Begin typing your search above and press return to search.

అనంతపురం ఎవరిదీ.? యువనేతల బిగ్ ఫైట్

By:  Tupaki Desk   |   30 Jun 2018 6:55 AM GMT
అనంతపురం ఎవరిదీ.? యువనేతల బిగ్ ఫైట్
X
పరిటాల రవి.. అనంతపురం జిల్లాను గుప్పిట పట్టి రాజకీయాల్లో ఆరితేరిన టీడీపీ నేత. కాంగ్రెస్ అంటేనే గిట్టని ఆయన అప్పట్లో కాంగ్రెస్ నేతలుగా ఉన్న జేసీ బ్రదర్స్ ను ముప్పుతిప్పలు పెట్టారు. జిల్లాలోనే ఉండనిచ్చేవారు కాదు.. కానీ ఆయన మరణం తర్వాత జిల్లాలో పరిస్థితులు మారిపోయాయి. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ ఏపీలో అంతర్థానమైపోయింది. దీంతో కాంగ్రెస్ లో వెలుగు వెలిగిన జేసీ బ్రదర్స్ ఇప్పుడు టీడీపీలో చేరిపోయారు. అనంతపురం ఎంపీగా జేసీ దివాకర్ రెడ్డి టీడీపీలో చక్రం తిప్పుతున్నారు.

పరిటాల రవి వారసుడిగా శ్రీరామ్ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. ప్రస్తుతం టీడీపీలో తండ్రుల స్థానంలో కొత్త జనరేషన్ దూసుకొస్తోంది.వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని టీడీపీలోని వారసులందరూ సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే కరణం బలరాం - దేవినేని నెహ్రూ - యెర్రం నాయుడు - అయ్యన్న పాత్రుడు వంటి సీనియర్ నేతల వారసులు రాజకీయాల్లో క్రీయాశీలంగా మారారు.

ఇక అనంతపురం రాజకీయం కూడా రంజుగా మారింది. టీడీపీ లో ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్ రెడ్డి - పరిటాల రవి కుమారుడు శ్రీరామ్ లు జిల్లాపై ఆదిపత్యం కోసం పావులు కదుపుతున్నారు. వచ్చే 2019 ఎన్నికల్లో తమ వర్గాలను పెంచి పోషించి జిల్లాపై ఆదిపత్యం చెలాయించేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు వెళుతున్నారు.

పరిటాల రవి బతికి ఉన్నప్పుడు అనంతపురం జిల్లా మొత్తం ఆయన గుప్పిట్లో ఉండేది. అప్పట్లో తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల్లో జేసీ ఫ్యామిలీ తలదూరిస్తే పరిటాల రవి వారిని బెదిరించి జిల్లానుంచే తరిమేశారనే ప్రచారం ఉంది. కానీ ఇప్పుడు అదే జేసీ ఫ్యామిలీ తాడిపత్రి రాజకీయాల్లో ఏకచత్రాధిపత్యం వహిస్తోంది. అంతేకాదు.. ఇప్పుడు అనంతపురం జిల్లా రాజకీయాలను ప్రభావితం చేసేందుకు విస్తరించే పనిలో పడింది. జేసీ పవన్ రెడ్డి ఈమేరకు కార్యాచరణ రూపొందిస్తున్నట్టు సమాచారం.

జేసీ దివాకర్ రెడ్డి నోరుపారేసుకుంటూ వివాదాస్పద నేతగా పేరొందారు. కానీ ఆయన కుమారుడు జేసీ పవన్ రెడ్డి మాత్రం లౌక్యం తెలిసిన మంచి నాయకుడిగా జిల్లాలో పేరుంది. అంతేకాదు.. ఈయన ముఖ్యమంత్రి తనయుడు నారాలోకేష్ తో సన్నిహిత సంబంధాలను నెరుపుతున్నారు. లోకేష్ కు పరిటాల శ్రీరామ్ కంటే జేసీ పవన్ రెడ్డినే దగ్గర అని టీడీపీ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం 2019 ఎన్నికల లక్ష్యంగా జేసీ పవన్ - పరిటాల శ్రీరామ్ లు తమ కుటుంబ పరువు ప్రతిష్టలను భూజాన వేసుకొని బరిలోకి దిగుతున్నారు. అనంతపురం జిల్లాను లీడ్ చేసేందుకు సమాయత్తమవుతున్నారు.ఈ ఇద్దరిలో ఎవరి ఆదిపత్యం నడుస్తుందనేది హాట్ టాపిక్ గా మారింది. ఇది అంతిమంగా అనంతపురం జిల్లా టీడీపీ రాజకీయాల్లో వర్గపోరుకు దారితీస్తోంది.