Begin typing your search above and press return to search.

'హిజాబ్' వివాదంపై కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   9 Feb 2022 6:30 AM GMT
హిజాబ్ వివాదంపై కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు
X
కర్ణాటకను కుదిపేస్తున్న హిజాబ్ వివాదం ఇఫ్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రెండు వర్గాల మధ్య మత ఘర్షణలకు దారితీస్తోంది. ఒక వర్గం విద్యార్థుల వస్త్రధారణ విషయంలో మరో వర్గం వారు అభ్యంతరం తెలుపడంతో ఈ వివాదం రాజుకుంది. ఆ రెండు వర్గాల మధ్య మత ఘర్షణలకు దారితీసి విద్యాసంస్థల్లోని విద్యార్థుల మధ్య పోటాపోటీ ఆందోళనలకు కారణమైంది. దీంతో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం మూడురోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు కూడా ప్రకటించింది.

పార్లమెంట్ లోనూ ప్రతిధ్వనిస్తున్న హిజాబ్ వివాదంపై ప్రముఖ నటుడు కమల్ హాసన్ స్పందించారు. సంచలన వ్యాఖ్యలు చేశారు. వస్త్రధారణ వివాదం విద్యార్థుల మధ్య మతవిద్వేషంగా మారుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘కర్ణాటకలో జరుగుతోన్న పరిణామాలు కలకలం రేపుతున్నాయి. ఈ వివాదం అమాయక విద్యార్థుల మధ్య విషపు గోడగా మారుతోందని’ కమల్ హాసన్ విమర్శలు గుప్పించారు.

మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఇది మారుతోందని.. ఈ పరిస్థితులు తమిళనాడుకు అస్సలు పాకకూడదని కమల్ హాసన్ కోరుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సహా అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నానని కమల్ హాసన్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

ఇక నోబెల్ శాంతి బహుమతి గ్రహీత పాకిస్తానీ యూసఫ్ జాయ్ కూడా ట్విట్టర్ లో స్పందించారు. హిజాబ్ తో వస్తోన్న బాలికలను చదువుకోనివ్వకుండా అడ్డుకోవడం దారుణమన్నారు. ‘చదువా.. హిజాబా.. రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకునేలా కాలేజీలు బలవంతపెడుతున్నాయి. హిజాబ్ ధరించిన అమ్మాయిలను చదువుకు తిరస్కరించడం దారుణమన్నారు. భారత నేతలు దీన్ని ఆపాలి అని మాలాలా ట్విట్టర్ లో రాసుకొచ్చారు.

-హిజాబ్ అంటే ఏమిటీ?
హిజాబ్ అంటే తెర.. మహిళలు జట్టును, మెడను ఏదైనా బట్టతో కప్పి ఉంచడాన్ని ‘హిజాబ్ ’ అంటారు. ముఖం మాత్రం కనిపిస్తుంది. బురఖా అంటే స్త్రీల శరీరం పూర్తిగా కప్పబడి ఉంటుంది. బురఖా దరిస్తే మహిళ శరీరంలోని ఏ భాగం కనిపించదు. చాలా దేశాల్లో దీనిని అబాయా అని కూడా అంటారు. నికాబ్ అనేది ఒక రకమైన క్లాత్ మాస్క్. ఇది ముఖంపై ఉంటుంది. ఇందులో మహిళ ముఖం కనిపించదు. కానీ కళ్లు మాత్రమే కనిపిస్తాయి.

1983 కర్టాటక ప్రభుత్వం విద్యాహక్కు చట్టం చట్టం ప్రకారం విద్యార్థులంతా యూనిఫాం(ఒకే తరహా దుస్తులు)ను ధరించాలి. సెక్షన్ 133(2) ప్రకారం ప్రభుత్వం పాఠశాలల్లో ఈ నిబంధన ఉండగా.. ప్రైవేట్ స్కూళ్లల్లో తమకు నచ్చిన యూనిఫాం ను ఎంచుకోవచ్చు. అయితే అధికారులు ఎంపిక చేసిన యూనిఫాం నే విద్యార్థులు ధరించాలి. అయితే అడ్మినిస్ట్రేటివ్ కమిటీ యూనిఫాం ఎంపిక చేయకపోతే సాధారణ దుస్తులను ధరించాలి. అయితే సమానత్వం, సమగ్రత, ప్రజా శాంతిభద్రతలకు భంగం కలిగించే రీతిలో మాత్రం ధరించకూడదు. అయితే కొన్ని విద్యాసంస్థల్లో తమకిష్టమొచ్చిన రీతిలో విద్యార్థులు దుస్తులు ధరించడంపై విద్యాశాఖ అభ్యంతరం తెలిపింది.

గత నెలరోజులుగా కర్టాటక రాష్ట్రంలోని ఉడుపి, చిక్కమగళూరుల్లోని విద్యాసంస్థల్లో విద్యార్థులు హిజాబ్స్ ధరిస్తూ తరగతులకు హాజరవుతున్నారు. దీంతో హిందూ సంఘాలు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే హిజాబ్స్ ధరించిన విద్యార్థులు ఆ డ్రెస్ ధరించడం మా హక్కు అంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనకు ప్రతిగా హిందూ మతానికి చెందిన విద్యార్థులు కాషాయ కండువాలతో స్కూళ్లకు వచ్చారు. అంతేకాకుండా ర్యాలీలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. శనివారం ఉడుపి కుండాపూర్లో కొందరు బాలబాలికలు కాషాయ కండువాలు ధరించి ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేశారు.