Begin typing your search above and press return to search.

ఈ హడావుడి మంత్రి పదవి కోసమేనా జ్యోతుల?

By:  Tupaki Desk   |   10 April 2016 4:42 AM GMT
ఈ హడావుడి మంత్రి పదవి కోసమేనా జ్యోతుల?
X
ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా చాలామంది నేతలు విపక్షం నుంచి అధికారపక్షంలోకి రావటం ఈ మధ్య కాలంలో రోటీన్ వ్యవహారంగా మారింది. అయితే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ మరే విపక్ష నేత సైతం నిర్వహించనంత భారీగా తన జంపింగ్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ డిజైన్ చేశారని చెబుతున్నారు. విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆకర్ష్ ను రెండు రాష్ట్రాల్లోని అధికారపక్షాలు చేపట్టాయి. ఈ క్రతువులో భాగంగా తెలంగాణలో టీడీపీ దారుణంగా దెబ్బ తినింది. కాంగ్రెస్.. వైఎస్సార్ కాంగ్రెస్.. లాంటి పార్టీలకు కూడా దెబ్బ పడింది.

ఆపరేషన్ ఆకర్ష్ కారణంగా తెలంగాణలో టీడీపీకి దెబ్బ పడితే.. ఏపీలో మాత్రం భారీగా లాభపడుతోంది. ఏపీ విపక్షంలోని నేతల్ని తమవైపుకు తిప్పుకోవటంలో చంద్రబాబు సక్సెస్ అవుతున్నారు. ఇప్పటికే పది మంది వరకూ వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కేయటం తెలిసింది. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ లో కీలకనేతగా పేరున్నజ్యోతుల నెహ్రూ టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకోవటం తెలిసిందే. టీడీపీలోకి తన ఎంట్రీని ఓ రేంజ్ లో చేయాలని జ్యోతుల ప్లాన్ చేస్తున్నారు. తన రాక పార్టీకి ఎంత లాభమన్న విషయాన్ని చేతల్లో చూపించి తన బంధువైన ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావును అధికారపార్టీలోకి తీసుకొచ్చేయటం తెలిసిందే.

ఏపీ అధికారపక్షంలో భాగస్వామ్యం అయ్యాక మంత్రి పదవిని ఆశిస్తున్న జ్యోతుల.. అందుకు తగ్గట్లే తన రేంజ్ ఏమిటో ప్రదర్శించాలనుకుంటున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు (ఆదివారం) సైకిల్ ఎక్కేందుకు ముహుర్తం పెట్టుకున్న జ్యోతుల.. టీడీపీలో తన చేరిక కార్యక్రమాన్ని భారీగా చేపడుతున్నారు. ఇందుకోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. జ్యోతుల చేరిక కార్యక్రమం విజయవాడలోని ఏ-1 కన్వెన్షన్ సెంటర్ లో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం కోసం తూర్పుగోదావరి జిల్లా నుంచి వంద బస్సులు.. 200 కార్లలో విజయవాడకు వస్తున్నట్లు తెలుస్తోంది. రేపో మాపో మంత్రి కానున్న జ్యోతుల తన రేంజ్ ను ప్రదర్శించుకోవటానికి ఇంతకు మించిన అవకాశం ఇంకేం ఉంటుంది.