Begin typing your search above and press return to search.

కేసీఆర్ క‌ల ప్ర‌పంచ రికార్డును సాధించింది

By:  Tupaki Desk   |   24 Dec 2018 6:11 AM GMT
కేసీఆర్ క‌ల ప్ర‌పంచ రికార్డును సాధించింది
X
గులాబీ ద‌ళ‌ప‌తి - తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాన‌స పుత్రిక అయిన ప్రాజెక్టు ప్ర‌పంచ రికార్డును సొంతం చేసుకుంది.రాష్ట్రంలో పద్నాలుగు జిల్లాల పరిధిలోని 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు రికార్డుల పరంపరను కొనసాగిస్తోంది. -కాళేశ్వరం ప్రాజెక్టు ప‌నుల్లో ఒక్కరోజులోనే 16,722 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని చేసి అరుదైన రికార్డు నమోదు చేసింది. ప్ర‌పంచంలోనే అతి పెద్ద‌దైన త్రీగార్జెస్ డ్యామ్‌ - అరబ్ ఎమిరేట్స్‌ లో ఓ భ‌వ‌న నిర్మాణం తరువాత మూడో స్థానాన్ని కాళేశ్వరం కైవసం చేసుకుంది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్‌కే తలమానికమైన కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతుల విషయంలోనే అనేక రికార్డులను సాధించగా, తాజాగా, నిర్మాణరంగంలోనూ సరికొత్త రికార్డు నెలకొల్పింది. గతంలో ఒక్కరోజులో వివిధ ప్యాకేజీల్లో భాగంగా 20,447 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులతో రికార్డు సృష్టించగా.. తాజాగా ఒక్క మేడిగడ్డ బరాజ్ వద్దే 24 గంటల్లో 16,722 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులతో అరుదైన రికార్డును నమోదు చేసింది. వచ్చే మార్చినాటికి కాళేశ్వరంలోని కీలక నిర్మాణాలన్నీ పూర్తి కావాలని సీఎం కేసీఆర్ ఇటీవల సమీక్ష సమావేశంలో ఆదేశించడంతోపాటు.. మేడిగడ్డ బరాజ్ నిర్మాణ పనులను మరింత వేగిరపర్చాలని దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే. ఇంకా సుమారు ఐదున్నర లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనుల్ని చేయాల్సి ఉన్న నేపథ్యంలో.. ఇప్పటివరకు ప్రతిరోజూ నిర్వహిస్తున్న ఐదారువేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. దీనిపై ఇంజినీర్లకు పలు సూచనలు చేయడంతోపాటు - ఏజెన్సీ ప్రతినిధులతో ఫోన్‌ లో మాట్లాడి దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు.. అంటే 24 గంటల్లో 16,722 క్యూబిక్ మీ టర్ల కాంక్రీట్ పనిని పూర్తిచేశారు. ఆ తర్వాత కూ డా ఇదే వేగంతో పనులను కొనసాగిస్తున్నామని కాళేశ్వరం చీఫ్ ఇంజినీర్ ఎన్ వెంకటేశ్వర్లు తెలిపారు.

మేడిగడ్డ బరాజ్ నిర్మాణంలో భాగంగా రికార్డు నెలకొల్పిన ఘట్టంలో 24 గంటలు (రౌండ్‌ ది క్లాక్) 4,824 మంది కంటిమీద కునుకు లేకుండా పనిచేశారు. కిందిస్థాయి కార్మికుడు మొదలు ఇంజినీర్ల వరకు సమిష్టిగా కష్టపడ్డారు. మేడిగడ్డ బరాజ్ నిర్మాణంలోని రాఫ్ట్ నాలుగు విభాగాలు (5,840 క్యూబిక్ మీటర్లు) - ఎనిమిది పియర్స్ (10,882 క్యూబిక్ మీటర్లు) నిర్మాణాలను పూర్తిచేశారు. ఇలా మొత్తంగా 24 గంటల్లోనే 16,722 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇందుకోసం 1,24,751 సంచుల (6,238 మెట్రిక్ టన్నులు) సిమెంట్, 15,384 క్యూబిక్ మీటర్ల మెటల్ - 1,070 మెట్రిక్ టన్నుల స్టీల్‌ ను వాడారు. 20 బూమ్ ప్లేసర్లు - 120 ట్రాన్సిట్ మిల్లర్లు - ఎనిమిది కాంక్రీట్ బ్యాచింగ్ ప్లాంట్లు వంటి భారీ యంత్రాలను వినియోగించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్‌ లోనూ అరుదైన రికార్డును నమోదు చేశారు. ఒక్క రోజులో (ఏప్రిల్ 14 ఉదయం 8 గంటల నుంచి ఏప్రిల్ 15 ఉదయం 8 గంటల వరకు) వివిధ ప్యాకేజీల్లో రికార్డుస్థాయిలో 20,447 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ కాంక్రీట్ పనులను నిర్వహించి రికార్డు నమోదు చేశారు. మేడిగడ్డ బరాజ్-7139 - కన్నెపల్లి పంపుహౌజ్-1786 - అన్నారం బ్యారేజీ-3215 - అన్నారం పంపుహౌజ్-838 - సుందిళ్ల బరాజ్-3076 - సుందిళ్ల పంపుహౌజ్ -1602 - గ్రావిటీ కాల్వ-762 - ప్యాకేజీ(6)-707 - ప్యాకేజీ(7)-720 - ప్యాకేజీ(8)-592 క్యూబిక్ మీటర్ల పనులను ఈ సందర్భంగా చేపట్టారు.

2000 సంవత్సరంలో త్రీగార్జెస్ డ్యాం నిర్మాణంలో భాగంగా చైనా ఇంజినీర్లు ఒక్కరోజులో 22 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులను పూర్తిచేశారు. 2004లో సింగపూర్‌ లో జరిగిన అవర్ వరల్డ్ ఇన్ కాంక్రీట్ - స్ట్రక్చర్స్ అంతర్జాతీయ సదస్సులో చైనా ఇంజినీర్లు ఇందుకు సంబంధించి పేపర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ లో ఐఫా ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఒక భవన నిర్మాణంలో భాగంగా 35.19 గంటల్లో 21,580 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ నిర్మాణాన్ని పూర్తిచేసింది. ఈ రెండింటి తరువాత కాళేశ్వరం ప్రాజెక్టు మూడో స్థానాన్ని సొంతం చేసుకున్నది. ఆ తర్వాత స్థానంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఇటీవల పూర్తిచేసిన 16,368 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని నిలిచింది.