Begin typing your search above and press return to search.

ఆ ముగ్గురు నాయ‌కులు త్రీ ఈడియెట్స్ అంట‌

By:  Tupaki Desk   |   1 July 2016 4:28 PM GMT
ఆ ముగ్గురు నాయ‌కులు త్రీ ఈడియెట్స్ అంట‌
X
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అధికార‌- ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య విమ‌ర్శ‌ల‌కు దారితీస్తోంది. ముఖ్యంగా మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా నాయ‌కుల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి చేరుతోంది. ఈ క్ర‌మంలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు - ప్ర‌తిప‌క్షానికి చెందిన ముగ్గురు నేత‌ల‌ను త్రీ ఈడియెట్స్‌ తో పోల్చారు. బీజేకపీకి చెందిన మాజీ మంత్రి నాగం జనార్దన్‌ రెడ్డి - కాంగ్రెస్‌ కు చెందిన గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ - టీడీపీ కార్య‌నిర్వాహ‌క అధ్యక్షుడు కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి మూర్ఖులుగా వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. పాలమూరును సస్యశ్యామలం చేసే అడ్డుకునేందుకు ఈ ముగ్గురు కుట్ర పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు.

ఏపీ సీఎం చంద్రబాబు డైరెక్షన్‌ లో పాలమూరు ఎత్తిపోతలను అడ్డుకునే కుట్ర జరుగుతుంద‌ని జూప‌ల్లి ఫైర్ అయ్యారు. పాలమూరు జిల్లాను దత్తత తీసుకున్న చంద్రబాబు - ఎందుకు పాలమూరు ఎత్తిపోతల వంటి ప్రాజెక్టును చేపట్టలేదని ప్రశ్నించారు. కేంద్రం కూడా ఆంధ్రా ప్రభుత్వం చెప్పినట్లే నడుస్తున్నదని - పాలమూరు ఎత్తిపోతలపై బీజేపీ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు మేలు జరుగుతుందంటే, ఆ ప్రకారమే పరిహారం ఇస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న జీవో 123 తో వచ్చే లాభాల కంటే తక్కువ వస్తే నష్టం భరిస్తారా అని ప్రశ్నించారు. జీవో 123తో రైతులు ఎలా నష్టపోతున్నారో లెక్క లు తయారు చేయాలని సవాల్ విసిరారు. ఉద్యమ సమయంలో ఓయూలో నాగంకు విద్యార్థులు దేహశుద్ధి చేస్తే తప్ప ఉద్యమబాట పట్టలేదని, ఇప్పుడు ప్రాజెక్టులను అడ్డుకుంటున్న ఆయనకు ప్రజలు దేహశుద్ధి చేస్తేనే జ్ఞానోదయం కలుగుతుందన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవాచేశారు.

పాలమూరు ప్రాజెక్టుపై పిల్ చేస్తే హైకోర్టులో చీవాట్లు పెట్టినా మార్పురాలేదని ఆయ‌న‌లో మార్పు రాలేద‌ని మండిపడ్డారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టులు ఆపడం ఎవరితరం కాదని జిల్లా ప్రజలే అవసరమైనప్పుడు బుద్ధిచెప్తారన్నారు. ప్రాజెక్టులకు అంతరాయం కలిగిస్తున్న నాగంను ప్రజలు సహించరన్నారు.