Begin typing your search above and press return to search.

చిల్లర సాయం గురించి అన్ని గొప్పలా హరిబాబు

By:  Tupaki Desk   |   17 Feb 2016 5:39 AM GMT
చిల్లర సాయం గురించి అన్ని గొప్పలా హరిబాబు
X
చేసేది తక్కువ.. చెప్పుకునేది ఎక్కువన్నట్లుగా మారింది ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు వైఖరి చూస్తుంటే. విభజన సందర్భంగా దారుణంగా దెబ్బతిన్న ఏపీకి ఏన్నో చేస్తామని మాట ఇచ్చిన దానికి భిన్నంగా మోడీ సర్కారు ఏం చేసిందో అందరికి తెలిసిందే. దానికి బదులుగా.. కేంద్రం దయాదాక్షిణ్యాల మీదనే ఏపీ సర్కారు బతుకుతున్నట్లుగా మాట్లాడటం హరిబాబుకే చెల్లుతుంది. ఏపీ సమగ్రాభివృద్ధిగా బీజేపీ సర్కారు కట్టుబడి ఉందని చెబుతున్న ఆయన.. స్వతంత్ర భారతచరిత్రలో గడిచిన 18 నెల్లలో మరే రాష్ట్రానికీ ఇవ్వనన్నటి నిధుల్ని కేంద్రం ఏపీకి ఇచ్చినట్లుగా చెప్పుకున్నారు.

నిజమే.. స్వతంత్ర భారత చరిత్రలో మరే రాష్ట్ర విభజనను ఏపీని చేసినట్లుగా.. పార్లమెంటు తలుపులు మూసేసి.. టీవీల్లో లైవ్ లను కట్ చేసి.. నాటి అధికార కాంగ్రెస్.. నాటి విపక్షమైన బీజేపీ కలిసి దెబ్బ తీసిన వైనాన్ని మర్చిపోలేం. నాడు చేసిన దానికి మూల్యం చెల్లించటానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ మోడీ తన ఎన్నికల ప్రచార సభలో ఆంధ్రోళ్లకు ఇచ్చిన హామీల్ని మర్చిపోలేం. ఏపీకి ఎంతో అవసరమైన ప్రత్యేక ప్యాకేజీ కానీ.. ప్రత్యేక హోదా గురించి కానీ గడిచిన 18నెలల్లో మోడీ సర్కారు ఏమీ చేసింది లేదన్న విషయాన్ని మర్చిపోకూడదు.

అంతదాకా ఎందుకు.. ఏపీ రాజధాని అమరావతికి కేంద్రం ఏం ఇస్తుందన్న విషయాన్ని ఇప్పటివరకూ స్పష్టం చేయలేదన్న విషయం హరిబాబుకు తెలీదా? ఇలాంటివన్నీ వదిలేసి.. ఏపీకి తమ పార్టీ ఏదో భారీగా పీకేసినట్లుగా హరిబాబు చెప్పటం అభ్యంతరకరమే. అదేమంటే చిల్లర సాయాల గురించి ప్రస్తావిస్తూ పెద్ద జాబితాను చదివే ప్రయత్నం చేస్తున్నారు.

ఎన్ని విద్యాసంస్థలు.. మరెన్ని పరిశోధనా సంస్థలు.. ఇంకెంత సాయం చేస్తే హైదరాబాద్ లాంటి మహానగరం ఏపీకి వస్తుంది? ఏటా దాదాపు రూ.50వేల కోట్ల ఆదాయాన్ని అందించే హైదరాబాద్ లాంటి నగరాన్ని తయారు చేసి ఏపీ ప్రజలకు కానుకగా ఇవ్వగలిగితే.. ఏపీకి చాలానే చేశామనే మాట చెప్పుకోవాలన్న ఆలోచన హరిబాబుకు వస్తే బాగుంటుంది. అంతేకానీ.. చిన్న చిన్న సాయాలకే మాగొప్పలు చెప్పేసుకోవటం.. అదేమంటే.. తమ దయాదాక్షిణ్యాల మీదనే ఏపీ సర్కారు బతుకుతోందన్న మాటల్ని హరిబాబు లాంటి వాళ్లు చెప్పుకోవటం సిగ్గుచేటన్నది మర్చిపోకూడదు. ఒకవేళ అలాంటి మాటల్నే చెబుతూ ఉంటామని హరిబాబు లాంటోళ్లు ఫిక్స్ అయితే.. విభజనకు సహకరించిన ఏపీ కాంగ్రెస్ నేతలకు.. నేడు గొప్పలు చెప్పుకునే ఏపీ బీజేపీ నేతలకు మధ్య తేడా ఏమీ లేదన్న విషయాన్ని మర్చిపోకూడదు.