Begin typing your search above and press return to search.

‘తూర్పు’లో దూరమైనోళ్లంతా.. జగన్ చెంతకు..

By:  Tupaki Desk   |   12 Jun 2018 7:39 AM GMT
‘తూర్పు’లో దూరమైనోళ్లంతా.. జగన్ చెంతకు..
X
ఏపీలో రాజకీయ చైతన్యానికి తూర్పు గోదావరి జిల్లా పెట్టింది పేరు. ఇక్కడ ఎందరో మహనీయులు జన్మించి రాష్ట్ర రాజకీయాలను ఏలారు. ఇప్పుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర తూర్పు గోదావరి జిల్లాలోకి అడుగుపెట్టబోతోంది. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి రైలు కమ్ రోడ్డు బ్రిడ్జి ద్వారా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి వైఎస్ జగన్ చేరుకోబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు తూర్పుగోదావరి వైసీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు.

గడిచిన ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ కు అధికారం దూరమవడానికి.. చంద్రబాబు గద్దెనెక్కడానికి కాపుల ఓట్లే కీలకంగా మారాయి. ఏపీలో దాదాపు 25శాతం ఉన్న కాపులు ఆ ఎన్నికల్లో చంద్రబాబు హామీలు నమ్మి టీడీపీకి గంపగుత్తగా సపోర్ట్ చేశారు. అందుకే కోస్తాలో టీడీపీ అత్యధిక సీట్లు సాధించింది. కాపులు అత్యధికంగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ ప్రభంజనం సృష్టించింది. కానీ ఈ నాలుగేళ్లు గడిచాక కాపులు ఇప్పుడు టీడీపీకి దూరమయ్యారు..

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఏపీ సీఎం చంద్రబాబు చేసిన మోసంపై ఎదురు తిరిగారు. కాపు ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగదోశారు. దీనిపై కన్నెర్ర చేసిన చంద్రబాబు ముద్రగడను హౌస్ అరెస్ట్ చేసి మొత్తానికి ఉద్యమాన్ని చల్లార్చారు. కాపులకు రిజర్వేషన్లు - విద్యా - ఉద్యోగాలు - నిధుల విషయంలో మాత్రం చంద్రబాబు ఇప్పటికీ స్పష్టతనివ్వకపోవడంతో కాపులంతా టీడీపీ అంటేనే మండిపడుతున్నారు.

ఈ పరిణామాలు పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ కు అనుకూలంగా మారాయి. పశ్చిమగోదావరి జిల్లాలో కాపు నేతలు - ప్రజలు ఆయన్ను ఎంతగానో అభిమానించారు. యాత్రకు విశేషంగా కదిలివచ్చి మద్దతు తెలిపారు. కాపు సామాజికవర్గంలో జగన్ కు వచ్చిన ఆదరణ చూసి ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలోనే సీనియర్ నేత అయిన జ్యోతుల నెహ్రూ వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. జ్యోతుల నెహ్రూ గడిచిన ఎన్నికల్లో వైసీపీ తరుఫున గెలిచారు.కానీ చంద్రబాబు ఇస్తానన్న మంత్రి పదవికి ఆశపడి టీడీపీలోకి జంప్ చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి టీడీపీలో అత్యంత దారుణంగా ఉంది. చంద్రబాబు పట్టించుకోకపోవడంతో అటు వైసీపీకి, ఇటు టీడీపీకి కాకుండా రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. సొంత సామాజికవర్గం నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలోనే జగన్ పాదయాత్ర సందర్భంగా జ్యోతుల నెహ్రూ వైసీపీలో చేరబోతున్నట్టు వార్తలు సమాచారం. ఇలా కాపు నేతలతోపాటు ఇతర సామాజిక వర్గాల్లో జగన్ కు వస్తున్న అపూర్వ ఆదరణతో తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. వైసీపీకి కొండంత బలాన్ని ఇస్తున్నాయి.