Begin typing your search above and press return to search.

కోహ్లీ‌ స్థానంలో బ్యాటింగ్‌కి జార్వో..టీమిండియా ఫ్యాన్ అత్యుత్సహం

By:  Tupaki Desk   |   28 Aug 2021 6:30 AM GMT
కోహ్లీ‌ స్థానంలో బ్యాటింగ్‌కి జార్వో..టీమిండియా ఫ్యాన్ అత్యుత్సహం
X
ఇండియా -ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో నిన్న ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఫేమస్ ప్రాంక్ స్టార్ జార్వో మరోసారి నవ్వులు పూయించాడు. ఏకంగా భారత్ తరఫున బ్యాటింగ్ చేసేందుకు మైదానంలోకి సరాసరిగా వచ్చేశాడు. స్టార్ ఓపెనర్, హాఫ్ సెంచరీ హీరో రోహిత్ శర్మ ఔటవ్వగానే, ప్యాడ్లు, హెల్మెట్ ధరించిన జార్వో, కెప్టెన్ విరాట్ కోహ్లీకి బదులు మైదానంలోకి దిగాడు. టీమిండియా జెర్సీ ధరించి ఉండటం, అచ్చం బ్యాట్స్‌మన్ తరహాలో హెల్మెట్, ఫ్యాడ్స్‌ ని కూడా వేసుకుని ఉండటంతో సెక్యూరిటీ సిబ్బంది ఏమరపాటులో చూస్తూ ఉండిపోయారు. అతను భారత బ్యాట్స్‌మెన్ కాదు, జార్వో అని గుర్తించిన ఫీల్డ్ అంపైర్లు.సెక్యూరిటీ సిబ్బందిని అలెర్ట్ చేశారు. ఆ తర్వాత జార్వోని క్రీజు నుంచి మైదానం వెలుపలికి సెక్యూరిటీ సిబ్బంది ఈడ్చి పారేశారు.

టీమిండియా తరఫున జార్వో ఆడేందుకు ఇలా మైదానంలోకి రావడం ఇది రెండోసారి. ఇటీవల లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత బౌలర్లు ఇంగ్లాండ్ వికెట్ పడగొట్టేందుకు శ్రమిస్తున్న వేళ.. భారత్ జట్టు జెర్సీ ధరించి మైదానంలోకి వచ్చిన జార్వో.. బౌలింగ్ చేసేందుకు కూడా రెడీ అయ్యాడు. ఈ క్రమంలో సెక్యూరిటీ సిబ్బంది అతడ్ని అడ్డుకోగా, జెర్సీపై ఉన్న బీసీసీఐ లోగోని వారికి చూపించిన జార్వో తాను భారత క్రికెటర్‌ని అంటూ వారితో వాదించాడు. కానీ అతడ్ని అప్పట్లో సెక్యూరిటీ సిబ్బంది మైదానం వెలుపలికి ఈడ్చేశారు. లార్డ్స్‌ లో జార్వో వాదన విన్న సిరాజ్ మైదానంలోనే పడిపడి నవ్వాడు.

శుక్రవారం లీడ్స్ స్టేడియంలోనూ రోహిత్ శర్మ ఔట్ తర్వాత, విరాట్ కోహ్లీ క్రీజుకి వచ్చేందుకు సిద్ధమవగా , జార్వో హడావుడి చేశాడు. తాను నెం.4లో బ్యాటింగ్ చేస్తానని సెక్యూరిటీ సిబ్బందిని జార్వో రిక్వెస్ట్ చేస్తూ కనిపించాడు. దాంతో.. మరోసారి అతడ్ని మైదానం వెలుపలికి సెక్యూరిటీ సిబ్బంది ఈడ్చి పారేశారు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కి వచ్చాడు. మొత్తంగా జార్వోపై ఇప్పుడు సోషల్ మీడియాలో జోక్‌లు పేలుతున్నాయి.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ లో తమదైన ఆటతో ఆకట్టుకుంటుంది. ఫస్ట్ ఇన్నింగ్స్‌ లో 78 పరుగులకే కుప్పకూలి పరువు తీసుకున్న కోహ్లీసేన , రెండో ఇన్నింగ్స్‌లో స్పూర్తిదాయక పోరాటం చేస్తోంది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (156 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 59) రాణించగా, చతేశ్వర్‌ పుజారా (180 బంతుల్లో 15 ఫోర్లతో 91 బ్యాటింగ్‌) సెంచరీకి చేరువయ్యాడు. కెప్టెన్‌ కోహ్లీ (94 బంతుల్లో 6 ఫోర్లతో 45 బ్యాటింగ్‌) క్రీజులో పాతుకుపోయాడు. 80 ఓవర్లు అంటే దాదాపు రోజంతా (సాధారణంగా 90 ఓవర్లు) బ్యాటింగ్‌ చేసిన టీమిండియా కేవలం రెండే వికెట్లు సమర్పించుకుంది. మూడో రోజు ఆట నిలిచే సమయానికి భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లకు 215 పరుగులు చేసింది. రాబిన్సన్, ఓవర్టన్‌లకు చెరో వికెట్‌ దక్కింది. ప్రస్తుతం భారత్‌ ఇంకా 139 పరుగులు వెనుకబడే ఉంది. '