Begin typing your search above and press return to search.

రాజకీయ ''సంజీవరావు''లు

By:  Tupaki Desk   |   15 Feb 2016 11:30 AM GMT
రాజకీయ సంజీవరావులు
X
కొద్దినెలల కిందట కొన్ని రోజుల పాటు ఓ వీడియో హల్ చల్ చేసింది. వాట్స్ యాప్ - ఫేస్ బుక్ - యూట్యూబ్ లో ఆ వీడియోను కొన్ని లక్షల మంది చూశారు. కూకట్ పల్లి ఏసీపీగా పనిచేసి ఏసీబీకి దొరికిపోయిన సంజీవరావు అనే పోలీసు అధికారికి సంబంధించిన వీడియో అది. అందులో ఆయన యువత కోసం నిర్వహించిన ఓ సదస్సులో మాట్లాడుతున్నట్లుగా ఉంటుంది. అందులో ఆయన అవినీతికి వ్యతిరేకంగా ఊగిపోయి మాట్లాడారు. రాజకీయ అవినీతి - ఉద్యోగుల లంచాలకు వ్యతిరేకంగా ఆవేశంగా మాట్లాడారు. శ్రీశ్రీ కవితలు చెప్పి యువతకు రోమాలు నిక్కబొడిచేలా చేశారు. ఆ మాటలు విన్నవారి గుండెలు ఆవేశంతో నిండిపోయేలా మాట్లాడారు.. ఆ సదస్సు జరిగిన కొద్ది రోజులకే ఆయన ఏసీబీకి దొరికిపోయారు. ఆయన అక్రమాలు - అవినీతి ఆస్లుల విలువ సుమారు 100 కోట్లు ఉంటుంది. అది చూసినవారంతా ''బాబోయ్... ఎన్ని మాటలు చెప్పాడు... ఇంత అవినీతిపరుడా'' అనుకున్నారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకుల మాటలూ అలానే ఉంటున్నాయి. పొద్దున్న ఒక మాట చెప్పి సాయంత్రం ఇంకో పార్టీలోకి వెళ్లిపోతున్న నేతలను చూసి జనం వీరు కూడా ''సంజీవరావు''లే అనుకుంటున్నారు.

చొక్కా మార్చినంత సులభంగా పార్టీ మార్చేస్తున్నారు. అప్పటి వరకు తిట్టిన పార్టీని, నేతలను నెత్తిన పెట్టుకుంటూ... అంతకుముందున్న పార్టీలనూ దుమ్మెత్తి పోస్తూ జనాల్ని ఆశ్చర్యపరుస్తున్నారు. మాకు పార్టీ మారాల్సిన అవసరం లేదు... మాపై దుష్ప్రచారం చేస్తున్నారు.. 2019 ఎన్నికల్లో అధికారం మాదే... అందుకు ఇప్పటినుంచే పార్టీ తరఫున కృషి చేస్తున్నాం.. అంటూ భారీభారీ డైలాగులు చెబుతూ గంటలోనే ఇంకో పార్టీలో చేరిపోతున్నారు నేతలు. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఇంతకుముందు కూడా ఫిరాయింపులు, పార్టీలు మారడాలు ఉన్నప్పటికీ ఈ రేంజిలో సిగ్గువిడవడం ఎన్నడూ లేదని పరిశీలకులు అంటున్నారు.

తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం - టీఆర్ ఎస్ - కాంగ్రెస్ - వైసీపీలలో జరిగిన, జరుగుతున్న పార్టీ ఫిరాయింపులు ప్రజలను విస్మయానికి గురి చేస్తున్నాయి. ఆయా నేతలు పార్టీ మారే ముందు చేస్తున్న ప్రకటనలకు, చేరిన తర్వాత చేస్తున్న ప్రకటనలకు పొంతనే కనిపించడం లేదు. ఫలి తంగా ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో, ఎవరు విభీషణులో, ఎవరు వెన్నుపోటు దారులో తేల్చుకోలేక ఆయా పార్టీ నా యకత్వాలు అయోమయంలో పడిపోతున్నాయి. తాజాగా తెలం గాణ రాష్ట్రంలో టిడిపి నుంచి టీఆర్ ఎస్‌ లోకి జంపయిన ఎర్రబెల్లి దయాకర్‌ రావు వ్యవహారం విస్మయం కలిగిస్తే... అప్పటివరకు టీటీడీపీ కార్యకర్తల భేటీలో మాట్లాడి, అరగంట తర్వాత గులాబీ కండువా కప్పేసుకున్న ఎమ్మెల్యే రాజేందర్‌ రెడ్డి తీరు ఆ పార్టీ నేతలకు ఏకంగా షాక్ కు గురిచేసింది. అంతవరకు పార్టీ మీటింగులో మాట్లాడిన ఆయన తాము పార్టీలోనే ఉంటామని, బాబు కూడా తెలంగాణకు సమయం కేటాయించాలని అభ్యర్ధించారు. సమావేశం ముగియకముందే సొంత కారులో హరీష్ వద్దకు వెళ్లి, టీఆర్ ఎస్ కారెక్కడం ఆశ్చర్యపరిచింది. అంతకుముందు దయాకర్‌ తో పార్టీలో చేరిన ప్రకాష్‌ గౌడ్ ఉదయం తన నియోజకవర్గంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో చాలా ఆవేశంగా ప్రసంగించారు. 'గ్రేటర్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోలేదు. టీఆర్ ఎస్ ప్రభుత్వం ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసింది. అధికారం ఉన్నత మాత్రాన అన్నీ చేయవచ్చని కేసీఆర్ అను కోవడం మంచి పద్ధతి కాదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ టిడిపిదే అధికారం. కార్యకర్తలెవరూ అధైర్య పడవద్దు. మీ వెంట నేనుం టా'ని ఆవేశంగా మాట్లాడారు. కానీ సాయంత్రమే దయాకర్‌ రావు తో కేసీఆర్ క్యాంప్ ఆఫీసుకు వెళ్లి గులాబీ కండువా కప్పేసుకున్నారు ఆయన. శాసనసభలో పార్టీకి నాయకత్వం వహి స్తోన్న ఎర్రబెల్లి దయాకర్‌ రావు అయితే రెండు - మూడు రోజుల క్రితం వరకూ కేసీఆర్‌ ను నానా మాటలు అన్నారు. కేసీఆర్ బ్రోకర్ రాజకీయాలు చేస్తున్నారని, హామీలు ఇవ్వడంలో కేసీఆర్ పిట్టలదొరను మించిపోయారని, ఆయన ఇచ్చిన హామీలు 10 లక్షల కోట్లవుతాయని, అమలు కాని హామీలిచ్చి తెలంగాణ పరువు తీస్తున్నాడని లెక్కలు వేసి మరీ చెప్పారు. మంత్రి తలసాని రాజీనామా ఆమోదంపై గవర్నర్ - స్పీకర్ ద్వంద్వ విధానాలు పాటిస్తున్నందుకు నిరసనగా ఆయన ఆధ్వర్యానే ధర్నా నిర్వహించారు. చివరకు ఆయన టీఆరెస్ లోకి వెళ్లిపోయారు.

