Begin typing your search above and press return to search.

కోల్డ్ స్టోరేజీలోకి అమరావతి!?

By:  Tupaki Desk   |   13 Sep 2019 12:54 PM GMT
కోల్డ్ స్టోరేజీలోకి అమరావతి!?
X
ఏపీ రాజ‌ధాని న‌గ‌రం అమ‌రావ‌తి విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన - వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌పై ముఖ్యమంత్రి జగన్ వేచిచూసే ధోరణి అనుసరించారు. ప్రతి విషయంలో నిర్మాణాత్మకంగా వ్యవహరించే పది కాలాల పాటు పార్టీని అధికారంలో ఉంచడం ఎలా అన్న కోణంలోనే జగన్ ఆలోచనలు తిరుగుతున్నాయి. ఇప్పటికే ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్న జగన్... తాజగా రాజధాని అమరావతిపై కీలక నిర్ణయం తీసుకున్నారు. సెంటర్ లో ఉండాలి అనే ఏకైక కారణంతో అనేక విషయాలను పక్కన పెట్టి... చంద్రబాబు మొండిగా అమరావతిని ఎంపిక చేశారు. ఆ మూసను వదిలేసి దీనిపై అధ్యయనం చేయాలని జగన్ నిర్ణయించారు. అందుకోసం తాజాగా ఒక కమిటీని నియమించారు.

అస‌లు రాజ‌ధానిని ఏం చేద్దాం? కొనసాగించాలా? మార్చాలా? ఎక్క‌డ నిర్మించాలి? ఎలా నిర్మించాలి? అన్ని ఒక్క‌చోటే నిర్మించాలా? లేక వికేంద్రీక‌రించాలా? వికేంద్రీక‌రిస్తే.. ఎక్క‌డెక్క‌డ ఏమేం ఉండాలి ? ఎలా ఉండాలి ? అనే విష‌యాలు తేల్చేందుకు తాజాగా జ‌గ‌న్ ఓ క‌మిటీని ఏర్పాటు చేసిన‌ట్టు తెలిసింది. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల కావాల్సి ఉంది. వాస్త‌వానికి ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అమ‌రావ‌తిపై అటు రాజ‌కీయాల్లో కానీ - ఇటు సాధార‌ణ ప్ర‌జ‌ల్లో కానీ.. ఓ వ‌ర్గం వారికి మాత్ర‌మే ఆస‌క్తి ఉంది.

అదే స‌మ‌యంలో అమరావతి ముంపు ప్రాంతంలో ఉండటంతో ఇక్క‌డ భ‌వ‌నాల నిర్మాణానికి కోట్ల రూపాయ‌లు అద‌నంగా ఖ‌ర్చు చేయాల్సిన ప‌రిస్థితి ఉంది. ఇక‌, ఇప్పుడున్న ప‌రిస్థితిలో రాజ‌ధాని అంటే.. కేవ‌లం ఓ వ‌ర్గం ప్ర‌జ‌ల‌కు మాత్ర‌మే చేరువ అయింది. అలాంటి ప‌రిస్థితి ఇక‌పై ఉండ‌రాద‌ని కోరుకునే వారు కూడా ఉన్నారు. ఉదాహ‌ర‌ణ‌కు హైద‌రాబాద్ విష‌యా న్ని తీసుకుంటే.. ఇక్క‌డ అన్నీ ఒకే చోట నిర్మాణం జ‌రిగాయి. అభివృద్ది అంతా కూడా హైద‌రాబాద్‌ కే ప‌రిమితమైంది. జై ఆంధ్ర ఉద్యమం తర్వాత జాతీయ పార్టీ కాంగ్రెస్ ను పక్కన పెడితే ప్రాంతీయ పార్టీ అయిన తెలుగుదేశం చేతిలోనే అధికారం ఎక్కువ కాలం ఉంది. తెలుగుదేశం ముఖ్యమంత్రులు కాని - ఇతర ముఖ్యమంత్రులు కాని వికేంద్రీకరణపై దృష్టిపెట్టకపోవడంతో పరిశ్రమలు - సేవలు - అవకాశాలు అన్నీ హైదరాబాదుకు మాత్రమే పరిమితం అయ్యాయి. రాష్ట్ర విభ‌జ‌న‌ మలి ఉద్యమానికి హైదరాబాదు వంటి బంగారు బాతు కూడా ఒక కారణమనే చెప్పాలి. నాడు తెలంగాణ‌లో ఒక్క హైద‌రాబాద్ మాత్ర‌మే కాకుండా రెండు - మూడు పెద్ద న‌గ‌రాల అభివృద్ధి జ‌రిగి ఉంటే ప‌రిస్థితి వేరుగా ఉండేది. వైఎస్ అధికారంలోకి వచ్చేవరకు వికేంద్రీకరణ అన్న కాన్సెప్టే లేదు.

