Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ పిల్లాడ‌న్నాడు, పిల్లాడి దెబ్బ‌కే బావురుమంటున్నారు!

By:  Tupaki Desk   |   10 Feb 2020 5:00 PM GMT
జ‌గ‌న్ పిల్లాడ‌న్నాడు, పిల్లాడి దెబ్బ‌కే బావురుమంటున్నారు!
X
''ఏం తెల‌సు.. ' 'పిల్లోడు..' 'చంద్ర‌బాబు నాయుడి సీనియారిటీ..' 'జ‌గ‌న్ కు అనుభ‌వం లేదు..' ఇవీ ఏపీ రాజ‌కీయాల్లో ఎన్నిక‌ల ముందు వ‌ర‌కూ గ‌ట్టిగా వినిపించిన మాట‌లు. చంద్ర‌బాబు నాయుడును మ‌ళ్లీ ఎందుకు ముఖ్య‌మంత్రి చేయాలో చెప్ప‌లేక చాలా మంది ఎన్నిక‌ల ముందు ఈ మాట‌లు మాట్లాడారు. జ‌గ‌న్ కు ఏం తెలియ‌ద‌ని, జ‌గ‌న్ కు అనుభ‌వ లేమి అని, చంద్ర‌బాబు నాయుడు అన్నీ ఎరిగిన వ్య‌క్తి అని, దేశంలోనే సీనియ‌ర్ అని.. ఇలా చెప్పుకుపోయారు. అలాంటి వారిలో ఒక‌రు జేసీ దివాక‌ర్ రెడ్డి కూడా! చంద్ర‌బాబుకు కాస్త అటూ, ఇటూ గా పొలిటిక‌ల్ కెరీర్ ప్రారంభించి ఉంటారు దివాక‌ర్ రెడ్డి. అయితే చంద్ర‌బాబు భ‌జ‌న గ‌ట్టిగా చేశారీయ‌న‌. త‌న సీనియారిటీని ప‌క్క‌న పెట్టి, చంద్ర‌బాబు సీనియ‌ర్ అంటూ డ‌బ్బా కొట్టిన వాళ్ల‌లో దివాక‌ర్ రెడ్డి ముందుంటారు. అదే స‌మ‌యంలో ఈయ‌న జ‌గ‌న్ ను ప‌దే ప‌దే అనుభ‌వం లేని వ్య‌క్తి అని, పిల్లోడ‌ని రాయల‌సీమ యాస‌లో చెప్పుకొచ్చారు!

మ‌రి అప్పుడంతా జ‌గ‌న్ ను పిల్లోడు, పిల్ల‌కాయ‌.. అని జేసీ ఎందుకు అన్నారో కానీ, ఇప్పుడు అదే పిల్లోడు, అదే పిల్ల‌కాయ ఈ పెద్ద‌కాయకు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నార‌ని ప‌రిశీల‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇటీవ‌లే చంద్ర‌బాబును క‌లిసిన దివాక‌ర్ రెడ్డి, ఆయ‌న‌ను వాటేసుకుని.. ఆయ‌న పొట్టలో త‌న త‌ల పెట్టి ఏడ్చేసిన వైనం ఫొటోలకు చిక్కింది. వ‌య‌సులో పెద్ద‌వాడు అయిపోవ‌డంతో దివాక‌ర్ రెడ్డికి క‌న్నీళ్లు ఈజీగా వ‌స్తూ ఉండ‌వ‌చ్చు. అందునా.. ఒక‌టా రెండా. ఇప్పుడు వంద‌ల కోట్ల రూపాయ‌ల ఫైన్ ప‌డే అవ‌కాశాలున్నాయ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి!

ఇప్ప‌టికే జేసీ ఆర్థిక సామ్రాజ్యం కుప్ప కూలే ద‌శ‌కు చేరుకుంద‌ని అంటున్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ అంటూ కేటాయించిన భూముల‌ను ఇప్పుడు ప్ర‌భుత్వం వెన‌క్కు తీసుకుంటూ ఉంది. మ‌రోవైపు అక్ర‌మ‌ బ‌స్సులు సీజ్ అయ్యాయి. ప్ర‌భుత్వం కేటాయించిన భూముల్లో అక్ర‌మ మైనింగ్ విష‌యంలో భారీ ఫైన్ ప‌డుతుంద‌ని, ఫోర్జ‌రీ వ్య‌వ‌హారంలోనే వంద కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ ఫైన్ ప‌డే అవ‌కాశాలున్నాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతూ ఉంది. ఇక క‌నీసం తాడిప‌త్రి లో ఎమ్మెల్యే గా నెగ్గ‌లేక‌ పోవ‌డంతో జేసీ కుటుంబ రాజ‌కీయ భ‌విత‌వ్యం కూడా ప్ర‌శ్నార్థ‌కం గా మారింది. జ‌గ‌న్ గాలిలో జేసీల కంచుకోట కూడా బ‌ద్ధ‌లైంది.

ఈ ప‌రిణామాల‌న్నింటినీ గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్ ను త‌క్కువ చేసి, అనుభవం లేద‌ని ప‌దే ప‌దే చెప్పుకొచ్చిన దివాక‌ర్ రెడ్డికి త‌నంటే ఏమిటో జ‌గ‌న్ అర్థ‌మ‌య్యేలా చేశాడ‌ని ప‌రిశీల‌కులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. జ‌గ‌న్ దెబ్బ‌కు తెలుగుదేశం పెద్ద పెద్ద త‌ల‌లే ఇబ్బంది ప‌డ్డాయి. ప్ర‌త్యేకించి తెలుగుదేశం చేతిలో అధికారం ఉన్న‌ప్పుడు అడ్డ‌గోలుగా వ్య‌వ‌హ‌రించిన వారు ముప్పు తిప్ప‌లు ప‌డ్డారు, ప‌డుతున్నారు. ఇలాంటి నేప‌థ్యంలో జేసీ వంతు వ‌చ్చినట్టుగా ఉంది. వంద‌ల కోట్ల రూపాయ‌ల ఫైన్లు, సీజ్ ల‌తో దివాక‌ర్ రెడ్డి దందా వార్త‌ల్లోకి వ‌స్తూ ఉంది. మ‌రి ఇప్ప‌టికైనా దివాక‌ర్ రెడ్డికి త‌త్వం బోధ‌ప‌డిందా? అనే ప్ర‌శ్న‌లూ వ్య‌క్తం అవుతున్నాయి!