Begin typing your search above and press return to search.

బీహార్లో నితీష్ నిండా మునిగినట్లేనా ?

By:  Tupaki Desk   |   10 Nov 2020 5:40 PM GMT
బీహార్లో నితీష్ నిండా మునిగినట్లేనా ?
X
బీహార్ ఎన్నికల కౌంటింగ్ సరళిని చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఎన్నికల్లో నువ్వా-నేనా అన్నట్లుగా పోటి పడిన రెండు ప్రధాన కూటముల్లో దేనికీ స్పష్టమైన మెజారిటి వచ్చే అవకాశాల కనబడటం లేదు. ఎందుకంటే సాయంత్రం వరకు లీడ్స్ లో ముందంజలో ఉన్న ఎన్డీయే కూటమి రాత్రి 8 గంటల ప్రాంతానికి మళ్ళీ తగ్గిపోతోంది. వెనకబడున్న మహాగట్ బంధన్ (ఎంజీబీ) పుంజుకుని ఎన్గీయే దగ్గరకు వచ్చేస్తోంది.

సరే అంతిమంగా ఎవరు గెలుస్తారు ? అధికారంలోకి వచ్చేది ఏ కూటమి ? అన్న విషయాన్ని పక్కన పెట్టేస్తే హోలు మొత్తం మీద ముణిగిపోయింది మాత్రం ముఖ్యమంత్రి, జేడీయు అధినేత నితీష్ కుమారే అని అర్ధమైపోతోంది. ఎన్డీయేలో కూటమిలో ప్రధాన పార్టీలు జేడీయు, బీజేపీలు మాత్రమే అన్న విషయం అందరికీ తెలిసిందే. సీట్ల సర్దుబాటులో భాగంగా బీజేపీ ఎక్కువ స్ధానాల్లో పోటీ చేస్తే అంతకన్నా తక్కువ సీట్లలోనే జేడీయు అభ్యర్ధులు పోటి చేశారు.

అయితే తాము పోటీ చేసిన సీట్లతో పోల్చితే తమ అభ్యర్ధులే ఎక్కువగా గెలుస్తారని అనుకున్నారు నితీష్. కానీ కౌంటింగ్ మొదలైన తర్వాత జరుగుతున్నది చూస్తుంటే జేడీయు అభ్యర్ధులు చాలా ఘోరంగా వెనకబడిపోయినట్లు అర్ధమైపోతోంది. సీట్ల సర్దుబాటు సమయంలో తాము ఎక్కవ సీట్లలో పోటీ చేసినా తమ ముఖ్యమంత్రి అభ్యర్ధి మాత్రం నితీషే అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోడి దగ్గర నుండి కీలకమైన బీజేపీ నేతలంతా ప్రకటించారు. అంటే అప్పట్లో వారి ధీమా ఏమిటంటే తమతో పాటు జేడీయు అభ్యర్ధులు కూడా గెలుస్తారని.

కానీ జరిగిందేమంటే పోటీ చేసిన సీట్లతో పోల్చితే మెజరిటితో ముందంజలో ఉన్న జేడీయు అభ్యర్ధులు చాలా తక్కువ మందే అని తేలిపోయింది. మరి ఇటువంటి పరిస్ధితుల్లో కూడా తమ కూటమికే అధికారం దక్కినా మరి నితీష్ ను సిఎంగా కూర్చోబెడతారా ? అన్నదే అనుమానంగా ఉంది. ఒకవేళ ఇప్పుడు కూర్చోబెట్టిన ఎంతకాలం కంటిన్యు చేస్తారో అనే అనుమానం పెరిగిపోతోంది. ఏమి జరుగుతుందో తెలియాలంటే మరి పూర్తి ఫలితాలు వచ్చేదాక వెయిట్ చేయక తప్పట్లు లేదు.