Begin typing your search above and press return to search.

సుజ‌నా చెంప మీద కొడ‌తార‌ట‌

By:  Tupaki Desk   |   9 Sep 2016 6:35 AM GMT
సుజ‌నా చెంప మీద కొడ‌తార‌ట‌
X
ప్ర‌త్యేక హోదా కేంద్రంగా అధికార తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసిన ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ క్ర‌మంలో త‌న దాడిని పెంచుతోంది. ఆ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత - ఏపీ సీఎం చంద్రబాబు - ఆయన పార్టీ స‌హ‌చ‌రులపై మండిప‌డ్డారు. బాబు ఎప్పుడూ తాను నిప్పు నిప్పు అంటుంటారని, నిజంగా ఆయన నిప్పే అయితే ప్రత్యేక హోదా సాధించాలని, అది చేయకపోతే ఆయన తుప్పే అవుతారని విమర్శించారు. ఐదు కోట్ల మంది ఆంధ్రప్రజలంతా గుండెల మీద చెయ్యి వేసుకుని ప్రత్యేక హోదా కోసం ఎదురుచూస్తుంటే కేంద్ర మంత్రి సుజనా చౌదరి మాత్రం నియోజకవర్గాల పునర్విభజన అంటున్నారని పేర్కొన్నారు. మరోసారి సుజనా చౌదరి ఆ మాట అంటే జనం చెంపమీద కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చ‌రించారు.

ఢిల్లీ పెద్దలంతా ముఖ్యమంత్రితో టెలిఫోన్ సంభాషణలు చేస్తున్నారని చెప్పుకోవ‌డంతో ప్ర‌జ‌లు హోదాపై పెద్ద ఆశ‌లు పెట్టుకున్నార‌ని జోగి ర‌మేష్ చెప్పారు. అయితే చంద్రబాబు మాత్రం తనకు ప్రత్యేకహోదా అవసరం లేదు, ప్యాకేజీ అవసరం లేదు - రైల్వే జోన్ అవసరం లేదు తనకు కావల్సిందల్లా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న మాత్రమే అంటున్నారని, అది జరిగితేనే తాను ఒప్పుకొంటానని ఢిల్లీ పెద్దలతో చెబుతున్నారని ఇంతకంటే నీచ - నికృష్ట సీఎం ఎవరూ ఉండరని జోగి ర‌మేశ్‌ మండిపడ్డారు. ఇప్ప‌టికీ 5 కోట్ల మంది ప్రజలు ప్రత్యేకహోదా ఎప్పుడు ప్రకటిస్తారని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారన్నారు. డీలిమిటేషన్ చంద్ర‌బాబుకు - ఆయ‌న పార్టీకి కావాలేమో 5 కోట్ల మంది ప్రజలకు అక్కర్లేదన్నారు. వాళ్లకు కావల్సింది ప్రత్యేక హోదా మాత్రమేనని స్పష్టం చేశారు. దాన్ని సాధించలేక దద్దమ్మల్లా విజయవాడలో కూర్చుని మాట్లాడతారేంటని ప్రశ్నించారు. లక్షలాది మంది పిల్లలు కూడా ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాలు వస్తాయని ఏపీలో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు క్యూ కడతారని ఎదురుచూస్తున్నారని జోగి ర‌మేష్‌ తెలిపారు.

ఒకరోజు ప్రత్యేక హోదా అని మ‌రోనాడు ప్యాకేజీ అని కేంద్రం మాట్లాడుత‌న్న‌ప్ప‌టికీ వాళ్లకు తాన తందానా అంటూ సుజనా చౌదరి, పెద్దనాయకుడు వెంకయ్య నాయుడు తయారయ్యారని జోగి ర‌మేష్ మండిప‌డ్డారు. పార్లమెంటులో చర్చ జరిగినప్పుడు ఐదేళ్లు కాదు పదేళ్లు హోదా ఇవ్వాలన్న వెంకయ్య నాయుడు ఇప్పుడు వంకయ్య నాయుడుగా మారిపోయాడని విమర్శించారు. 15 ఏళ్లు హోదా ఇవ్వాలని తిరుపతి వెంకన్న సాక్షిగా చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మాత్రం నీతి తప్పారని, మాట తప్పారని అన్నారు. 5 కోట్ల మంది ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేందుకు రెడీ అయ్యారని జోగి రమేష్ మండిప‌డ్డారు.