమయ్యారు. అయితే కార్య‌క‌ర్త‌ల ఒత్తిడి మేర‌కు ఆయ‌న వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. దీంతో జిల్లాలో కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు మాత్రమే చెప్పుకోదగ్గ నేతగా ఉన్నారు.