Begin typing your search above and press return to search.

కామపిశాచి ఈ మాజీ టీడీపీ నేత.. వేధింపులతో బాలిక ఆత్మహత్య

By:  Tupaki Desk   |   31 Jan 2022 4:30 AM GMT
కామపిశాచి ఈ మాజీ టీడీపీ నేత.. వేధింపులతో బాలిక ఆత్మహత్య
X
విజయవాడలో వెలుగు చూసిన ఒక కామపిశాచి వికృత చేష్టలకు తాళలేక పద్నాలుగేళ్ల బాలిక ఆత్మహత్య చేసుకున్న వైనం షాకింగ్ గా మారింది. ఈ కామపిశాచి సంఘంలో పెద్ద మనిషిగా చెలామణీ కావటం.. తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి (ఈ ఉదంతం బయటకు రాగానే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు) కావటంతో ఇది కాస్తా రాజకీయ రగడగా మారింది. ఇలాంటి పనులు చేసినోడి పార్టీ ఏదైనా.. ఈ మానవ జంతువు కారణంగా పద్నాలుగేళ్ల పాప మరణించటం కలిచివేస్తోంది. అతడి అసభ్యకర మాటలు.. లైంగిక చేష్టల్ని భరించలేకపోయిన బాలిక నిస్సహాయ స్థితిలో ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు విడిచింది.

విజయవాడ నగరం కుమ్మరిపాలెం సెంటర్ సమీపంలో జరిగిన ఈ ఘటన తాజాగా బయటకు వచ్చి పెను సంచలనంగా మారింది. ఈ విషయం తెలిసిన వారంతా ఆగ్రహంతో ఉగిపోతున్నారు. నిందితుడ్ని ఉరి తీయాలని.. కఠినంగా శిక్షించాలని మండిపడుతున్నారు. ఆత్మహత్య చేసుకునే ముందు మూడు పేజీల లేఖను సదరు బాలిక రాసింది. తాను ఎంతలా వేధింపులకు గురయ్యానో అందులో పేర్కొంది. ఈ మూడు పేజీల లేఖలో కొంత భాగం బయటకు వచ్చి.. వైరల్ గా మారింది.

‘‘అమ్మా.. నేనీ విషయాన్ని మొదట్లోనే చెప్పలేదు. చాలా భయపడ్డా. సిగ్గుగా భావించా. జీవితంలో ఇంకేదైనా సమస్య వస్తే చనిపోయేదానిని కాదేమో. ఈ విషయంలో ఏమీ చేయలేకపోతున్నా. దీనంతటికి కారణం వినోద్ జైన్. రెండు నెలలుగా లైంగికంగా వేధిస్తున్నాడు. తరచూ నా శరీరాన్ని తాకుతున్నాడు. మిమ్మల్ని వదిలి వెళ్లాలని లేదు. తప్పని పరిస్థితి వచ్చింది’ అంటూ రాసిన ఈ లేఖలోని కొంతభాగం చదివిన వారంతా కన్నీరు పెట్టుకునేలా ఉంది. అసలేం జరిగిందంటే..

అపార్ట్ మెంటో నివసించే తొమ్మిదేళ్ల బాలిక రోజూ అపార్ట్ మెంట్ పైన వాకింగ్ కోసం వెళ్లేది. ఆ సమయంలో టీడీపీ నేత.. ఇటీవల కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్ గా పోటీ చేసిన ఓడిన 55 ఏళ్ల వినోద్ జైన్ వచ్చి వెధింపులకు గురి చేసేవాడు. దీంతో ఆందోళనకు గురైన సదరు బాలిక.. తనకు ఎదురవుతున్న ఇబ్బందిని తల్లిదండ్రులకు చెప్పుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం సాయంత్రం అపార్ట్ మెంట్ పైకి వెళ్లింది. పైభాగంలో కూర్చొని ఉండటాన్ని గమనించిన కొందరు వెనక్కి రావాలని వారించటంతో వచ్చేసింది. కానీ..కాసేపటికే మళ్లీ వెళ్లి పై నుంచి దూకేసింది. దీంతో.. అక్కడికక్కడే ప్రాణాల్ని విడిచింది.

ఇదే అపార్ట్ మెంట్ లో నాలుగో అంతస్తులో ఉండే వినోద్ జైన్.. బాలిక ఆత్మహత్యకు కారణమని తేలింది. అతనిపై లైంగిక వేధింపులు.. ఆత్మహత్యకు ప్రేరేపించటంపై సెక్షన్ 306, 354ఏ సెక్షన్లతో పాటు బాలిక మైనర్ కావటంతో పోక్సో కింద కేసు పెట్టారు. వినోద్ జైన్ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా చెలామణి అవుతున్నాడు. అపార్ట్ మెంట్ పెద్ద మనిషిగా వ్యవహరించే ఇతడు.. 2014లో 39వ డివిజన్ నుంచి బీజేపీ టికెట్ కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు. అనంతరం టీడీపీలో చేరి గత ఏడాది 37వ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా పోటీ చేసి ఓడిపోయాడు.

తాజా ఉదంతంతో అతను టీడీపీ నేతలతో కలిసి ఉన్న ఫోటోల్ని వైసీపీ విడుదల చేసింది. దీనికి ప్రతిగా నిందితుడు బీజేపీలో ఉన్నప్పుడు మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ తో కలిసి ఉన్న ఫోటోలను టీడీపీ విడుదల చేసింది. ఇలా.. అసలు కారణాన్నిపక్కన పెట్టి.. కొసరు విషయాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన వైనం చూస్తే.. ఇదెక్కడి దిక్కుమాలిన రాజకీయం అనుకోకుండా ఉండలేం. అయితే.. ఈ ఉదంతం గురించి తెలిసిన వెంటనే అతడ్ని పార్టీ నుంచి బహిష్కరించినట్లుగా టీడీపీ స్పష్టం చేసింది.

ఇదిలా ఉండగా పోస్టుమార్టం అనంతరం.. అపార్ట్ మెంట్ వద్దకు బాలిక మ్రతదేహాన్ని తీసుకురాగా.. స్థానికులు పలువురు చేరుకున్నారు. వినోద్ జైన్ ను ఉరి తీయాలని.. తమకు అప్పగిస్తే చంపేస్తామని నినాదాలు చేశారు. అల్లారుముద్దుగా పెంచుకున్న బాలిక ఆత్మహత్య చేసుకోవటంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. మొత్తంగా ఈ ఉదంతం మరో విషయాన్ని స్పష్టం చేసింది. మన పక్కనే పెద్ద మనిషిగా కనిపిస్తూ.. లోపల కామపిశాచి ఉండే దుర్మార్గులు చాలామంది ఉండి ఉండొచ్చు. అలాంటి వారి విషయంలో పిల్లల తల్లిదండ్రులు జాగ్రత్తగా జరుగుతున్నవాటి గురించి ఒక కంట కనిపెడుతూ ఉండాల్సిన అవసరం ఉంది.