Begin typing your search above and press return to search.

ఆ యువ ఎంపీలను నమ్మిన జగన్.. కారణమేంటి?

By:  Tupaki Desk   |   3 March 2021 3:30 AM GMT
ఆ యువ ఎంపీలను నమ్మిన జగన్.. కారణమేంటి?
X
ఏపీ సీఎం జగన్ తన పాలనలో ఎక్కడా లోపం రాకుండా చూసుకుంటున్నాడు. ముఖ్యంగా లాబీయింగ్లో తేడాలు వస్తే మొదటికే మోసం వస్తుంది. అందువల్ల అలాంటి స్థానాల్లో దమ్మున్న నేతలను నియమిస్తున్నాడు. తాజాగా ఇద్దరు యువ ఎంపీలకు సీఎం జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. సీఎంకు ముఖ్యమైన కొన్ని వ్యవహారాలను చక్కబెట్టేందుకు వారిని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. ఓ వైపు రాష్ట్రంలో ప్రతిపక్షాల నుంచి ధీటుగా ఢీకొనడం.. మరోవైపు కేంద్రంతో సత్సంబంధాలు నెలకొల్పేలా జగన్ ఈ నిర్ణయాలను తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నా.. కొన్ని చోట్ల టీడీపీతో ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా టీడీపీలో ఉన్న ముగ్గురు ఎంపీలతో పాటు రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ వంటివారిని ఎదుర్కొనేందకు ఒక ధీటైన ఎంపీ కావాలి. అందుకు సీఎం జగన్ నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులును ఎంపిక చేశాడని వైసీపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.. ఈయన టీడీపీకి చెక్ పెట్టడంతో పాటు ప్రధానితో పార్టీ అనుసంధానం ఉండేలా శ్రీకృష్ణను నియమించినట్లు తెలుస్తోంది. టీడీపీలో ఉన్న రామ్మోహన్ వంటి యువనేతను పోటీగా మరో యువనేతకే అవకాశమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు విజయసాయిరెడ్డి ఆ బాధ్యతలు చూసేవాడు. ఇప్పుడీ బాధ్యతలను లావు చూడనున్నట్టు ఇన్ సైడ్ టాక్.

ఇక కేంద్రం నుంచి రాష్ట్రానికి కావాల్సిన నిధులతో పాటు ఇతర అంశాల్లో పార్టీ తరుపున మాట్లాడేందుకు మరో ఎంపీ మార్గాని భరత్ ను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు జగన్. మార్గాని బీసీ నేత కావడంతో ఆయనకు బీసీల సమస్యలు పరిష్కరించాలని జగన్ సూచించారట. ఇటీవల బీజేపీ పెద్దల వద్ద పార్టీ తరుపున ఆయన జగన్ నాడిని వినిపించాడట. అందుకే ఈయనకు బాధ్యతలను అప్పగించారని సమాచారం.. ఇప్పటి వరకు ఈయన స్థానంలో కడప ఎంపీ అవినాష్ చూశారు. ఇప్పటి నుంచి భరత్ బాధ్యత వహించనున్నారు.

రాష్ట్రంలో ఇలాంటి బాధ్యతలను అప్పగించే బాధ్యత ఇప్పటివరకు ఎంపీ విజయసాయిరెడ్డి చూసేవారు. ఆయన కనుసన్నల్లోనే నియామకాలు జరిగేవి. కానీ ఈ ఇద్దరు ఎంపీలను మాత్రం జగన్ స్వయంగా నియమించాడట. అంతేకాకుండా విజయసాయిరెడ్డి ప్లేసులో లావు కృష్ణకు బాధ్యతలను అప్పగించడంపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు. కాగా వీరు వచ్చే బడ్జెట్ తదుపరి సమావేశాల నుంచి పనిచేయనున్నారని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.