Begin typing your search above and press return to search.

పదవి రాలేదని ఎర్రబెల్లి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారంట

By:  Tupaki Desk   |   28 Sept 2015 10:36 AM IST
పదవి రాలేదని ఎర్రబెల్లి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారంట
X
రాజకీయాల్లో మంచి చెడ్డలకు అవకాశమే లేదు. విమర్శించే అవకాశం చిక్కాలే కానీ మరో ఆలోచన లేకుండా తిట్టేయటం తాజా ట్రెండ్ గా మారింది. దూకుడు రాజకీయాలు పెట్రేగిపోయిన తర్వాత మైలేజీ కోసం ఎన్ని మాటలైనా చెప్పే రోజులు వచ్చేశాయి. దీంతో.. మర్యాద.. గౌరవం లాంటి వాటి గురించి అస్సలు పట్టించుకోని దుస్థితి.

అయితే.. ఇలాంటి వైఖరి నిన్న కాక మొన్న వచ్చిన నేతల ప్రదర్శిస్తే అర్థం చేసుకోవచ్చు. కానీ.. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి లాంటి నేతలు కూడా ఇదే ధోరణి ప్రదర్శించటం కాస్త భిన్నమైన అంశంగా చెప్పాలి. ఆదివారం వరంగల్ జిల్లా పాలకుర్తి మార్కెటింగ్ యార్డులో జరిగిన శంకుస్థాపన కార్యక్రమం రసాభాసగా సాగటం తెలిసిందే.

శంకుస్థాపన చేయటానికి స్థానిక ఎమ్మెల్యే హోదాలో వచ్చిన తెలుగుదేశం శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావును తెలంగాణ అధికారపక్షం శ్రేణులు అడ్డుకోవటం.. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య విపరీతమైన గొడవ.. కోట్లాట.. దాడులు చేసుకోవటం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ఎర్రబెల్లి దయాకర్ రావు పిచ్చి పట్టినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎందుకలా అంటే.. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి దక్కలేదన్న ఉద్దేశంతోఆయన అలా పిచ్చిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

మార్కెటింగ్ యార్డు వద్ద చోటు చేసుకున్న ఘటనపై ఎర్రబెల్లి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన కడియం.. తన ప్రత్యర్థిపై విమర్శలు చేసేందుకు ఎంతకైనా రెఢీ అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారే తప్పించి.. ఆచితూచి అన్న ధోరణే ప్రదర్శించకపోవటం గమనార్హం. అయినా.. పార్టీ ఒక పదవి ఇచ్చిన తర్వాత.. అన్నీ పదవులు ఎర్రబెల్లికే కట్టబెట్టాలన్నది కడియం వాదనా?