మరోవైపు చంద్రబాబు సమక్షంలో ఎమ్మెల్యే రాజేందర్‌ రెడ్డి కూడా భావోద్వేగంతో మాట్లాడారు. 'సార్ హైదరాబాద్ నుంచి వెళ్లిన ప్రతిసారీ శీలపరీక్ష చేసుకోవాల్సి వస్తుంది. పార్టీకి క్యాడర్ ఉంది. మంచి నాయకత్వం ఇవ్వండి. అక్కడ మనం అధికారంలో ఉన్నా, ఇక్కడ ఆఫీసులో ఏదో శూన్యత కనిపిస్తోంది. అది తొలగిపోవాలి. పార్టీలో ఆత్మవిశ్వాసం నింపండి. మమ్మల్ని ఒక్కతాటిపైకి తీసుకురావాలి' అని చెప్పిన అరగంటలోనే టీఆర్ ఎస్ తీర్ధం తీసుకున్నారు. అంతకంటే ముందు కూకట్‌పల్లి టిడిపి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.. ఏపి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు సీఎం కార్యాల యానికి వచ్చారు. అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు మీరు కూడా వెళ్లిపోతున్నారట కదా అని ప్రశ్నిస్తే.. చంద్రబాబునాయుడయినా వెళ్లిపోతారేమో కానీ నేను ఎక్కడికీ వెళ్లను. అయినా అక్కడికి వెళ్లి ఏం చేయాలి? ఇక్కడున్నంత గౌరవం అక్కడ ఉంటుందా? మొదటి రోజు తర్వాత గేటు బయట కావలి కాయడమే కదా? మీరెవరైనా అలాంటి వార్తలు రాసేముందు దయచేసి నా వివరణ కూడా తీసుకోండిసార్ అని చెప్పారు. ఆ తర్వాత రెండు నెలలకు ఆయన పార్టీని వీడారు.

ఇక ఆంధ్రప్రదేశ్‌ లో గతంలో చంద్రబాబునాయుడుపై నిప్పులు కురిపించిన జూపూడి ప్రభాకర్ ఆ తరువాత టీడీపీలో చేరి ఏకంగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మనయిపోయారు. దళితులను విడదీసిన ద్రోహి అని, దళిత జాతి బాబును ఎన్నటికీ క్షమించదని చెప్పిన కొద్దిరోజులకే ఆయన సైకిలెక్కేశారు. ఇక మంత్రిగా ఉండగా, చంద్రబాబును ఏకిపారేసిన ఆనం రామనారాయణరెడ్డి - ఆయన సోదరుడు వివేకానందరెడ్డి.. టిడిపి అధినేత చంద్రబాబునాయుడు క్షుద్రరాజకీయాలు చేస్తున్నారని, ఆయన ఈ రాష్ట్రానికి పట్టిన శని, శాపమని తిట్ల పురాణం విప్పారు. బాబు వల్లే రాష్ట్రం నాశమనయిందని, రాష్ట్ర విభజనలో బాబు శిఖండి పాత్ర పోషిస్తున్నారని, బాబుకు విశ్వసనీయత లేదని, నిజం చెప్పడం ఆయన జీవితంలోనే లేదని విరుచుకు పడ్డారు. తాము పార్టీ మారేది లేదని, చివరి వరకూ కాంగ్రెస్‌ లోనే ఉంటానని చెప్పిన కొద్దిరోజులకే టిడిపి తీర్థం పుచ్చుకున్నారు.

తాజాగా విజయవాడ వైసీపీ ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్ కూడా చంద్ర బాబును కలిశారు. ఆయన తనకు మంత్రి పదవితో పాటు, మరి కొన్ని షరతులు కూడా విధించారని ప్రచారం జరిగింది. నిజానికి ఆయన శాసనసభ జరుగుతున్న సమయంలోనూ బాబు చాంబర్ లోనే ఉంటారు. అయితే బయటకొచ్చిన జలీల్‌ ఖాన్ తాను పార్టీ మారడం లేదని, నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల కోసమే సీఎంను కలిశానని, జగన్‌ కు తనపై నమ్మకం ఉన్నంతవరకూ పార్టీలోనే కొనసాగుతానని చెప్పారు. ఇంత గందరగోళ పరిస్థితి లో ఉన్న తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మకూడదో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది.