Begin typing your search above and press return to search.

పవన్ జోలికొస్తే క్రిమినల్ కేసులే..జనసేన స్ట్రాంగ్ వార్నింగ్

By:  Tupaki Desk   |   26 Feb 2020 2:30 PM GMT
పవన్ జోలికొస్తే క్రిమినల్ కేసులే..జనసేన స్ట్రాంగ్ వార్నింగ్
X
సోషల్ మీడియాను వేదికగా చేసుకొని గత రెండుమూడు రోజులుగా కొందరు వ్యక్తులు పవన్ కల్యాణ్ ని - జనసేన పార్టీని విమర్శిస్తున్నారని - కొన్ని వీడియోల ద్వారా పార్టీ సిద్ధాంతాలపై తప్పుడు ప్రచారానికి దిగుతున్నారని జనసేన లీగల్ సెల్ కోఆర్డినేటర్ సాంబశివ ప్రతాప్ తెలిపారు. ఈ మేరకు అలాంటి వారందరికీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ సంచలన ప్రకటన జారీ చేశారు.

తమ పార్టీ అధినేతపై - ముఖ్యనేతలపై విమర్శలు చేస్తూ తప్పుడు ప్రచారాలకు దిగుతున్న వాళ్లపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పేర్కొన్న జనసేన లీగల్ సెల్.. వాళ్లందరికీ కోర్టుకు ఈడ్చుతామని హెచ్చరిస్తూ ఫైర్ అయింది. ఇలా తప్పుడు ప్రచారానానికి దిగిన వారిపై చర్యలు తీసుకునే అంశానికి సంబంధించిన ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించామని, ముందుగా అలాంటి వారందరికీ లీగల్ నోలీసులు జారీచేసి, ఆ తర్వాత క్రిమినల్ కేసులు పెట్టేలా ప్రణాళిక రెడీ చేస్తున్నామని తమ ప్రకటనలో తెలిపింది జనసేన లీగల్ సెల్.

అయితే గతంలో జనసేన పార్టీ కోసం పనిచేసిన కొందరు నేతలే ఇతర పార్టీలకు అమ్ముడుపోయి.. ఇప్పటికీ మా జనసేన పార్టీలో ఉన్నామని చెప్పుకుంటూ సామాజిక మాధ్యమాల్లో ఇలా కామెంట్లు చేస్తున్నారని జనసేన లీగల్ సెల్ ఆరోపించింది. జనసేన పార్టీని - విధానాలను - ముఖ్యనాయకులను - కార్యనిర్వాహకులను కించపరుస్తున్నారని.. పవన్ కళ్యాణ్ పట్ల కనీస అభిమానం లేనివాళ్లే ఈ తరహాలో తప్పుడు ప్రచారానికి దిగుతున్నారని జనసేన లీగల్ సెల్ తమ ప్రకటనలో తెలిపింది.

దీంతో ఈ ఇష్యూ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. గతంలో పార్టీలో పనిచేసి ఇతర పార్టలకు వెళ్లిన ఆ వ్యక్తులు ఎవరు? అనే దానిపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో జనసేనలో ఉన్నారో లేరో తెలియని ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ - పవన్ పై తరచూ కామెంట్స్ చేస్తున్న శ్రీరెడ్డి - గతంలో పవన్ కు క్లోజ్ గా వ్యవహరించిన రాజా రవితేజ లాంటి వారిపై పార్టీ వర్గాల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయని సమాచారం.