Begin typing your search above and press return to search.

టైం చూసి దళితబంధుతో కేసీఆర్ కు గురి పెట్టిన కడియం

By:  Tupaki Desk   |   15 Aug 2021 2:36 PM GMT
టైం చూసి దళితబంధుతో కేసీఆర్ కు గురి పెట్టిన కడియం
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను అదిరించి బెదిరిస్తే ఆయన ఒక పట్టాన లొంగరు. ఈ విషయం చాలా సందర్భాల్లో చాలా మందికి అర్థమైంది. అన్నింటికి కంటే ఆర్టీసీ కార్మికుల సమ్మె సమయంలో తెలంగాణ సీఎంకు ఎదురైన సవాల్ తీవ్రమైనది. కొందరు ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్యకు పాల్పడ్డారు కూడా. అలాంటి సమయంలో ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. విపక్షాలు దుమ్మెత్తిపోస్తుంటాయి. ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అయినప్పటికీ కేసీఆర్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ఉండటం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది.

చివరకు సమ్మె చేస్తున్నకార్మికులకు కేసీఆర్ మైండ్ సెట్ ఒక పట్టాన వంట బట్టేది కాదు. ఆయనపై ఒత్తిడిని తీసుకు రావటం ద్వారా ఆయన్ను ప్రసన్నం చేసుకోవటం కష్టమన్న విషయాన్ని గుర్తించి.. కాస్తంత వెనక్కి తగ్గి రాజీ రాయబారాన్ని తీసుకెళ్లటం ద్వారా.. ఇష్యూను క్లోజ్ చేశారు. దాదాపురెండు నెలలకు పైనే సాగిన సమ్మెతో ఆర్టీసీ ఉద్యోగులు నీరసించిపోవటమే కాదు.. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తానంటూ రివర్సులో కేసీఆర్ సర్కారు ప్రకటన దిమ్మ తిరిగి పోయేలా చేసింది. ఆర్టీసీ ఎపిసోడ్ వేళ అందరికి అర్థమైందంటే.. మిగిలిన ముఖ్యమంత్రులకు కేసీఆర్ భిన్నమని.

ఆయన్ను వీలైనంత వరకు బెదిరింపు ధోరణిలో డిమాండ్లు చేయకూడదన్నది అర్థమైంది. మరి.. ఈ విషయం ఇంత సక్కగా అర్థమైన తర్వాత కూడా టీఆర్ఎస్ సీనియర్ నేత.. మాజీ ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కడియం శ్రీహరికి కేసీఆర్ ఇంకా అర్థం కాలేదా? అన్నది ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. గులాబీ బాస్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

‘‘దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేయాలని లేకుంటే టీఆర్ ఎస్ తీవ్రంగా నష‌్టపోతుంది. దళిత బంధును నీరు గార్చొద్దు. పథకం అమలు చేయకుంటే టీఆర్ ఎస్ కు చెడ్డ పేరు వస్తుంది’’ అని జనగామ జిల్లా చిల్పూర్ మండలం కృష్ణాజీ గూడెంలో కడియం వారి నోటి నుంచి వ్యాఖ్యలు వచ్చాయి. అంతేకాదు.. దళితబంధు పథకం పులి మీద స్వారీగా అభివర్ణించారు. ఇలాంటి వ్యాఖ్యలు.. కేసీఆర్ కు సహజంగా ఇబ్బంది పెట్టేవే. అయినప్పటికీ అలాంటి మాటలు ఎందుకు వచ్చాయి? అన్నది అసలు ప్రశ్న.

గడిచిన కొంతకాలంగా కేసీఆర్ కు కడియంకు మధ్య టర్మ్ సరిగా లేవన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మొదటి సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సమయంలో కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న తుమ్మల కావొచ్చు.. కడియం కావొచ్చు.. రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వారిని దగ్గరకు రానివ్వకుండా ఉంచటమేకాదు.. ఎలాంటి పదవులు ఇవ్వకపోవటం తెలిసిందే. ఎన్నికల్లో ఓడినప్పటికీ.. కేసీఆర్ అనుకోవాలే కానీ.. అందలం ఎక్కించటానికి అస్సలు ఆలోచించరు. మరి.. సీనియర్లను.. ఒకప్పటి తన జానీ జిగిరీల విషయంలో ఆయన తీరు ఎందుకు మారిందన్నది ప్రశ్నగా మారింది.

కడియం విషయానికి వస్తే.. అప్పట్లో తాటికొండ రాజయ్యకు చెక్ పెట్టటానికి తెర మీదకు తీసుకురావటం.. ప్రోత్సహించటం తెలిసిందే. వాస్తవానికి కేసీఆర్ తో పోలిస్తే.. కడియం సీనియర్ మాత్రమే కాదు. బాబు ప్రభుత్వంలో ఆయన మంత్రిగా వ్యవహరించేవారు. అలాంటి కడియం ఈ రోజు పదవి కోసం కేసీఆర్ వంక దీనంగా చూడాల్సిన పరిస్థితి. ఎంతగా ప్రయత్నించినా.. గులాబీ బాస్ నుంచి సానుకూల స్పందన రాకపోవటంతో విసిగిన ఆయన.. బెదిరింపు దోరణిలోకి వచ్చారా?

అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. దళిత బంధు పథకం నేపథ్యంలో.. దళిత నేతలకు పెద్దపీట వేస్తున్న కేసీఆర్ ను తన వంక చూసేందుకు ఇదే సరైన సమయమని కడియం భావిస్తున్నారన్నట్లుగా ఉంది ఆయన తీరు చూస్తుంటే. అయితే.. కేసీఆర్ ను లాలించాలి.. బుజ్జగించాలి.. అవసరమైన ఆవేదనను చెప్పుకోవాలే కానీ.. ప్రశ్నించేలా ఉండకూడదు. మరి.. ఈ విషయాన్ని మరచిన కడియం.. దళితబంధుతో కేసీఆర్ ను గురి పెట్టిన వేళ.. ఆయన స్పందన ఏ తీరులో ఉంటుందన్నది ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.