Begin typing your search above and press return to search.

మోడీకి బిస్కట్ వేసిన జపాన్ ప్రధాని

By:  Tupaki Desk   |   12 Dec 2015 10:12 AM GMT
మోడీకి బిస్కట్ వేసిన జపాన్ ప్రధాని
X
గజకర్ణ గోకర్ణ విద్యల్లో ఆరితేరిపోయిన ప్రధాని మోడీని మించిపోయే నాయకుడు ఇండియాకు వచ్చారు. మోడీని చూసి ఇన్ స్పైర్ అయ్యారో లేదంటే సహజంగా ఆయనకూ ఆ టాలెంటు ఉందో ఏమో కానీ జపాన్ ప్రధాని షింజో అబే నేను మోడీకి తాతలాంటోడిని అన్నంతలా మాటలతో మెప్పించేస్తున్నారు. మూడు రోజుల భారత పర్యటనకు వచ్చిన అబే మన మోడీని ఆకాశానికెత్తేశారు. ఆ దెబ్బకు మోడీసారు 'గాల్లో తేలినట్లుందే' అనుకుంటూ తెగ సంబరపడిపోతున్నారట. ఇంతవరకు బీజేపీలో మోడీ వీరాభిమానులు గానీ, ప్రభుత్వంలో ఉన్న మోడీ భజనపరులు గానీ పొగడని స్థాయిలో జపాన్ ప్రధాని మన మోడీని పొగిడిపొగిడి వదిలేశారు. డెవలప్ మెంట్ విషయంలో మోడీ స్పీడు బుల్లెట్ ట్రైన్ లా ఉందని జపాన్ ప్రధాని శనివారం అన్నారు. ఆ మాట డైరెక్టుగా మోడీకి బుల్లెట్ లాగే తగిలిందని చెప్తున్నారు బీజేపీ నేతలు... ఆ మాట వినగానే మోడీ చెవుల్లో వెయ్యి వీణలు మోగినంత ఆనందం కలిగిందట.

శుక్రవారం ఇండియాకు వచ్చిన జపాన్ ప్రధాని అబే శనివారం మోడీతో సమావేశమవుతారు. అయితే... ఈ లోగా ఆయన వాణిజ్యవేత్తల సదస్సుకు అటెండయ్యారు. అక్కడ ఆయన మాట్లాడుతూ మోడీ వేగం బుల్లెట్‌ రైలు వేగంతో సమానంగా ఉందని ప్రశంసించారు. ఆర్థిక విధానాల‌ను వేగంగా అమ‌లు చేయ‌డం చాలా అవ‌స‌ర‌మ‌ని అభిప్రాయపడిన అబే.. మోడీ ఆర్థిక విధానాలను చాలా వేగంగా అమ‌లు చేస్తున్నార‌ని చెప్పారు.

మనలో మన మాట.. ఇంతకీ అబే మన మోడీని అంత హైరేంజిలో ఎందుకు పొగిడారో తెలుసా. అహ్మదాబాద్ నుంచి ముంబయి వరకు 500 కిలోమీటర్ల బుల్లెట్ రైలు సిస్టమ్ ను ఇండియా ఏర్పాటు చేయబోతోంది. ఆ పని జపాన్ కు ఇవ్వాలనుకుంటోంది. సుమారు లక్ష కోట్లు ప్రాజెక్టు కావడంతో జపాన్ ఫుల్ ఖుషీగా ఉంది.. అందుకే ఆ పొగడ్తలు. అంతేకాదు... ఈమధ్య ఇండోనేషియాలో ఇలాంటి ప్రాజెక్టు ఏర్పాటు చేసే అవకాశం జపాన్ కు అందినట్లే అంది చేజారిపోయి చైనా చేతిలో పడింది. ఇండియాలో అలా జరగకుండా ఉండేందుకు గాను షింజో ముందుజాగ్రత్తగా మోడీకి బిస్కట్లు వేస్తున్నారు. ప్రచార పిచ్చి ఉన్న ఇండియా ప్రధానిని పొగడ్తలతో పడగొట్టొచ్చని ప్రపంచమంతా అర్థం చేసుకున్నట్లుగా ఉంది.