Begin typing your search above and press return to search.

తాడేప‌ల్లికి జ‌గ‌న్‌!... ఇక అంతా ఇక్క‌డి నుంచే!

By:  Tupaki Desk   |   9 May 2019 10:51 AM GMT
తాడేప‌ల్లికి జ‌గ‌న్‌!... ఇక అంతా ఇక్క‌డి నుంచే!
X
ఏపీ అసెంబ్లీకి జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో కీల‌క ఘ‌ట్ట‌మైన పోలింగ్ ముగిసి ఇప్ప‌టికే దాదాపుగా నెల రోజులు అవుతోంది. ఫ‌లితాల వెల్ల‌డికి ఇంకా 15 రోజుల స‌మ‌యం ఉంది. ఈ నెల 23న ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి. పోలింగ్ కు, కౌంటింగ్ దాదాపుగా నెల‌న్న‌ర గ్యాప్ ఉన్న నేపథ్యంలో ఎన్నిక‌ల ప్ర‌చారంలో క‌ష్ట‌ప‌డి ప‌నిచేసిన నేత‌లంగా కాస్తంత విశ్రాంతి తీసుకున్నారు. ఈ క్ర‌మంలో వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కూడా మొన్నామ‌ధ్య ఫ్యామిలీతో క‌లిసి ఫారిన్ టూర్ వెళ్లివ‌చ్చారు. తాజాగా ఆయ‌న హైద‌రాబాద్ లోని లోట‌స్ పాండ్ లో ఉంటూ పార్టీ ప‌నుల‌ను చ‌క్క‌బెట్టుకుంటున్నారు.

ఫ‌లితాల వెల్ల‌డికి స‌మ‌యం ఆస‌న్న‌మవుతున్న నేప‌థ్యంలో త‌న మ‌కాంను పూర్తిగా అమ‌రావ‌తికి మార్చేందుకు కూడా ఆయ‌న ప్లాన్ చేసుకుంటున్నారు. అమరావ‌తికి స‌మీపంలోని తాడేప‌ల్లిలో ఇంటితో పాటు పార్టీ కేంద్ర కార్యాల‌యాన్ని కూడా నిర్మించుకున్న జ‌గ‌న్... ఇటీవ‌లే దానికి ప్రారంభోత్స‌వం కూడా చేశారు. ఈ క్ర‌మంలో ఇక‌పై ఇక్క‌డే ఉంటార‌ని అంతా భావించినా.. అధికార పార్టీ కుట్ర‌ల వ‌ల్ల ఎన్నిక‌ల్లో త‌న ప్లాన్ ఎక్క‌డ బ‌య‌ట‌ప‌డుతుందోన‌న్న ఆందోళ‌న‌తో జ‌గ‌న్‌... ఇప్ప‌టికీ హైద‌రాబాద్ లోనే ఉంటూ వ‌స్తున్నారు. అయితే ఇక‌పై అధికార పార్టీ కుట్ర‌లు సాగ‌బోవ‌ని, ఎన్నిక‌ల్లో గెలిచేది వైసీపీనేన‌ని ఇప్ప‌టికే ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్న జ‌గ‌న్‌... మ‌రో వారం రోజుల్లో తాడేప‌ల్లికి రానున్నారు. ఇక‌పై ఇక్క‌డి నుంచే మొత్తం వ్య‌వ‌హారాల‌న్ని న‌డిపించాల‌ని కూడా ఆయ‌న నిర్దేశించుకున్న‌ట్లు స‌మాచారం.

తాడేప‌ల్లికి రాగానే... పార్టీ శ్రేణుల‌ను ఫుల్ యాక్టివేట్ చేసేందుకు జ‌గ‌న్ ప‌క్కాగానే ప్ర‌ణాళిక‌ను ర‌చించుకున్న‌ట్లు తెలుస్తోంది. ఎన్నిక‌ల కౌంటింగ్‌ కు సంబంధించి ఎలా వ్యవ‌హ‌రించాల‌న్న విష‌యంపై కౌంటింగ్ ఏంజెంట్ల‌కు ఈ నెల 16న విజ‌య‌వాడ‌లోని ఏ1 క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ లో ప్రత్యేకంగా శిక్ష‌ణా త‌ర‌గ‌తుల‌ను నిర్వ‌హించనున్నార‌ట‌. ఈ కార్య‌క్ర‌మం ముగిసి... కౌంటింగ్ కు రంగం సిద్ధం అవుతున్న త‌రుణంలో ఈ నెల 21న ఈ సారి ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేసిన నేత‌ల‌తో జ‌గ‌న్ ప్ర‌త్యేకంగా భేటీ కానున్నార‌ట‌. అంతేకాకుండా కౌంటింగ్ స‌ర‌ళిని తాడేప‌ల్లిలోని కార్యాల‌యంలో ఉండే ఆయ‌న ప‌రిశీలిస్తారట‌. మొత్తంగా తాడేప‌ల్లి కేంద్రంగానే జ‌గ‌న్ త‌న వ్య‌వ‌హారాన్నింటినీ న‌డప‌నున్నార‌న్న మాట‌.