Begin typing your search above and press return to search.

జగన్ కు దిమ్మ తిరిగే షాక్ తగలనుందా?

By:  Tupaki Desk   |   26 March 2016 4:17 AM GMT
జగన్ కు దిమ్మ తిరిగే షాక్ తగలనుందా?
X
అసంతృప్తికి మించిన ప్రమాదకరమైన వ్యాధి రాజకీయాల్లో మరొకటి ఉండదు. ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన బ్యాచ్ ఒకటి ఇప్పుడాయనకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇవ్వనున్నారా? అంటే అవుననే చెబుతున్నాయి రాజకీయ వర్గాలు. తాజా అసంతృప్తికి గతం నుంచి వెంటాడుతున్న అంశాలతో పాటు.. తాజాగా ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ గా సీనియర్లను పక్కన పెట్టి.. తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన ఒక జూనియర్ ఎమ్మెల్యే రాజేంద్రనాథ రెడ్డికి పదవి అప్పగించాలన్న అధినేత నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయంపై తీవ్ర మండిపాటులో ఉన్న సీనియర్ నేత.. జగన్ పార్టీలో కీలకపాత్ర పోషించే జ్యోతుల నెహ్రు వైసీపీతో కటీఫ్ చెప్పేందుకు డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు.

ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ పదవిని ఆశించి.. భంగపాటుకు గురైన జ్యోతుల నెహ్రు.. జగన్ పార్టీ నుంచి బయటకు వచ్చేయాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. తాజాగా జరుగుతున్న ప్రయత్నాల్ని చూస్తే.. ఆయన సైకిల్ ఎక్కటం ఖాయమన్నమాట రాజకీయవర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. జ్యోతుల నెహ్రు ఒక్కరిగా బయటకు రారని.. తనతో పాటు కనీసం పది మంది ఎమ్మెల్యేల్ని వెంటబెట్టుకు వస్తారన్న ప్రచారం సాగుతోంది. ఈ దిశగా ప్రయత్నాలు స్టార్ట్ అయ్యాయని.. బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే.. ఈ దిశగా అడుగులు పడనున్నట్లు చెబుతున్నారు.

జగన్ కు షాకిచ్చే ప్రయత్నంలో తనతో పాటు వచ్చే ఎమ్మెల్యేల సంఖ్య భారీగా ఉండేలా జ్యోతుల జాగ్రత్త పడుతున్నట్లు చెబుతున్నారు. కనీసం పది మందికి తగ్గకుండా ఎమ్మెల్యేలతో బయటకు వెళ్లాలని జ్యోతుల ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్న రాజకీయ వర్గాలు.. ఆయన వెంట బయటకు వచ్చే ఎమ్మెల్యేల్లో గోదావరి జిల్లాలకు చెందిన వారే ఐదారుగురు ఉండే అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ ఈ అంచనానే నిజమైతే.. జగన్ కు దిమ్మ తిరిగే షాక్ తగిలినట్లేనని చెబుతున్నారు.