Begin typing your search above and press return to search.

మంట పుట్టేలా ఆదాయపన్ను కట్టేటోళ్ల లెక్క

By:  Tupaki Desk   |   22 Dec 2016 7:28 AM GMT
మంట పుట్టేలా ఆదాయపన్ను కట్టేటోళ్ల లెక్క
X
భారతదేశం పేదదే కానీ.. భారతీయులు మాత్రం కాదన్న మాట ఎంత నిజమన్న విషయాన్ని చెప్పే లెక్క ఇది. దేశం మొత్తంగా 125 కోట్ల మంది భారతీయులు ఉంటే.. వారిలో ప్రతి ఏటా ఆదాయపన్ను కట్టే వారి లెక్క తెలిస్తే కడుపు మండిపోవటం ఖాయం. ప్రస్తుతం ఉన్న ఆదాయపన్ను శ్లాబుల ప్రకారం ఆదాయపన్ను కట్టాల్సిన వారెంత మంది ఉంటారన్న దానికి ఎవరో లెక్క చెప్పనక్కర్లేదు. మీ చుట్టూ ఉన్న వారి ఆదాయాన్ని ఒక్కసారి పరికించి చూస్తే చాలు.. చట్టాల్ని ఎంత సింఫుల్ గా ఉల్లంఘిస్తున్నారో.. పన్ను ఎగవేతకు ఎంతమంది పాల్పడుతున్నారో ఇట్టే అర్థమవుతుంది.

నీతి అయోగ్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి సింఫుల్ గా చెప్పాలంటే సీఈవో చెప్పే లెక్క ప్రకారం.. దేశంలోని జనాభాలో కేవలం ఒక్క శాతం మంది మాత్రమే ఆదాయపన్ను కడుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న శ్లాబుల ప్రకారం చిల్లరను కాస్త పక్కన పెట్టేస్తే నెలకు రూ.35వేలు సంపాదించే ప్రతిఒక్కరూ ఆదాయపన్ను కట్టాల్సిందే.

నెలకు రూ.35వేలు అంటే.. రోజుకు కాస్త అటుఇటుగా రూ.1200 సంపాదించే వారంతా ఆదాయపన్ను కట్టాల్సిన వారే. ప్రభుత్వ.. ప్రైవేటు ఉద్యోగులు తప్పనిసరిగా ఆదాయపన్ను చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి వారిని మినహాయిస్తే.. మిగిలిన వారెంతమంది ఆదాయపన్ను కట్టకుండా ఉన్నారో లెక్కేస్తే.. దేశం ఎందుకు పేదగా ఉంటుందో అర్థమవుతుంది.

కాయలున్న చెట్టుకే రాళ్ల దెబ్బలన్నట్లుగా.. రికార్డుల్లో ఆదాయం లెక్కలు పక్కాగా చెప్పే వారంతా పన్ను మీద పన్ను పోటు వేయించుకుంటుంటే.. మిగిలిన వారంతా పన్ను కట్టకపోగా.. వైట్ రేషన్ కార్డుతో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్ని తమ సొంతం చేసుకుంటున్న వైనం కనిపిస్తుంది. నగరాల్లో అయితే.. ఆటో డ్రైవర్ మొదలుకొని ఉబర్ క్యాబ్ డ్రైవర్ వరకూ ఆదాయపన్ను కట్టాల్సిన పరిధిలోకి వచ్చేస్తారు. ఇక.. చిన్న చిన్న టీ బంకుల దగ్గర నుంచి ఒక మోస్తరు కిరాణాషాపుల వరకూ అందరూ ఆదాయపన్ను లెక్కలోకి రావాల్సిందే.

అయితే.. ఇలాంటి వారంతా నగదు చెల్లింపులు జరుపుతుండటంతో వారి ఆదాయానికి సంబంధించిన లెక్కలు బయటకు రాకపోవటం.. ప్రభుత్వ పరిశీలనకు అంతుచిక్కనిదిగా తయారైన పరిస్థితి. ఈ కారణంతోనే.. ఎవరికి వారు డబ్బులు సంపాదిస్తున్నా.. బాధ్యతగా కట్టాల్సిన పన్ను ఎగ్గొట్టేస్తున్నారు. ఈ కారణం చేతనే పన్ను కట్టే వారే అదే పనిగా పన్ను కట్టే దుస్థితి. పెద్దనోట్ల రద్దుతో పాటు.. నగదు రహిత లావాదేవీల దిశగా కేంద్రం అడుగులు వేస్తున్న వేళ.. అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి ఆదాయపన్ను వసూలు చేయాల్సిందే. ఇలా చేయటం ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం రావటం ఖాయం. అయితే.. ఇలా వచ్చిన ఆదాయం లెక్కలు చూసి.. పన్నుపోటును భారీగా తగ్గించటం ద్వారా.. మరింతమందిని ఆదాయపన్ను కిందకు తేవటం ద్వారా దేశాన్ని అభివృద్ధిపథంలో నడపటమే కాదు.. పన్ను రేటును మరింత తక్కువ అయ్యేలాచూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/