Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్ స్టార్ హోట‌ళ్ల‌లో క‌ర్ణాట‌క నేత‌లు

By:  Tupaki Desk   |   18 May 2018 4:23 AM GMT
హైద‌రాబాద్ స్టార్ హోట‌ళ్ల‌లో క‌ర్ణాట‌క నేత‌లు
X
క‌ర్ణాట‌క రాజ‌కీయం హైద‌రాబాద్‌కు షిఫ్ట్ అయ్యింది. కేర‌ళ‌లో త‌మ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్నా.. అక్క‌డ కాద‌నుకొని మ‌రీ కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం నేత‌ల్ని హైద‌రాబాద్‌కు షిఫ్ట్ చేయ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం జేడీఎస్ ప్రోద్బ‌లంతోనే కాంగ్రెస్ కూడా హైద‌రాబాద్‌కు ఓకే చెప్పిన‌ట్లుగా చెబుతోంది.

త‌మ కొత్త స్నేహితుడు కేసీఆర్ ఇలాకాలో అయితే.. త‌మ‌కు ఎలాంటి ఇబ్బంది ఉండ‌ద‌న్న ఉద్దేశంతోనే జేడీఎస్ నేత‌లు హైద‌రాబాద్ లో షెల్ట‌ర్ కు ఓకే చెప్పిన‌ట్లు తెలుస్తోంది. బెంగ‌ళూరులో గురువారం అర్థ‌రాత్రి మూడు ట్రావెల్ బ‌స్సులు.. ప‌లు ప్రైవేటు వాహ‌నాల్లో బ‌య‌లుదేరిన కాంగ్రెస్‌.. జేడీఎస్ నేత‌లు హైద‌రాబాద్ కు ఈ ఉద‌యం చేరుకున్నారు.

వారంతా మాదాపూర్ నోవాటెల్‌.. టి.సుబ్బిరామిరెడ్డికి చెందిన పార్క్ హ‌య్య‌త్ హోట‌ల్‌కు వ‌చ్చారు.

అయితే.. ఈ రెండు హోట‌ళ్ల‌లోనే కాకుండా బంజారాహిల్స్ లోని తాజ్ కృష్ణ‌.. గండిపేట‌లోని గోల్కొండ రిసార్ట్‌కు కూడా వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది. దీంతో పాటు న‌గ‌ర శివారులోని ప్ర‌గ‌తి రిసార్ట్స్ కూడా కొంద‌రు క‌ర్ణాట‌క ఎమ్మెల్యేల్ని త‌ర‌లించిన‌ట్లుగా తెలుస్తోంది. ఒకేచోట ఎమ్మెల్యేలు అంతా ఉండ‌కుండా.. కొద్ది మంది చొప్పున వేర్వేరు చోట్ల ఉంచ‌డం గ‌మ‌నార్హం. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మాత్రం పార్క్ హ‌య్య‌త్‌.. నోవాటెల్‌లోనే ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. ఈ హోట‌ళ్ల బ‌య‌ట ప్రైవేటు సెక్యురిటీని క‌ర్ణాట‌క నుంచి త‌ర‌లించిన‌ట్లుగా చెబుతున్నారు. ఆయా హోట‌ళ్ల ద‌గ్గ‌ర బౌన్స‌ర్ల హ‌డావుడి ఎక్కువ‌గా ఉంది.

పార్క్ హ‌య‌త్‌.. నోవాటెల్ ద‌గ్గ‌ర‌పోలీసుల హ‌డావుడి ఎక్కువ‌గా ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే ఇలాంటి క్యాంపుల సంద‌ర్భంగా స్థానిక పోలీసులు అలెర్ట్ గా ఉంటారే త‌ప్పించి.. ఉన్న‌తాధికారుల హ‌డావుడి పెద్ద‌గా ఉండ‌దు. దీనికి భిన్నంగా తాజా ఎపిసోడ్‌ లో మాత్రం ఉన్న‌తాధికారులు ప్ర‌త్యేకంగా క‌ర్ణాట‌క ఎమ్మెల్యేల‌కు సంబంధించిన ఏర్పాట్లు.. సెక్యురిటీని ప‌ర్య‌వేక్షిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. వివిధ హోట‌ళ్ల‌లో ఉన్న కాంగ్రెస్ నేత‌ల‌కు సంబంధించిన వ్య‌వ‌హారాల్ని చూసేందుకు హైద‌రాబాద్‌కు చెందిన‌ కాంగ్రెస్ నేత‌ల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించిన‌ట్లుగా తెలుస్తోంది.