Begin typing your search above and press return to search.

ఆ మంత్రిపై ఆధారాలతో సహా జనసేన సంచలనం

By:  Tupaki Desk   |   19 July 2021 3:30 PM GMT
ఆ మంత్రిపై ఆధారాలతో సహా జనసేన సంచలనం
X
జనసేన పార్టీ మరో సంచలన ఆరోపణలు చేసింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ కేబినెట్ లోని కీలక మంత్రులపై ఈ ఆరోపణలు గుప్పించింది. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్కాంకు పాల్పడ్డారని.. తాడేపల్లిలోని క్యాపిటల్ బిజినెస్ పార్క్ కు లబ్ధి చేకూర్చేందుకు జీవో 61 తీసుకొచ్చారని జనసేన అధికార ప్రతినిధి పోతిన వెంకట్ మహేష్ ఆరోపించారు.

నలుగురు పార్టనర్లు వెల్లంపల్లి పక్కనే ఉంటారని ఆరోపించారు. జీవో 61 ద్వారా మంత్రి వెల్లంపల్లి మిత్ర బృందానికి రూ.30 కోట్ల రూపాయల రాయితీలు ఇచ్చారని మహేష్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.

విజయవాడ వస్త్రలత కాంప్లెక్స్ ని ఖాళీ చేయాలని ఒత్తిడి చేయించి.. బిజినెస్ పార్క్ కు తరలించాలని మంత్రి వెల్లంపల్లి చూస్తున్నారని మహేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇండస్ట్రియల్ కారిడార్ లో లేని ఒక ప్రైవేటు రియల్ ఎస్టేట్ కంపెనీ కోసం జీవో ఇచ్చారని.. సీఎం దృష్టిలో లేకుండా పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి ఈ జీవో తెచ్చారని మహేష్ ఆరోపించారు. ఇద్దరు మంత్రులు కలిసి ఈ కమిషన్ పంచుకుంటారని జనసేన అధికార ప్రతినిధి ఆరోపించారు.

మంత్రి వెల్లంపల్లికి ఈ వ్యవహారంతో సంబంధం లేదని విజయవాడ కనక దుర్గమ్మపై ప్రమాణం చేసి నిరూపించుకోవాలని మహేష్ డిమాండ్ చేశారు. జీవో 61తో కానీ.. జీవోతో లబ్ది పొందిన వ్యక్తులతో కానీ సంబంధం లేదని దుర్గమ్మపై ప్రమాణం చేయాలని చాలెంజ్ విసిరారు. తప్పు చేయకుంటే ధైర్యంగా శుక్రవారం మంత్రి దుర్గమ్మ కొండకు వచ్చి ప్రమాణం చేయాలని.. తాము సైతం వస్తామని జనసేన సవాల్ చేసింది.