Begin typing your search above and press return to search.

వారి కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తా: జేసీ

By:  Tupaki Desk   |   2 Jan 2021 2:48 PM GMT
వారి కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తా: జేసీ
X
జేసీ, పెద్దారెడ్డిల మధ్య వర్గపోరుతో అనంతపురం అట్టుడుకుతోన్న సంగతి తెలిసిందే. అరెస్టులు.. దాడులు.. ప్రతి దాడులు.... సవాళ్లు....ప్రతి సవాళ్లతో తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి - ఎమ్మెల్యే పెద్దిరెడ్డి అనుచరుల అరెస్టుల పర్వంతో ఎపుడు ఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ప్రభాకర్‌ రెడ్డితోపాటు అనుచరులపై ఎస్సీ - ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు 307సెక్షన్ కింద కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. అట్రాసిటీ కేసును రాజకీయంగా వాడుకుంటున్నారని, ఆ కేసు పరిష్కారమయ్యే వరకు ఈ నెల 4 నుంచి తాడిపత్రిలో ఆందోళన చేపడతానని జేసీ చెప్పారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నవారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని జేసీ ఆరోపించారు. సీఐని కులంపేరుతో దూషించానని తనపై తప్పుడు కేసు పెట్టారని, కక్ష సాధింపుతోనే ఆ కేసు బనాయించారని ఆరోపించారు. తమ ఇంట్లోనే కులాంతర వివాహాలు చేసుకున్నామని, తాను ఎవరినీ దూషించలేదని చెప్పారు. రెండేళ్ల తర్వాత ప్రభోధనంద ఆశ్రమంపై కేసును రాజకీయంగా వాడుకుంటున్నారని జేసీ ఆరోపించారు. అమరావతి రాజధాని రైతుల ఆందోళనను జగన్ సర్కార్ తక్కువగా చూస్తోందని, శ్రీకాకుళం - విశాఖ మినహా అన్ని ప్రాంతాల వారు ఒకే రాజధానికి మద్దతిస్తున్నారని చెప్పారు. అమరావతి రాజధాని రైతుల ఆందోళనపై ప్రధాన మంత్రి మోడీ జోక్యం చేసుకోవాలని జేసీ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఉందా అని అనుమానం వస్తోందని జేసీ వ్యాఖ్యానించారు. అమరావతి రైతు సంఘం ఆమరణ నిరాహార దీక్షకు పిలుపునిస్తే ఆ దీక్షలో తాను కూడా పాలుపంచుకుంటానని అన్నారు.