Begin typing your search above and press return to search.

బీజేపీ మంత్రికి టీడీపీ ఎమ్మెల్యే షాక్

By:  Tupaki Desk   |   20 Feb 2018 4:29 PM GMT
బీజేపీ మంత్రికి టీడీపీ ఎమ్మెల్యే షాక్
X
చంద్రబాబు కేబినెట్ లో ఉన్న బీజేపీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ పై తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ మండిపడ్డారు. ఆయన ప్రోటోకాల్ పాటించకుండా తనను అవమానించారంటూ ఫైరయ్యారు. ఎమ్మెల్యే అనుచరులు మంత్రిని అడ్డుకున్నారు. తమ ఎమ్మెల్యేను అవమానించారంటూ వారు నిరసన తెలిపారు. ఎమ్మెల్యే స్వయంగా అక్కడికి చేరుకుని ప్రోటోకాల్ పాటించకపోవడంపై సీరియస్ అయ్యారు.

తిరుపతి స్విమ్స్ లో నిర్వహించిన ఓ అధికారిక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అయితే, ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే అయిన సుగుణమ్మను ఆహ్వానించలేదు. దీంతో ఆమె ఆగ్రహిస్తూ ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించలేదని, గతంలో కూడా తనను ఆహ్వానించని సంఘటనలు ఉన్నాయని.. అవమానిస్తున్నారని ఆరోపించారు. అందుకే దీనిపై నిలదీసేందుకే అక్కడికి వచ్చానని అన్నారు.

తనను పిలవకపోవడం ఒక్కటే కాదని.. కనీసం సీఎం చంద్రబాబు ఫొటోలు కూడా పెట్టలేదని.. ఆమె ఆరోపించారు. అయితే.. కామినేని దీనిపై వివరణ ఇస్తూ.. అది గవర్నింగ్ కౌన్సిల్ మీటింగని..రాజకీయ సమావేశం కానందున ఎమ్మెల్యేను పిలవలేదని వివరించారు. అయితే.. అందుకు సుగుణమ్మ కౌంటరేశారు. స్విమ్స్ గవర్నింగ్ కౌన్సిల్ కు చంద్రబాబు నాయుడు చైర్మన్ గా ఉన్నారని - ఆయన ఫొటోను ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.