Begin typing your search above and press return to search.

రోడ్డెక్కిన గాంధీ జూనియర్ డాక్టర్లు.. కేసీఆర్ రావాలని డిమాండ్ !

By:  Tupaki Desk   |   10 Jun 2020 11:10 AM GMT
రోడ్డెక్కిన గాంధీ జూనియర్ డాక్టర్లు.. కేసీఆర్ రావాలని డిమాండ్ !
X
తెలంగాణలో మూడు నెలలుగా కరోనా వైరస్ పేషెంట్లకు నిరంతరాయంగా వైద్య సేవలను అందిస్తోన్న జూనియర్ డాక్టర్లు ఒక్కసారిగా భగ్గుమన్నారు. కరోనా వైరస్ బారిన పడిన పేషెంట్ల ప్రాణాలను నిలపడానికి వారు అహర్నిశలు శ్రమిస్తోన్న వారిపై కొందరు దాడులు చేయడాన్ని నిరసిస్తూ రోడ్డెక్కారు. మంగళవారం వైరస్ పేషెంట్ ఒకరు చనిపోయారు. హాస్పిటల్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ మరణించిన వ్యక్తి బంధువులు ఆగ్రహంతో ఊగిపోయారు. జూనియర్ డాక్టర్లపై దాడికి తెగబడ్డారు.

పేషెంట్లను కాపాడటం కోసం తాము అహర్నిశలు శ్రమిస్తుంటే.. గౌరవం ఇవ్వకపోయినా ఫర్వాలేదు కానీ దాడులు చేస్తారా అంటూ జూనియర్ డాక్టర్లు మంగళవారం రాత్రి సమ్మెకు దిగారు. బుధవారం కూడా సమ్మెను కొనసాగిస్తూ రోడ్డు మీద బైఠాయించారు. జూనియర్ డాక్టర్లు రోడ్డు మీదకు రావడానికి ప్రయత్నించడంతో.. గేట్ వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. సీఎం కేసీఆర్ గాంధీ హాస్పిటల్‌కు రావాలని డాక్టర్లు డిమాండ్ చేశారు.

సికింద్రాబాద్- ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ ప్రధాన మార్గంపై వందలాది మంది జూనియర్ డాక్టర్లు బైఠాయించడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. రాత్రివేళ గాంధీ ఆసుపత్రి ఆవరణలోనే బైఠాయించి.. తమ నిరసనను వ్యక్తం చేసిన జూనియర్ డాక్టర్లు ఈ ఉదయం రోడ్డు మీదికి రావడానికి ప్రయత్నించారు. దాన్ని గమనించిన పోలీసులు ప్రధాన ద్వారాన్ని మూసివేయడానికి ప్రయత్నించారు. ఇనుప బ్యారికేడ్లను ప్రధాన గేటుకు అడ్డుగా పెట్టారు. అయినప్పటికీ.. జూడాలు వెనక్కి తగ్గలేదు. గేటును, బ్యారికేడ్లను తోసుకుంటూ రోడ్డు మీదికి వచ్చారు. వారిని అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. పెద్ద సంఖ్యలో రోడ్డు మీదికి వచ్చిన జూడాలు అక్కడే బైఠాయించారు. ప్లకార్డులను ప్రదర్శించారు

వైరస్ పేషెంట్లు ఎక్కువగా ఉండటంతో తమపై ఒత్తిడి పెరుగుతోందని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు. డ్యూటీలో ఉన్న జూనియర్ డాక్టర్లకు సరిపడా పీపీఈ కిట్లు అందించలేదని ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలోని 4 కోట్ల మంది ప్రజలకు ఒకటే వైరస్ హాస్పిటల్ ఉందని.. మూడు నెలలుగా ఎలాంటి ఫిర్యాదులు లేకుండా నిరంతరం శ్రమించామని.. ఇకనైనా మిగతా హాస్పిటళ్లలో వైరస్ రోగులకు చికిత్స అందించాలని డిమాండ్ చేస్తున్నారు. గాంధీ హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్లు ఆందోళన చేపట్టిన విషయమై ప్రభుత్వం స్పందించింది. ఆందోళన విరమించాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వారికి సూచించారు. చర్చల కోసం జూడాల ప్రతినిధులు సచివాలయానికి రావాలని కోరారు. డాక్టర్లపై దాడి చేసిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని, వారికి కఠిన శిక్ష పడేలా చూస్తామని పోలీసులు తెలిపారు.