Begin typing your search above and press return to search.

కొడ‌నాడుకు మూడు కార్ల‌లో వెళ్లిందెవ‌రు?

By:  Tupaki Desk   |   11 May 2017 4:41 AM GMT
కొడ‌నాడుకు మూడు కార్ల‌లో వెళ్లిందెవ‌రు?
X
త‌మిళ‌నాడు అమ్మ జ‌య‌ల‌లిత మ‌ర‌ణం త‌ర్వాత‌.. ఆ రాష్ట్రంలో ఎప్పుడేం జ‌రుగుతుందో అస్స‌లు అర్థం కాని ప‌రిస్థితి. ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు ఒక ఎత్తు అయితే.. అస‌లేం జ‌రుగుతుంద‌న్న క‌నీస స‌మాచారం ఎవ‌రి ద‌గ్గ‌రా లేకుండా చోటు చేసుకుంటున్న కొన్ని ఘ‌ట‌న‌లు అయోమ‌యానికి.. ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్నాయి. మొన్న‌టికి మొన్న అమ్మ‌కు అత్యంత ప్రీతిపాత్ర‌మైన కొడ‌నాడు ఎస్టేట్ లో దొంగ‌త‌నం చోటు చేసుకోవ‌టం.. సెక్యూరిటీ గార్డు హ‌త్య‌కు గురి కావ‌టం సంచ‌ల‌నంగా మారింది. ఈ ఉదంతంలో నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచార‌ణ చేప‌ట్టిన త‌ర్వాత సంచ‌ల‌న అంశాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

కొడ‌నాడు ఎస్టేట్‌లో అంతులేని సంప‌ద‌ను తాము చూసిన‌ట్లుగా చెప్ప‌ట‌మే కాదు.. ఒక పెద్ద మ‌నిషి పుణ్య‌మా అనే.. కొడ‌నాడులో దోపిడీ య‌త్నం చేసిన వైనాన్ని నిందితులు చెప్ప‌టం హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్య‌వ‌హారంపై త‌లెత్తుతున్న ప్ర‌శ్న‌లు ఒక కొలిక్కి రాక ముందే.. తాజాగా మ‌రికొన్ని సందేహాలు రేపుతూ కొత్త ప‌రిణామం చోటు చేసుకుంది.

బుధ‌వారం ఉద‌యం మూడు కారుల్లో కొడ‌నాడు ఎస్టేట్‌కు వ‌చ్చిన కొంద‌రు.. ఎస్టేట్ స‌మీపంలోకి ఎవ‌రినీ అనుమ‌తించ‌ని వైనం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వ‌చ్చింది ఎవ‌రు? ఎస్టేట్ లోప‌లేం చేస్తున్నార‌న్న అంశంపై స్ప‌ష్ట‌త లేక‌పోవ‌టం గ‌మ‌నార్హం. ఇటీవ‌ల దోపిడీకి పాల్ప‌డ్డ నిందితుల మాట‌ల‌తో ఐటీ శాఖ రంగ ప్ర‌వేశం చేసింద‌న్న సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి. స్థానిక ఐటీ అధికారుల్ని ఇదే ప్ర‌శ్న‌ను సంధించ‌గా.. కొడ‌నాడు ఎస్టేట్ లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వ‌హిస్తున్న అంశానికి సంబంధించిన స‌మాచారం త‌మ వ‌ద్ద లేద‌ని చెప్ప‌టం గ‌మ‌నార్హం.

బుధ‌వారం ఉద‌య‌మే మూడు వాహ‌నాల్లో ఎస్టేట్‌లోకి వెళ్లిన వారు ప‌దిమందికి పైనే ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. అయితే.. వీరు ఎవ‌ర‌న్న విష‌యంపై ఎవ‌రూ పెద‌వి విప్పక‌పోవ‌టం ఆశ్చ‌ర్య‌క‌రంగా మారింది. అయితే.. కొన్ని వ‌ర్గాల అంచ‌నా ప్ర‌కారం.. కొడ‌నాడు ఎస్టేట్‌లోకి తాజాగా వెళ్లింది ఐటీశాఖాధికారులేన‌ని చెబుతున్నారు. ఎస్టేట్ మొత్తాన్ని క్షుణ్ణంగా త‌నిఖీలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎస్టేట్‌కు అర‌కిలోమీట‌రు దూరంలో బ్యారికేడ్లు ఏర్పాటు చేసి.. ఎవ‌రినీ లోప‌ల‌కు అనుమ‌తించ‌ని వైనంతో.. ఐటీ త‌నిఖీలే సాగుతున్న‌ట్లుగా స‌మాచారం. అదే జ‌రిగితే.. చిన్న‌మ్మ వ‌ర్గానికి పెద్ద షాకేన‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఎలాంటి అధికారిక స‌మాచారం లేకుండా కొడ‌నాడు ఎస్టేట్‌ను జ‌ల్లెడ ప‌ట్ట‌టం చూస్తే.. రానున్న రోజుల్లో త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో కీల‌క మార్పుల దిశ‌గా అడుగులు ప‌డుతున్నట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.