Begin typing your search above and press return to search.

టీడీపీ మాటః ప్యాకేజీ అద్భుతం

By:  Tupaki Desk   |   14 Sep 2016 7:09 AM GMT
టీడీపీ మాటః ప్యాకేజీ అద్భుతం
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు ప్ర‌త్యేక హోదా విష‌యం అట‌క ఎక్కేసేలాగానే ఉంద‌ని చెప్తున్నారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌హా - ఆ పార్టీ నేత‌లంతా పోటీ ప‌డి మ‌రీ ప్యాకేజీని స‌మ‌ర్థిస్తుంటే ఇదే భావ‌న క‌లుగుతోంద‌ని ప‌లువురు పేర్కొంటున్నారు. ఒంగోలులో టీడీపీ జిల్లా కార్యాలయంలో ఎస్‌సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ జూపూడి ప్రభాకరరావు మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక ప్యాకేజీతోనే రాష్ట్రాభివృద్ధి జ‌రుగుతుందని పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ అద్భుతంగా ఉందని ప్ర‌శంసించారు. దీంతో ఈ కొత్త చ‌ర్చ మొద‌లైంది.

కేంద్రంలో ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పడిన నీతి ఆయోగ్‌ - 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా సాధ్యం కాదని చెప్పటంతో ప్రత్యేక ప్యాకేజీ తీసుకోవాల్సి వచ్చిందని జూపూడి వివ‌రించారు. ఏపీ అవ‌స‌రాల‌న్నీ తీర్చేవిధంగా అద్భుతంగా ఉన్న ఈ ప్యాకేజీతో పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తవవుతుందనీ చెప్పారు. 18 కేంద్ర విద్యాసంస్ధలు రాష్ట్రంలో ఏర్పాటవుతున్నాయనీ, చెన్నై - బెంగళూరు కారిడార్‌ - విశాఖపట్టణం- కాకినాడ కారిడార్‌ అభివృద్ధి చెందుతాయని జూపూడి చెప్పారు. పారిశ్రామికంగానూ అభివృద్ధి చెందటానికి అవకాశం ఉందన్నారు. ప్రత్యేక ప్యాకేజీపై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయన్నారు.

ఇదిలాఉండ‌గా ప్యాకేజీ ప్ర‌క‌టించిన సంద‌ర్భంగా తాను ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి ఫోన్ చేసి ధ‌న్య‌వాదాలు తెలిపిన‌ట్లు సీఎం చంద్ర‌బాబు స్వ‌యంగా మీడియాకు వివ‌రించిన సంగ‌తి తెలిసిందే. బాబు తాజాగా చెప్పిన ఈ మాట‌తో పాటు గ‌తంలో కూడా ప్యాకేజీ ఏపీకి సంజీవ‌ని కాద‌ని బాబు ఓ ఇంట‌ర్వ్యూలో వ్యాఖ్యానించిన సంద‌ర్భాన్ని ప్ర‌తిప‌క్షాలు గుర్తుచేస్తున్నాయి. ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఏపీ ప్ర‌జ‌ల ఆశ‌లు వ‌దులుకునేలా చేయ‌డ‌మే ప్ర‌భుత్వం ఎజెండాగా క‌నిపిస్తున్నాయ‌ని వ్యాఖ్యానిస్తున్నాయి.