Begin typing your search above and press return to search.

జ‌య‌రాంది హ‌త్యే...ఇదిగో ఆధారాలు

By:  Tupaki Desk   |   26 Feb 2019 2:40 PM GMT
జ‌య‌రాంది హ‌త్యే...ఇదిగో ఆధారాలు
X
పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరాం విషంయ‌లో మ‌రో కీల‌క ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. జయరాం హత్య కేసుపై డీసీపీ శ్రీనివాస్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కేసుకు సంబంధించిన విషయాలను డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. జ‌య‌రాంది ముమ్మాటికీ హత్యేనని పేర్కొన్నారు. జయరాం హత్య కేసు సమయంలో తీసిన కొన్ని - వీడియో - ఫొటోలు సేకరించామని డీసీపీ తెలిపారు. ``జయరాం హత్య కేసులో పలు కోణాలున్నాయి. జయరాం హత్యకేసులో మరో ముగ్గురు రౌడీషీటర్లు విశాల్ - నగేష్ - సుభాస్ చంద్రారెడ్డిని అరెస్ట్ చేశాం` అని చెప్పారు. రాకేశ్ రెడ్డి జయరాంను చిత్రహింసలు పెట్టి..బాండు పేపర్లపై సంతకం చేయించుకున్నాడని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.

ప్రణాళిక ప్రకారమే జయరాంను రాకేశ్ రెడ్డి ఇంటికి పిలిపించుకున్నాడని డీసీపీ శ్రీనివాస్ వివ‌రించారు. ``బెదిరించి డబ్బు వసూలు చేయాలని రాకేశ్ రెడ్డి కుట్రపన్నాడు. జయరాంకు..రాకేశ్ రెడ్డి ఎలాంటి అప్పు ఇవ్వలేదు. రూ.4.50 కోట్లు అప్పు ఇచ్చినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదు`` అని వెల్ల‌డించారు. జయరాంను కిడ్నాప్ చేశార‌ని డీసీపీ వివ‌రించారు. ``జయరాంను బెదిరించి కొట్టిన అనంతరం హత్య చేశారు. రూ.4 కోట్ల కోసం దాదాపు 10 మందికి ఫోన్లు చేశారు. దస్పల్లాకు వచ్చిన రూ.6లక్షలను వారు రికవరీ చేసుకున్నారు. ఖాళీ పేపర్లపై జయరాంతో సంతకాలు చేయించుకున్నాడు. ఈ దృశ్యాలను మొబైల్ లో వీడియో తీశాడు. హత్యకేసుకు సంబంధించి నిందితుడు రాకేశ్ రెడ్డిని పూర్తిగా విచారణ చేశాం` అని డీసీపీ శ్రీనివాస్ అన్నారు. జయరాం ఇంట్లోకి అనుమతి లేకుండా వెళ్లినందుకు శిఖా చౌదరిపై కేసు నమోదు చేశామ‌న్నారు. ``జయరాం హత్య కేసులో శిఖా చౌదరి పాత్ర ఉన్నట్లు మా దర్యాప్తులో తేలలేదు. శిఖాచౌదరిపై రాకేశ్ రెడ్డి ఎటువంటి ఆరోపణలు చేయలేదు. మా విచారణ పూర్తయిన తర్వాతే శిఖాచౌదరి పాత్రపై వివరణ ఇస్తాం. శిఖాచౌదరికి సంబంధించి రూ.1.5 కోట్లు డబ్బు చెల్లిస్తానని జయరాం ఒప్పుకున్నారు. జయరాం హత్య జరిగినట్లు శిఖాచౌదరికి ఆమె స్నేహితుడు సంతోష్ ఫోన్ ద్వారా తెలియజేశాడు. జయరాంకు సంబంధించి వందల కోట్లకు ఇన్సురెన్సులున్నట్లు మాకు తెలియదు. మా విచారణలో ఇన్సురెన్స్ కు సంబంధించిన ఎటువంటి సమాచారం లభించలేదు` అని డీసీపీ శ్రీనివాస్ తెలియజేశారు.

జయరాం హత్య తర్వాత రాకేశ్ రెడ్డి పోలీసులకు ఫోన్లు చేసినట్లు ఆరోపణలు వచ్చాయ‌ని డీసీపీ వివ‌రించారు. ``జయరాం కేసులో ఐదుగురు పోలీసు అధికారులను విచారించాం. ఏసీపీ మల్లారెడ్డి, సీఐలు శ్రీనివాస్, రాంబాబు, గోవింద్ రెడ్డి, హరిచంద్రారెడ్డిని విచారించాం. రాకేశ్ రెడ్డికి పోలీస్ అధికారులు సహకరించినట్లు నిర్దారణ కాలేదు` అని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. పోలీసుల పాత్రపై ఇంకా విచారణ కొనసాగిస్తూనే ఉన్నట్లు చెప్పారు.