Begin typing your search above and press return to search.

ఊరికి ఊరే కదిలి వచ్చింది.. కంట తడి పెట్టిస్తోన్న 'ఎగువ రేగడవారి పల్లె'

By:  Tupaki Desk   |   10 Dec 2021 5:37 AM GMT
ఊరికి ఊరే కదిలి వచ్చింది.. కంట తడి పెట్టిస్తోన్న ఎగువ రేగడవారి పల్లె
X
అనూహ్యంగా చోటు చేసుకున్న సీడీఎస్ (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) జనరల్ బిపిన్ రావత్ వ్యక్తిగత భద్రతాధికారిగా పని చేస్తూ.. తాజాగా చోటు చేసుకున్న హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన తెలుగు బిడ్డ లాన్స్ నాయక్ బి.సాయి తేజ స్వగ్రామం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. తమ ముద్దుబిడ్డ ఇక లేడన్న విషయాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. చిత్తూరు జిల్లా కురబల కోట మండలం ఎగువ రేగడవారిపల్లెకు చెందిన సాయి తేజ.. స్వశక్తితో చాలా తక్కువ కాలంలో కీలక స్థానానికి చేరుకున్నాడు. సీడీఎస్ బిపిన్ రావత్ తో కలిసి ప్రయాణించిన అతడు.. హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే.

హెలికాఫ్టర్ ప్రమాదంలో తమ ఊరి బిడ్డ మరణించిన విషయాన్ని తెలిసిన వెంటనే సాయి తేజ ఇంటికి ఊరు ఊరంతా కదిలివస్తోంది. అతగాడి కుటుంబాన్ని ఓదారుస్తోంది. తల్లి శ్యామల.. తాత మోహన్.. నాయనమ్మ భువనేశ్వరిలు గుక్క పట్టి ఏడుస్తుంటే.. ఎవరెవరో వస్తున్నారు.. వారంతా తమ సొంత బిడ్డను కోల్పోయినట్లుగా వేదన చెందుతూ.. శోక సంద్రంలో ఉన్న కుటుంబాన్ని ఓదారుస్తున్నారు.

జరిగిందేమిటో తెలీని పసివాళ్లు (మోక్షజ్ఞ, దర్శిని) తమ ఇంటికి వస్తున్న వారిని చూస్తూ ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రమాదంలో మరణించిన వారి డెడ్ బాడీలు గుర్తు పట్టలేని రీతిలో ఉండటంతో.. సాయి తేజ డెడ్ బాడీని గుర్తించేందుకు వెళ్లిన ప్రత్యేక ఆర్మీ టీం.. అతడి తల్లిదండ్రుల నుంచి బ్లడ్ శాంపిల్స్ ను సేకరించి.. డీఎన్ ఏ పరీక్షల ఆధారంగా డెడ్ బాడీని గుర్తించనున్నారు. ఈ రోజు (శుక్రవారం) సాయంత్రానికి అతడి డెడ్ బాడీ స్వగ్రామానికి చేరుకుంటుందని భావిస్తున్నారు.

సాయితేజ మరణవార్త విన్నంతనే.. అతడి భార్య శ్యామల.. ఇద్దరు పిల్లలు మదనపల్లి నుంచి ఎగువరేగడ వారి పల్లెకు చేరుకున్నారు. సాయితేజ పార్థివదేహాన్ని ఇంటికి సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో ఖననం చేస్తారని చెబుతున్నారు. తన సోదరుడి మరణవార్త విన్నంతనే.. సాయితేజ తమ్ముడు మహేశ్ సిక్కిం నుంచి సొంతూరుకు చేరుకున్నాడు.

ప్రస్తుతం అతడు బీఎస్ఎఫ్ జవానుగా పని చేస్తున్నాడు. ఆర్మీలోకి పంపొద్దని ఊళ్లో అందరూ చెబుతున్నా.. తాను మాత్రం అందుకు భిన్నంగా పంపించానని.. ‘‘ఆడు వెళతానని పట్టుబడితే బిడ్డ కోరిక కాదనలేక పోతినే.. ఇప్పుడు ఇట్టా జరిగితే నాకుదిక్కెవరు రామా.. నీకు నేనున్నా నాన్నా అనే వాడివే బిడ్డా.. ఇప్పుడిలా వెళ్లిపోతివే సామీ’’ అంటూ తండ్రి మోహన్ విలపిస్తున్న తీరు అందరి కంట తడి పెట్టేలా చేస్తోంది.