Begin typing your search above and press return to search.

అమెరికా ఉప్పు.. చైనా నిప్పు.. బైడెన్ కు జిన్ పింగ్ హెచ్చరిక

By:  Tupaki Desk   |   29 July 2022 10:30 AM GMT
అమెరికా ఉప్పు.. చైనా నిప్పు.. బైడెన్ కు జిన్ పింగ్ హెచ్చరిక
X
పరిస్థితులు చూస్తూ ఉంటే.. ప్రపంచంలో ఏదో ఒక మూలన నిత్యం అశాంతి తప్పదనిపిస్తోంది. ఇలాంటి ధోరణి ఇటీవల బాగా పెరిగిపోయింది. ఈ ఏడాది ప్రారంభంలో దక్షిణాఫ్రికాలో అల్లర్లు, పాకిస్థాన్ లో రాజకీయ మార్పులు.. శ్రీలంకలో సంక్షోభం.. అన్నిటికి మించిన, ఐదు నెలలుగా సాగుతున్నమహా సంక్షోభం ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం.. వీటికితోడు తాజాగా ''తైవాన్'' వ్యవహారం. అమెరికా అగ్గి బరాటా, ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటనకు పూనుకోవడం చైనా, అమెరికా మధ్య చిచ్చు రేపుతోంది. గురువారం ఇరు దేశాల అధినేతలు జిన్ పింగ్, జో బైడెన్ రెండు గంటల పాటు ఫోన్లో తీవ్రంగా చర్చించుకునే వరకు వెళ్లింది. ఈ సందర్భంగా నిప్పుతో చెలగాటం ఆడొద్దంటూ జిన్ పింగ్ హెచ్చరించడం గమనార్హం. అయితే, దీనికి సంబంధించి బైడెన్ కూడా అంతే దీటుగా సమాధానం ఇచ్చారు.

ఎందుకీ మాటల తూటాలు?

కొవిడ్ కాలంలో వైరస్ వ్యాప్తిపై చైనా-అమెరికా మధ్య మాటల తూటాలు పేలాయి. అమెరికా-చైనా అధినేతల మధ్య తాజాగా అలాంటి సన్నివేశమే చోటుచేసుకుంది. అంతేకాదు.. పరస్పరం ఘాటు హెచ్చరికలు జారీ చేసుకొన్నారు. పెలోసీ పర్యటన కారణంగా గురువారం బైడెన్‌-జిన్‌పింగ్‌ మధ్య రెండున్నర గంటల సమావేశం సెగలు పుట్టించింది. ఇరు దేశాల మధ్య విభేదాలను ఈ భేటీ మరోసారి తేటతెల్లం చేసింది. ఇరువురు నేతలు ముఖాముఖి భేటీ కావడానికి సానుకూలత వ్యక్తం చేయడం ఒక్కటే చెప్పుకోదగ్గ పరిణామం. తెరవెనుక అమెరికా ఏదో అనుమానిస్తోంది.. అందుకే ఇటీవల ఆ దేశం తీసుకొన్న నిర్ణయాలు చాలా వరకూ చైనాను దృష్టిలో పెట్టుకొనే ఉంటున్నాయి.

తైవాన్‌ మీద తగువులాట

ఇరు దేశాల అధ్యక్షుల చర్చల్లో తైవాన్‌ ప్రధానాంశంగా మారింది. త్వరలో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ తైపే సందర్శించనుందనే వార్తలను దృష్టిలో పెట్టుకొని జిన్‌పింగ్‌ పరుషమైన వ్యాఖ్యలు చేశారు. ''ప్రజాభిప్రాయాన్ని ఉల్లంఘించకూడదు. ఒక వేళ మీరు నిప్పుతో చెలగాటం ఆడితో మీకే కాలుతుంది. అమెరికా ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకుంటుందని ఆశిస్తున్నా'' అని వ్యాఖ్యానించినట్లు చైనా వర్గాలు పేర్కొన్నాయి.

మరోవైపు అమెరికా ఇంత కఠినంగా కాకపోయినా.. తాను చెప్పాలనుకున్న విషయాన్నికుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. ''తైవాన్‌ విషయంలో అమెరికా పాలసీ మారలేదన్న విషయాన్ని బైడెన్‌ గుర్తు చేశారు. కానీ, ఏకపక్షంగా ప్రస్తుత పరిస్థితిని మార్చే యత్నం చేస్తే తైవాన్‌ జలసంధిలో శాంతి స్థిరత్వం కొరవడుతుంది'' అని పేర్కొన్నట్లు అమెరికా వర్గాలు వెల్లడించాయి. వీరి మధ్య ఆర్థిక సహకారం, ఉక్రెయిన్‌ వంటి అంశాలు కూడా చర్చకు వచ్చాయి.

అప్పుడు ఇప్పుడు నిప్పే..

తమ దేశ ప్రయోజనాల విషయంలో ఎవరైనా అడ్డొస్తే.. నిప్పుతో చెలగాటం అంటూ జిన్ పింగ్ తరచూ వ్యాఖ్యలు చేస్తుంటారు. గతంలో కూడా ఇలానే మాట్లాడారు. చైనాకు చెందినదౌత్యవేత్తలు కూడా తైవాన్‌ విషయంలో ఇదే వాక్యాన్ని తరచూ వాడుతుంటారు. ఇప్పుడు జిన్‌ పింగ్‌ వ్యాఖ్యలు దానికి మరింత ప్రాధాన్యం తెచ్చాయి. నాన్సీ పెలోసీ తైపేలో పర్యటిస్తారనే వార్తలు గుప్పుమనడంతో అమెరికా అప్రమత్తమైంది. చైనాతో పరిస్థితి ఎలా ఉంటుందోనని భావించి కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. మరో వైపు పెలోసీ అధికారికంగా ప్రకటన చేయకపోయినప్పటికీ.. చైనా హెచ్చరికల మీద హెచ్చరికలు జారీ చేస్తోంది. అమెరికా-చైనా మధ్య ఇది ప్రధాన వివాదంగా రూపాంతరం చెందే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇక పెలోసీ పర్యటనను దృష్టిలో పెట్టుకొని అమెరికాకు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్‌ యూఎస్‌ఎస్‌ రోనాల్డ్‌ రీగన్‌, స్ట్రైక్‌ గ్రూప్‌ను సింగపూర్‌ పోర్టు నుంచి దక్షిణ చైనా సముద్రంలోకి తరలించింది. అమెరికా నేవీ సెవన్త్‌ ఫ్లీట్‌ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. చైనా ప్రభుత్వ గూఢచర్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలని అమెరికా అధికారులు హెచ్చరించారు. అణ్వాయుధాలకు సంబంధించిన కమ్యూనికేషన్లపై డ్రాగన్‌ దృష్టిపెట్టినట్లు పేర్కొన్నారు. సెమీ కండెక్టర్ల తయారీ స్థిరీకరించడంపై: అమెరికాలో టెక్‌ సెక్టార్‌ పూర్తిగా స్వతంత్రంగా పనిచేసేలా సెమీకండెక్టర్ల ఉత్పత్తిని స్థిరీకరించాలన్న బిల్లుపై ప్రతినిధుల సభలో ఇరు పక్షాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. చైనా తయారీని నిలిపివేసినా, తైవాన్‌ ఎగమతులను అడ్డుకొన్నా ఇబ్బంది లేకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నారు.