Begin typing your search above and press return to search.

జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్‌ కి హైకోర్టు లో చుక్కెదురు!

By:  Tupaki Desk   |   30 July 2020 5:00 AM GMT
జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్‌ కి హైకోర్టు లో చుక్కెదురు!
X
టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌ రెడ్డి కి మరోసారి హైకోర్టు లో చుక్కెదురైంది. 154 వాహనాలకు సంబంధించి ఫేక్ ఇన్సూరెన్స్ వ్యవహారంలో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసు పై విచారణ జరిపిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు నిషేధించిన వాహనాలను రోడ్ల పై ఎలా తిప్పుతారని హై కోర్ట్ సూటిగా ప్రశ్నించింది. అలాగే ఆ వాహనాలతో ప్రమాదాలు జరిగితే భాద్యత ఎవరిదీ అని , మోసపూరిత పనులను అనుమతించమని స్పష్టం చేస్తూ బెయిల్‌ పిటిషన్‌ ను‌ హైకోర్టు కొట్టివేసింది. దీంతో హైకోర్టులో మూడు కేసుల్లో దాఖలు చేసిన బెయిల్ పిటీషన్లను జేసీ కుటుంబ సభ్యులు ఉపసంహరించుకున్నారు. అదే విధంగా కింది కోర్టులో బెయిల్ దరఖాస్తు చేసుకునేందుకు హైకోర్టు వీరికి అనుమతి ఇచ్చింది.

154 వాహనాలకు సంబంధించి ఫేక్ ఇన్సూరెన్స్ వ్యవహారం లో అనంతపురం పోలీసులు ఈ ఇద్దరిని అరెస్ట్ చేశారు. రవాణాశాఖ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. హైదరాబాద్‌ లోని వారి ఇంట్లో ఆ ఇద్దరిని అదుపు లోకి తీసుకున్నారు. సుప్రీం కోర్టు నిషేధించిన బీఎస్‌-3 వాహనాలను నకిలీ డాక్యుమెంట్లతో బీఎస్-‌4గా రిజిస్ట్రేషన్‌ చేసి అమ్మకాలు సాగించినట్లు వీరి పై ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై కూపీ లాగగా నకిలీ పత్రాలు సృష్టించి 154 వాహనాలు నాగాలాండ్ ‌లో రిజిస్ట్రేషన్‌ చేయించినట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది. వాహనాల ఇన్సూరెన్స్ చెల్లించకుండానే చెల్లించినట్లు నకిలీ పత్రాలు సృష్టించిన కేసులో జేసీ అస్మిత్ రెడ్డి, 154 బస్సుల నకిలీ యన్ ఓ సీ కేసులో జేసి ప్రభాకర్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీరిద్దరూ కడప సెంట్రల్ జైల్లో రిమాండ్‌ లో ఉన్నారు. ఇకపోతే , ఈ కేసులో జేసీ ట్రావెల్స్ ‌కి చెందిన 60 వాహనాలను ఇప్పటివరకు రవాణాశాఖ అధికారులు సీజ్ చేశారు. మిగిలిన 94 వాహనాలను జేసీ బ్రదర్స్ అఙ్ఞాతంలో దాచి పెట్టారని అధికారులు చెబుతున్నారు. ఇక జేసీ ట్రావెల్స్‌ వాహనాల్లో ప్రయాణించే వారికి ఇకపై ఇన్సూరెన్స్‌ వర్తించదని అధికారులు తేల్చి చెప్పారు.