Begin typing your search above and press return to search.

కేఏ పాల్ ను అందరూ వాడుకుని వదిలేశారట..

By:  Tupaki Desk   |   31 Dec 2016 9:43 AM GMT
కేఏ పాల్ ను అందరూ వాడుకుని వదిలేశారట..
X
మత ప్రచారకుడిగా.. అంతర్జాతీయంగా శాంతి కోసం ప్రయత్నాలు చేసే వ్యక్తిగా పరిచయం ఉన్న తెలుగు వ్యక్తి కేఏ పాల్ రచ్చ గెలుస్తున్నా ఇంట గెలవలేకపోతున్నారు. ఆయన చేపట్టిన గ్లోబల్ పీస్ మిషన్ కు ఇంతకుముందే తెరపడిన సంగతి తెలిసిందే. దాన్ని పునరుద్ధరించడానికి ఆయన చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. పాల్ ను మాత్రం మన నేతలు ఫుల్లుగా వాడుకుని వదిలేశారట. ఎన్నికల సమయంలో ఆయన్ను కలిసి సహాయాన్ని కోరడం తరువాత ఆయనకే ఎర్త్ పెట్టడం చేస్తున్నారట.

రెండు తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌లతోపాటు దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా ఆయన్ను వాడుకుని వదిలేశారట. ఆ విషయాన్ని ఆయన నేరుగా చెప్పకపోయినా గతంలో జరిగిన పరిణామాలను వివరించడంతో ఆయన భావన వ్యక్తమైంది.

తాజాగా టీవీ9 ఛానల్ ఆయనతో ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలు చెప్పారు. ప్రపంచంలో చందాలు తీసుకోని ఏకైక మత ప్రచారకుడిని తానేనని చెప్పుకొన్నారు. అంతర్జాతీయ వివిధ దేశాల అధినేతలతో తనకున్న పరిచయాలను మరోసారి గుర్తుచేశారు. పేదలకు తాను చేస్తున్న సేవలనూ చెప్పుకొచ్చారు. కేఏ పాల్ పనైపోయిందనుకోవద్దని.. తాను కనిపించడం లేదంటే కనుమరుగైపోయానని కాదని.. ప్రపంచ శాంతి కోసం దేశాలు తిరుగుతున్నానని చెప్పారు. ట్రంప్ గెలుస్తారని తాను అమెరికా ఎన్నికలకు ముందే టీవీ9కి చెప్పానని.. కానీ.. వారు కొట్టిపారేశారని.. చివరికి ఏం జరిగిందో అంతా చూశారని అన్నారు.

అయితే.. ఈ ఇంటర్వ్యూలో టీవీ9 వ్యవహరించిన ధోరణి మాత్రం సిగ్గుపడేలా ఉంది. పాల్ తాను చేపడుతున్న కార్యక్రమాల గురించి చెబుతుంటే టీవీ9 యాంకర్ మాత్రం ఆయనకున్న విమానాన్ని ఎందుకు వాడడం లేదంటూ పదేపదే ప్రశ్నించి వెటకారంగా విసిగించారు. దానికి సమాధానంగా పాల్... తాను అమెరికా నుంచి లక్ష రూపాయలు ఖర్చు చేసి ప్రయాణికుల విమానంలో వచ్చానని.. అదే తన సొంత విమానంలో వస్తే రూ.5 కోట్లు ఖర్చవుతుందని... అందుకే దాన్ని వాడకుండా ఇలా కేవలం లక్ష ఖర్చుతో వస్తున్నానని.. మిగతా మొత్తం పేదల కోసం ఖర్చు చేస్తున్నానని చెప్పారు. అయినా కూడా టీవీ9 అదేమీ పట్టించుకోకుండా వెటకారం ప్రదర్శించింది.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/