Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ కు షాకిచ్చిన జనసేన

By:  Tupaki Desk   |   19 Jun 2020 5:30 PM GMT
పవన్ కళ్యాణ్ కు షాకిచ్చిన జనసేన
X
జనసేనాని పవన్ కళ్యాణ్ కు గట్టి షాక్ తగిలింది. జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి ఓటు వేయడం సంచలనంగా మారింది. తాను వైసిపి అభ్యర్థికి ఓటు వేశానని రాపాక స్వయంగా అంగీకరించడం విశేషం. ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలనే దానిపై జనసేన పార్టీ నుండి తనకు ఎలాంటి సూచనలు రాలేదని ఆయన పేర్కొన్నారు. ఇది తన ఓటు అని, అభ్యర్థిని ఎన్నుకోవడం తన ఇష్టమని రాపాక కుండబద్దలు కొట్టారు.

"ఇది నా ఓటు, ఇది నా కోరిక" అని రాపాకా ఓటేసిన అనంతరం వ్యాఖ్యానించారు. తాను జనసేన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నానని.. జనసేన పార్టీ నుంచి నాకు ఎలాంటి సూచనలు రాలేదని అన్నారు. అందుకే రాజ్యసభ ఎన్నికల్లో తనకు నచ్చిన పార్టీకి, నాకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేశానని రాపాక హాట్ కామెంట్స్ చేశారు.

అధికార పార్టీ అభ్యర్థికి ఓటు వేయడం ఎల్లప్పుడూ మంచిదని రాపాక అన్నారు. రాజ్యసభ ఎన్నికలలో టిడిపి ఎటువంటి కఠినమైన పోటీ ఇవ్వడం లేదని, నామమాత్రపు పరువు కోసం పోటీకి నిలబట్టిందని ఆయన అన్నారు.

మొత్తం ఏపీ అసెంబ్లీలో 175 మంది ఎమ్మెల్యేలున్నారు. పాలక వైయస్ఆర్సిపికి 151 మంది ఎమ్మెల్యేలు, టిడిపికి 23 మంది ఎమ్మెల్యేలున్నారు. ఇందులో ముగ్గురు టీడీపీకి వ్యతిరేకంగా అసమ్మతి రాజేశారు. ఇక ఒక జనసేన ఎమ్మెల్యే ఉన్నారు. పోటీ చేసిన నాలుగు రాజ్యసభ స్థానాల్లో వైయస్ఆర్సిపి సునాయాసంగా గెలిచేసింది.