Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ పాద‌యాత్ర‌...షెడ్యూల్ ఇదేన‌ట‌

By:  Tupaki Desk   |   26 Oct 2017 5:47 AM GMT
జ‌గ‌న్ పాద‌యాత్ర‌...షెడ్యూల్ ఇదేన‌ట‌
X
ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌ - వైసీపీ అధినేత అధినేత వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి పాద‌యాత్ర‌పై అన్నివ‌ర్గాల్లోనూ ఆస‌క్తి నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. సీబీఐ కోర్టు నో చెప్ప‌డం ఒక‌వైపు... ఒక‌వైపు త‌న యాత్ర కొన‌సాగి తీరుతుంద‌ని వైఎస్ జ‌గ‌న్ స్ప‌ష్టం చేయ‌డం మ‌రోవైపు ఉన్న నేప‌థ్యంలో ఏపీ రాజ‌కీయాల్లో వైసీపీ అధినేత పాద‌యాత్ర స‌స్పెన్స్ రేకెత్తిస్తోంది. అయితే ఇవ‌న్నీ ఇలా ఉంటే...వైఎస్ జ‌గ‌న్ యాత్ర ఎలా సాగ‌నుంద‌నేది కూడా ఆస‌క్తిగా ఉంది. వైసీపీ నేత‌ల అభిప్రాయం ప్ర‌కారం వచ్చే నెల 6వ తేదీ నుంచి కడప జిల్లా ఇడుపుల పాయ నుంచే పాదయాత్రను చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. నవంబర్‌ 6న మొదలుపెట్టే పాదయాత్ర తొలుత కడప జిల్లాలోనే 8 రోజులపాటు సాగనుంది.

ఇడుపుల పాయ నుంచి ఇచ్ఛాపురం వరకు 6 నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా 3వేల కిలోమీటర్ల వరకు పాద యాత్రను నిర్వహించేందుకు జగన్‌ నిర్ణయించుకున్నారు. ప్రతి శుక్రవారం న్యాయస్థానంలో హాజరుకావాల్సి ఉండడం వంటి సాంకేతిక కారణాలతో జగన్‌ తన పాదయాత్ర షెడ్యూల్‌ను ఖరారు చేసుకున్నారు. రాయలసీమ జిల్లాల వరకు సుమారు 700 కిలోమీటర్ల పాదయాత్ర రూట్‌ మ్యాప్‌ ఖరారైంది. నవంబర్‌ 3వ తేదీన జగన్‌ తిరుమలకు వెళ్లి రాత్రి అక్కడే బస చేస్తారు. నవంబర్‌ 4వ తేదీ శనివారం తిరుమలలో వెంకటేశ్వరుని దర్శించుకొని, తదనంతరం రోడ్డు మార్గంలో కడపకు వచ్చి అక్కడ కడప దర్గా - కడపలోని కేథడ్రల్‌ చర్చిలలో జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. శనివారం రాత్రికి పులివెందులకు చేరుకుంటారు. నవంబర్‌ 5వ తేదీ ఆదివారం ఉదయం పులివెందుల్లోని సీయస్‌ ఐ చర్చిలో జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంటారు. అదేరోజు రాత్రికి ఇడుపులపాయకు చేరుకుంటారు.

వచ్చే నెల 6వ తేదీ ఉదయం ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద దివంగత ముఖ్యమంత్రి డా.వైఎ స్‌ సమాధి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక నివాళులర్పిస్తారు. ఆదివారం ఉదయం 11గంటలకు ముందుగానే పాద యాత్రను ప్రారంభించే ముందు ఇడుపులపాయలో నిర్వహించే బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ అక్కడికి వచ్చిన వైకాపా నేతలు - పార్టీ శ్రేణులు - ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడి నుంచి తన పాదయాత్రను ప్రారంభిస్తారు. ఇప్పటికే ఇడుపులపాయలో జరిగే బహిరంగ సభ ప్రదేశాన్ని వైకాపా నేతలు పరిశీలించారు. కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి - మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి - వైకాపా రాజ కీయ సలహాదారు - రాయలసీమ జిల్లాల వైకాపా ఇన్‌ ఛార్జ్‌ సజ్జల రామక్రిష్ణా రెడ్డి - శాసన సభ్యులు రవీంద్రనాథ రెడ్డి - రఘురామి రెడ్డి - శ్రీకాంత్‌ రెడ్డి - కోరముట్ల శ్రీనివాసులు - వైకాపా జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమర్నాథ రెడ్డి - తదిత రులు ఇడుపులపాయలో జరిగే బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. జగన్‌ తన పాదయాత్రలో భాగంగా కడప జిల్లాలో 8 రోజుల పాటు సుమారు 120 కిలోమీటర్ల దూరం పాదయాత్రను కొనసాగించనున్నారు. పులివెందుల - కమలాపురం - జమ్మలమడుగు - ప్రొద్దుటూరు - మైదుకూరు నియోజకవర్గాల్లో ఈ పాదయాత్ర సాగనుంది. అనంతరం వైఎస్‌ జగన్‌ కర్నూలు జిల్లాలో చాగలమర్రి వద్ద ప్రవేశించి జిల్లాలో అనంతపురం జిల్లా - చిత్తూరు జిల్లాల్లో తన పాద యాత్రను కొనసాగిస్తారు. ఈ పాదయాత్రలో భాగంగా వైఎస్‌ జగన్‌ ఎక్కువగా టీడీపీకి చెందిన శాసన సభ్యుల నియోజకవర్గాలు - మంత్రుల నియోజకవర్గాలనే టార్గెట్‌ చేస్తూ తన యాత్ర కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా వైకాపా నుంచి గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు - మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గాలలో తన పాదయాత్ర కొనసాగించేలా రూట్‌ మ్యాప్‌ ను జగన్‌ తయారు చేయించారు.ఈ నేపథ్యంలో వైఎస్‌ జగన్‌ వచ్చే ఏడాది మే 2వ తేదీ కల్లా తన పాదయాత్రను ముగించేందుకు రూట్‌ మ్యాప్‌ ను తయారు చేసుకున్నారు. రాయల సీమ జిల్లాల పాదయాత్ర కొనసాగుతుండగానే మిగతా జిల్లాల పాదయాత్ర రూట్‌ మ్యాప్‌ ను కూడా తయారుచేయడంలో వైకాపా నేతలు నిమగ్నమయ్యారు. సుమారు 120 నుంచి 125 నియోజకవర్గాల్లో ఈ పాదయాత్ర జరుగనుంది. ఆ తర్వాత మిగిలిన 50 లేదా 55 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర ద్వారా పర్యటనను కొనసాగించనున్నారని వైసీపీ వ‌ర్గాల స‌మాచారం.