విభజిత అనంతరం ఏపీలో కూడా చంద్రబాబు అదే పాత పద్ధతిని అవలంభించారు. అమ‌రావ‌తిలోనే అభివృద్ధి అంతా కేంద్రీకృత‌మ‌య్యే ఆలోచ‌న‌ల‌తోనే ముందుకు వెళ్లారు. 13 జిల్లాల ఆదాయాన్ని తీసుకెళ్లి ఒక కేంద్రంలో పెట్టడానికి సిద్ధమయ్యారు. అయితే గ‌తానుభ‌వాల దృష్ట్యా అలాంటి ప‌రిస్థితి ఏపీలో ఉండ‌రాద‌నేది జ‌గ‌న్ ఆలోచన. మేధావుల వర్గం ఆలోచ‌న‌ కూడా ఇదే. ఇప్ప‌టికే రాష్ట్రంలో వెనుక‌బ‌డిన ప్రాంతాలుగా ఉన్న వాటిని అభివృద్ధి చేసేందుకు క‌నుక ప్ర‌య‌త్నాలు చేయ‌క‌పోతే.. అక్క‌డ కూడా ప్ర‌త్యేక రాష్ట్రాల డిమాండ్లు వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. అపుడు మళ్లీ అమరావతి గొడవకు కేంద్రమయ్యే ప్రమాదం లేకపోలేదు.

రాయ‌ల‌సీమ‌ - ఉత్త‌రాంధ్ర వంటి జిల్లాల్లో వెనుక‌బ‌డ్డామ‌నే అభిప్రాయం ప్ర‌బ‌లంగా ఉంది. త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌నే ఆవేద‌న కూడా ఉంది. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల‌ను అభివృద్ది చేయ‌డం , కీల‌క శాఖ‌ల‌ను ఆయా జిల్లాల‌కు త‌ర‌లించ‌డంద్వారా అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణకు అవ‌కాశం ఉంటుంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో రాజ‌ధాని విష‌యంలో స‌రైన పంథాను సూచించేందుకు జ‌గ‌న్ నియ‌మించిన క‌మిటీ కృషి చేయ‌నుంది. ఈ క‌మిటీకి ఆరు మాసాల గ‌డువు కేటాయించారు. అనంత‌రం ఈ క‌మిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ముందుకు వెళ్ల‌నున్నారు. ఇక రాజ‌ధానిపై ఇప్ప‌టికే విప‌క్షాలు ప్ర‌జ‌ల్లో పెద్ద క‌న్‌ ఫ్యూజ‌న్ క్రియేట్ చేశాయి. వైసీపీ నేత‌లు ఒక‌రిద్ద‌రు చేసిన వ్యాఖ్య‌లు కూడా ఇందుకు కార‌ణ‌మ‌య్యాయి. ఇక ఆరు నెల‌ల పాటు క‌మిటీ అధ్య‌య‌నం చేయ‌డంతో అప్ప‌టి వ‌ర‌కు దీనిపై ఎవ్వ‌రూ కామెంట్ చేసినా చేసేదేం ఉండ‌దు.

అయితే, జగన్ నిర్ణయంపై ఇంకో వాదన కూడా వినిపిస్తోంది. అమరావతి ఉంచాలా? వద్దా? ఉంచితే ఎంత మేరకు అనే విషయంపై కమిటీ వేయడం అంటే... ఆర్నెల్ల పాటు అమరావతిని కోల్డ్ స్టోరేజీలో ఉంచడమే. అమరావతిపై వంద శాతం ఆమోదం ముఖ్యమంత్రికి గాని - జనాలకు కాని లేదన్నట్లే అనుకోవాలి. ఇటీవలే ఒక ఆంగ్ల మీడియా అమరావతి గురించి రాస్తూ... చంద్రబాబు కలల ప్రాజెక్టు వేగంగా ఘోస్ట్ టౌన్ గా మారిపోతుందని రాసింది. వాస్తవానికి అమరావతిలో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు తప్ప టౌనే లేదు. ఇప్పటికే భూములు రైతులకు అప్పగించకపోవడం - రిటైల్ లెవెల్లో రియల్ ఎస్టేట్ ను నియంత్రించడంతో ప్రభుత్వ తాత్కాలిక భవనాలు మినహాయిస్తే... అక్కడ శాశ్వత కేంద్రాలు ఏమీ నిర్మితం కాలేదు. కానీ... ఒక నగరాన్నే తరలిస్తున్న ప్రచారం మాత్రం గట్టిగా సాగుతోంది. లేని నగరాన్ని, ఇంకా కట్టని నగరాన్ని తరలించడం ఎలా సాధ్యమో అన్న సెటైర్లు కూడా పడుతున్నాయి.